బుధవారం, నవంబర్ 22, 2006

నా నెల్లూరు పర్యటన -6

ఆధ్యాత్మిక వాదులు: భౌతిక వాదులు

వీరి మధ్య చార్వాకుల కాలం నుంచీ ఆసక్తికరమమైన చర్చ జరుగుతూనే ఉంది. 'అద్వితీయ శక్తులున్న భగవంతుడున్నారనే వాళ్ళందరూ ఒక వుదాహరణ తప్పకుండా చూపుతారు. దేవుడే లేకుంటే ఈ భూమి క్రమం తప్పకుండా ఎలా తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది? ఇన్ని గ్రహాలు, నక్షత్ర మండలాలూ దేవుడి నిర్దేశం లేకపోతే ఎలా తమ తమ కక్ష్యల్లో అంత క్రమంగా తిరుగుతాయి?' http://www.charasala.com/blog/?p=116

మొదట్లో మానవ పరిణామ క్రమంలో మనిషికి ప్రక్రుతిలోని సహజ సిద్ధమైన అగ్ని,
వర్షం, స్త్రీ గర్భం దాల్చి శిశువును కనటం లాంటివన్నీ ఎంతో వింతగా సంభ్రమాచ్యారాలు కలిగించేవిగా ఉన్నాయి. తనకు అర్థం కాని ఈ విషయలన్నింటినీ తనకు తెలియని ఎదో శక్తి నడిపిస్తోందనీ. ఆ శక్తే దైవమని నమ్మాడు. ఈ క్రమంలో అగ్ని దేవుడు, వరుణ దేవుడు,ఆది శక్తి జనించారు. భూగొళానికి వెలుగునిచ్చే సూర్యుని, చంద్రుడిని దేవుళ్లన్నాడు. గ్రహణాలకు అచ్చెరువొంది రాహు, కేతులు సూర్య చంద్రులను మింగేంస్తున్నారని అపోహపడ్డాడు. ఇంకా కాలక్రమంలో గ్రామ దేవతలు, ముక్కోటి దేవుళ్ళు వెలిశారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు అగ్ని, వర్షం ఇంకా సృష్టి రహస్యాలు కనుక్కుంటున్న ఈ తరుణంలో ఆదిమ మానవుడి ఎన్నో సందేహాలకు , భయాలకు సమాధానం లభించింది. Darwin’s theory of evolution ను God's intelligent design గా మార్చి తమదే పైచేయి అందామనుకున్న మత చాందసులకు ఈ నూతన శాస్త్ర పరిశోధనలు మింగుడు పడటం లేదు.



చంద్రుడిపై మానవుడు కాలు మోపటం అబద్దమని, దాన్ని విశ్వసించవొద్దనీ ఈ చాందసవాదులు చెప్తున్నారు. ‘ఎదీ శూన్యం లోంచి రాదు‘ అని భౌతికవాదులు నమ్ముతారు. అట్లా వస్తే అది మాయా, మహిమా కాదు కనికట్టు అంటారు హేతువాదులు. శాస్త్రవేత్తలు గ్రహాలు,పాలపుంతలను దాటి మన ఊహకు అందని దూరంలో ఉన్న విశ్వ రహస్యాల ఆవిష్కరణకై నిరంతరం శ్రమిస్తున్నారు. మనకు ఒక విషయం తెలియనప్పుడు అది ఎంతో జటిలంగా కనపడుతుంది. ఆది మానవుడి ఊహకు అగ్ని, వర్షం పెద్ద పరీక్షే. ఈ రోజుకీ అంతుపట్టని విషయాలు ఇంకా ఉన్నాయి. ఒక దాని వెంబడి మరొకటిగా అన్ని చిక్కు ముడులూ విడుతున్నాయి.

ప్రశాంతి తను అప్పుడప్పుడూ వెంకయ్య స్వామితో మాట్లాడుతుందని నేను గతంలో రాసినదానిని కొంతమంది పాఠకులు తాము విశ్వసించజాలమని నాకు తెలిపారు. వెశేషమేమంటే ఇలా చెప్పినవారిలో ఆస్తికులు, నాస్తికులిరువురూ ఉన్నారు. దేవుడున్నడా లేడా అనే దానిపై చాలా చర్చ జరిగింది. ఉంటే దానికి నిదర్శన మేది అని హేతువాదుల ప్రశ్న. కంటికి కనిపించేదే సత్యమనీ, శాస్త్ర పరీక్షకు నిలిచేదే వాస్తవమనీ నమ్ముతారు వీరు. గాలి కనిపిస్తొందా - అయినా అది ఉంది కదా, అలాగే దేవుడున్నాడు కాని కనిపించడు అని ఆస్తికుల వాదన. దేవుడిని విశ్వసించేవారికే దేవుడు కనపడతాడు, మిగతా వారికి దేవుడు కనపడడని ఆస్తికుల వాదన. నిప్పు ఆస్తికులనూ , నాస్తికులనూ సమానముగా దహిస్తుంది. అట్లాగే దేవుడూ తను ఉంటే ఆస్తికులు,నాస్తికులిరువిరికీ ఇవ్వాలి దర్శనం అంటారు భౌతికవాదులు. ఈ వాద ప్రతివాదాలు అన్నీ వింటే దైవం వ్యక్తిగతమనీ, వస్తుగతం కాదనీ అవగతమౌతుంది. ఇంకాస్త ముందుకు వెళితే దేవునితో మాటలాడటం Schizophrenia అనే మానసిక స్థితి అని మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణ. మానవ మెదడులో ఎన్నో రసాయనాలుంటాయనీ, Dopamine అనే రసాయన లోపం వలన మెదడులోని Neurotransmission వ్యవస్థ సరిగా నియంత్రించ బడక Schizophrenia అనే స్థితికి కారకమౌతుందని Psychiatrists చెపుతారు. కొంతమంది బాబాలు తాము దేవునితో మాట్లాడుతాం అనే భ్రాంతిలో ఉండి, భక్తులనూ నమ్మిస్తారు. భక్తుల నమ్మికే ఈ బాబాలకు కొండంత అండ. విత్తు ముందా, చెట్టు ముందా లాంటి చర్చలకు ముగింపు ఉండదు. నెల్లూరు పయనిస్తున్న మా వాహనం గమ్యస్థానం చేరింది.


కృష్ణ పట్నం

అప్పటికే రామకృష్ణ గారు వారి కార్యాలయం నుంచి ఇంటికి వచ్చియున్నారు. మధ్యాహ్న భొజనమయ్యాక అందరం కృష్ణ పట్నం వెళ్దానుకున్నాము. ఒక Tourist car లో బయలుదేరాము. విశేషమేమంటే చాల కాలంగా నెల్లూరులో ఉంటున్న రామ కృష్ణగారు గాని, అక్కడే పుట్టి పెరిగిన ప్రశాంతిగాని అంతవరకూ కృష్ణ పట్నం చూడనే లేదు. కృష్ణ పట్నం సహజ సిద్ధమైన లోతైన ఓడ రేవు. ఆంధ్ర దేశానికి ఇది కాబొయే మరో విశాఖ పట్నం. నెల్లూరునుంచి సుమారు 25 K.M. ల దూరంలో ఉంది. ఇక్కడనుంచి ఓడ రేవు దాకా Double lane road ఉంది. భవిష్యత్లో ఇది నాలుగు సందుల రహదారి కాబోతుంది. బెళ్ళారి నుంచి ఎగుమతయ్యే ఇనుప ఖనిజానికి ఈ రేవు చాల దగ్గరగా ఉంటుంది. 2007-2008 నుంచి చెన్న పట్నం నుంచి ఇనుప ఖనిజ ఎగుమతులు ఆపివెయనున్నారు కావున కృష్ణ పట్నంకు చాలినంత పనిఉండగలదు. కృష్న పట్నం నుంచి ఓబులవారిపల్లె (గుత్తి -రేణుగుంట స్టేషన్ల మధ్య) దాకా కొత్త రైల్వే లైన్ 114 కి.మీ. వేయటానికి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కడప జిల్లాలోని ఓబులవారిపల్లె నుంచి కొండలు, లోయలు లోంచి పలు Ghat Lines తో Eastern Ghats మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం గావించ బడుతున్నది. 580 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని Krishnapatnam Rail Road Company Ltd నిర్మాణం గావించబోతున్నది.


Photo:cbrao ఉప్పు సేద్యం

కృష్ణ పట్నం కు వెళ్ళే దారిలో, రహదారి పక్కనే చాలా చేపల, రొయ్యల చెరువులున్నాయి. వీటినుంచి వచ్చే దుర్గంధము ముక్కుపుటాలదిరేలా ఉంది. అంతే కాక ఈ చెరువులు, కాలుష్య కారకులై సమీప గ్రామాల లోని ప్రజలకు తాగే నీరు లేకుండా చేస్తున్నాయి. దారిలో మాకు ఉప్పు మడులు కూడా కనిపించాయి. పొలాలలో గట్లు కట్టి సముద్రపు నీరు ఎండ బెట్టి ఉప్పు సేద్యం చేస్తున్నారిక్కడి రైతులు. ఇంకాస్త ముందు కెళితే మాకు బకింగ్ హాం కాలువ కనిపించింది. బ్రిటిష్ వారి హయాంలో ఇది ఒక వెలుగు వెలిగి ఇప్పటి పాలకుల నిర్లక్ష్యంతో పెద్దగా ఉపయోగించబడకుండా ఉంది.


Photo:cbrao బకింగ్ హాం కెనాల్

1806 లో బకింగ్ హాం కెనాల్ నిర్మాణం ప్రారంభించబడినది. తమిళ నాడు లోని మరక్కాణం నుంచి ఆంధ్ర ప్రదేష్ లోని క్రిష్ణా జిల్లా లోని పెద్దగంజాం దాక ఇది ఉంది. దక్షిణాన చెన్నై నుంచి మరక్కాణం (పాండిచెర్రికి ఉత్తరాన ఉంది)దాకా 163 కి.మీ ఉంది. ఆంధ్ర ప్రదేష్ లో ఈ కాలువ 257 కి.మీ. పొడుగుంది. 1876 మరియు 1878 లో కరువు కోరల్లో చిక్కుకున్న దక్షిణ భారతావనిని ఇది కాపాడింది. 1880 నుంచి 1940 దాక, తక్కువ ఖర్చులో ఇది ప్రజల మరియు సరకుల రవాణా సౌకర్యానికై బాగా ఉపయోగ పడింది. 1947 నుంచి దీన్ని ఉపయోగించటం తగ్గింది.1965 తుఫానుతో కాలువ దెబ్బతినింది. 2004 సునామి సందర్భంలో ఈ కాలువ సముద్రపు నీటికి అడ్డుకట్టై నిలిచి ఎందరో బెస్తవారిని, చాలా గ్రామాలను రక్షించింది. సముద్రానికి 1 కి.మీ. దూరంలో ఈ కాలువ కోస్తా తీరంలో ఉంది. అందమైన ఈ కాలువను కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో పూర్వ వైభవానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.

నెల్లూరు వెళ్తున్నానని హైదరాబాదులోని మిత్రులు మురళీ ధర్ కు చెప్పినప్పుడు కృష్ణ పట్నం గ్రామము నుంచి ఓడరేవుదాకా బకింగ్ హాం కెనాల్లో పడవలో వెళ్ళమని అది సరదాగా ఉంటుందనీ సిఫారసు చేసినారు. అదే విషయాన్ని రామకృష్ణగారికి చెప్పాను. మా కారు కొత్తగా వేసిన తారు దారిపై వెగంగా వెళ్తూ, కాపలా దారు సంజ్ఞతో హటాత్తుగా ఆగింది. కారు ముందు అద్దం లోంచి కృస్ణ పట్నం పొర్ట్ అని పెద్ద Board కనిపించింది. అంటే గ్రామానికి వెళ్ళి పడవలో ఇక్కడకు రావాలిసిన వాళ్ళం తిన్నగా ఇక్కడికే కారులో వచ్చామన్నమాట. Port లో పనులు జరుగుతున్నవి కావున ముందుకు వెళ్ళరాదనీ అక్కడే వెను తిరగాలనీ సూచించాడు. రామకృష్ణ గారికీ ఈ దారి కొత్త కనుక మా driver ఎటు తీసుకు పొతున్నాడో తనూ గమనించలేక పోయారు.

శనివారం, నవంబర్ 18, 2006

తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం, నవంబరు 2006

ఈ సారి సమావేశం విశాలమైన University of Hyderabad Campus లో జరిగింది. పచ్చటి చెట్లు, చిన్న చిన్న నీటి కాసారాలతో, రమణీయ ప్రకృతిలో ఓలలాడుతుందీ ప్రాంగణం. ఈ సమావేశం విజయవంతంగా జరిగింది. ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో హాజరయ్యారు. కొత్తగా వచ్చిన మిత్రులు. 1) P.Bhargava Ram వీరు కశ్యప్ సోదరులు. కలం పేరు 'నలుగురిలో నారాయణా. వీరి రచనలు telugupeople.com లో కనిపిస్తాయి. ఈ భార్గవ రాముడు University of Hyderabad లో M.A. -Drama, performing arts Course చదివే విద్యార్థి. కశ్యప్ 'గుంపులో గోవిందం' అనే పేరుతో రచనలు చేస్తారు. ఈ సమావేశానికి వచ్చిన మరో కొత్త మిత్రుడు రొహిణీ కుమార్. చావా కిరణ్, వెంకట రమణ, సుధాకర్ ఇంకా ఈ రొహిణీ కుమార్ అంతా గచ్చిబౌలి (Hyderabad) లోని ఒక M.N.C లో software development లో ఉన్నారు. రొహిణి కు ఇంకా ఎలాంటి బ్లాగు లేదు. బ్లాగులంటే ఇష్టం ఉంది.

సమావేశపు విశేషాలు కోసం ఇక్కడ చూడండి:
http://telugu.wordpress.com/2006/11/13/hyd-meet-nov2006/


మీ కోసం సమావేశ చాయా చిత్రాలు కొన్ని జత పరుస్తున్నా. మీ అభిరుచి ప్రకారం రాబోయే సభా కార్యక్రమ నివేదికలలో Photos ఉంచాలా వద్దా అనే నిర్ణయం జరుగుతుంది.



From left to right Veeven (Standing), Bhargava ram, cbrao, Venkata Ramana, Trivikram and Sudhakar.



From left to right Chava Kiran, Srinivasa Raju and Sri Harsha.



From left to right Kasyap, Veeven, Trivikram and Sudhakar.



From left to right Front row 1 Srinivasa Raju and Kasyap
Row2 cbrao
Row 3 Chaduvari and Veeven
Row 4 Venkata Ramana, Trivikram,
SriHarsha,Chava Kiran,Sudhakar and
Rohini Kumar

సోమవారం, నవంబర్ 13, 2006

తెలుగు వికితో తిప్పలు




కొన్ని నెలల క్రితం వికిలో సభ్యత్వం నమోదు చేసుకొన్నా. మరిచిపోయా. చేసిన పని = 0 చెయ్యల్సింది = చాలా
నాలాగా ఎందరో అని తృప్తి పడాలా? అసలు వికిలో ఏం జరుగుతుంది? నాకు తెలియాలి. సభ్యత్వం తీసుకొన్నాక ఒక సభ్యుడికి క్రియా నిర్దేశిక సూత్రాలు ఎలా అంద చేయాలి? ఎలా చేస్తే కొత్త సభ్యులు వికిని మరువక తాము చెయ్యగలిగిన పనిని చేస్తారు అన్న విధంగా మన BUREAUCRATS అలోచిస్తున్నారా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.

తెలుగు వికి పటిష్టం కావటానికి మరి ఏమి చెయ్యాలి?
Bureacrats, Administrators కొత్తగా చేరిన సభ్యుల Data Base సమర్ధంగా ఉంచాలి. ఈ Data Base సహాయతం తో కొత్త సభ్యుల e-mail చిరునామాలకు స్వాగత సందేశాలు పంపాలి. కొత్త సభ్యుల Academic Qualifications ఇంకా వారి ప్రత్యెక నిపుణతలు, అభిరుచులు తెలుపమని కోరాలి. ఇలా సేకరించిన విషయాలు మరలా Data Base కి ఎక్కించే ఏర్పాటు చేసుకోవాలి. తెలుగు వికిని Navigation ఎలా చెయ్యాలో చెప్పాలి. వికిలొని Administrative hierarchy గురించి వివరించాలి. వ్యాసాలు ఎలా మొదలుపెట్టాలో కొన్ని ఉదాహరణలు ఇవ్వాలి. కొత్త సభ్యుల సందేహాలకు ఎవరిని సంప్రదించాలో చెప్పాలి. ఇదంతా e-mail రూపంలో జరగాలి. e-mail ఎందుకు అంతా వికిలో చెప్తాం అంటే కొత్త సభ్యుడికి అక్కడ ఆ సాలెగూడులో వెతుక్కునే ఓపిక, సమయంలేక ఎందుకొచ్చిన గొడవని వెరే సాలెగూట్లోకి వెళ్లే అవకాశం ఎక్కువుంటుంది.

సభ్యత్వం తీసుకున్న ఒక నెల తర్వాత సభ్యుడుని పరామర్శిస్తూ మరో జాబు రాయాలి. ఈ జాబులో వికి navigation గాని మరేదైనా ఇబ్బందులు సభ్యులు ఎదుర్కొంటున్నారేమో అని వాకబు చెయ్యాలి. తెలుగు వికి సభ్యులకు ఒక గుంపు ఉందనీ అక్కడ వారు తమ సమస్యలు రాయవచ్చనీ తెలియ చెయ్యాలి. ఒక తెలుగు బ్లాగు ప్రారంభించటానికిముందు చాలా మంది చావా కిరణ్ రాసిన పెద్ద బ్లాగు శిక్ష చదివినంత సులభంగా - తెలుగు వికి లో వ్యాసం రాయండిలా అన్న పెద్ద వికి శిక్ష మార్గ నిర్దేశనం చెయ్యాలి. పెద్ద వికి శిక్ష ను e-mail గా కొత్త సభ్యులకు పంపాలి. మీరు వ్యాసం ప్రారంభించండి, మీ వెంటే మేముంటాము, సహాయం చేస్తాము అనే భరొసా కొత్త సభ్యులకివ్వగలగాలి.

శనివారం, నవంబర్ 11, 2006

నా నెల్లూరు పర్యటన -5

సుకుమార రెడ్ది గారు సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటారు. రెడ్డి గారు మనుషుల మీదే కాదండోయ్, జంతువుల మీద కూడా అపారప్రేమ కురిపిస్తారు. నెల్లూరు జీవకారుణ్య సంఘం కార్యక్రమాలలో కూడా తమవంతు సేవలందిస్తారు. కులాసా కబుర్లయ్యాక, రెడ్డి గారికి నా అభినందనలు అందచేసాక, వారి పనుల గురించి వారి ముఖతా విన్నాను. ఆదివారం సభా కార్యక్రమ కరపత్రికలు వారికి రామకృష్ణగారు అందచేసారు. సభలో కలుస్తానని వారు వెళ్ళారు.

రామకృష్ణగారి కుటుంబం చిన్నది. వారి శ్రీమతి సుజనారామం అధ్యాపక వృత్తిలో ఉండి, ఆరోజు అధ్యాపకుల శిక్షణా తరగతులకు వెళ్ళారు. రామకృష్ణగారి మాతృమూర్తి కమలమ్మగారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. రామకృష్ణ గారికి ఇద్దరు ఆడపిల్లలు. ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నారు. ఉదయం అల్పాహారం అయ్యాక కార్యాలయంలో ఏదో ముఖ్యమైన పని ఉందని రామకృష్ణగారు వెళ్ళారు. ప్రశాంతి తను గొలగమూడిలో ఉన్న అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించటానికి వెళ్లాలని, నాకు వేరే కార్యక్రమం లేనందువలన నన్ను కూడా రమ్మన్న ఆహ్వానంపై ఇరువురమూ గొలగమూడి ప్రయాణమయ్యాము.


Photo:cbrao

శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి

గొలగమూడి ఒక కుగ్రామం.నెల్లూరుకు సుమారు 10 కి.మీ ల దూరంలో ఉంది. హైదరాబాదులో చిల్కూరుకు ఎంత ప్రాచుర్యం ఉందో నెల్లూరులో గొలగమూడికీ అంతే ప్రాచుర్యముంది. నెల్లూరు నుంచి మంచి రవాణా సదుపాయముంది. వెంకయ్యస్వామి మొదట్లో పిచ్చివాడు.12 సంవత్సరములు ఎక్కడ తిరిగాడో తెలియదు. గొలగమూడి చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు ఇచ్చాడు. దారాలు ఇచ్చాడు. ఆ తరువాత వాక్కు చెప్పాడు. సత్యంగల నాయన అని పేరు పొందారు. తన వద్దకు వచ్చిన, భక్తుల నుద్దేశించి, వారికోసం తన సందేశాలను, తన సేవకులచేత కాగితంపై రాయించి, వారికి అందచేసేవారు, స్వహస్తాలతో. వీటిని సృష్టి చీటీలనేవారు. భక్తులు వీరిని షిర్డి సాయి అవతారముగా భావిస్తారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు వీరిని అవధూతగా కొలుస్తారు. మరికొందరు వెంకయ్య స్వామిని దత్తావతారమని తలుస్తారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా, ఇక్కడా అవధూత దెవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి. ఈ దేవాలయ అభివృద్ధికి హీరో చిరంజీవి విరాళం తోడ్పడిందని చెప్తారిక్కడివారు. దేవాలయ ప్రాంగణం అనేక వ్యాపార దుకాణాలతో నిండి ఉంది. షిర్డి గ్రామం సాయినాధుడు లేకుండా మనజాలదు. గొలగమూడి గుడి కూడా అట్లే, ఎటుచూసినా అన్ని దుకాణాలు, వెంకయ్య పేరుపైనే ఉంటాయి. వ్యాపారం, ఆధ్యాత్మికత రెండూ పెనవేసుకుపోయాయీ ఊళ్ళో.


Photo:cbrao

సశరీరంతో ఉండి ఎన్ని పనులు చెయ్యగలరో అశరీరంతో కూడా అన్నే పనులు చెయ్యగల మహిమాన్వితులను అవధూతలంటారు. వారు భక్తుల కొంగుబంగారమై నిరంతరమూ వారికి రక్షగా ఉంటారు. ఎన్ని సమస్యలు, రుగ్మతలున్నప్పటికీ, అవధూత సాన్నిహిత్యంలో భక్తులు ఎంతో మానసిక ప్రశాంతత పొందుతారు. వారికి ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రశాంతికి ఈ స్వామిపై గురి మెండు. గుడిలోకి వెళుతూనే అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణం గావించాము. ఇక్కడ అహర్నిశమూ అగ్ని వెలుగుతూనే ఉంటుంది. తదుపరి దేవాలయము చుట్టూ ఒక ప్రదక్షిణ గావించి వెంకయ్యస్వామి దర్శనం చేసుకున్నాం. గుడి లోపల చాలామంది స్త్రీలు పుష్పాలను మాలలు కడుతున్నారు. భక్తులెవరైనా లోపలకు వెళ్ళి మాలలు కట్టవచ్చని ప్రశాంతి చెప్పారు. తను దేవుని చుట్టూ ప్రదక్షిణలు గావించవలసి ఉన్నందున, నన్ను ఆ పూలవాటిక దగ్గర నిరీక్షించమని చెప్పారు. నిరీక్షిస్తూ చుట్టూ పరికించి చూశాను. దేవాలయ కుడ్యాలపై రాసిన వెంకయ్యస్వామి చెప్పిన సూక్తులు నన్నాకర్షించాయి. మీరూ చదవండి.

1) ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా.

2) వాళ్ళుండే దాన్నిబట్టి గదయ్యా మనముండేది.

3) అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో.

4) అందరికీ పంట పండించాను. దాన్ని దొంగలుపడి దోచుకోకుండా చూసుకోండయ్యా.

5) ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా.

6) సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప.

7) వెయ్యి గొర్రెలలో ఉన్నా, మన గొర్రెను కాలు పట్టి లాక్కు రావచ్చు.

8) మంత్ర మెక్కడుంది? తంత్రమెక్కడుంది? చూచుకొంటూ పొయ్యేది గదయ్యా.

9) సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ కొచ్చి ఏదనుకొంటే అదయ్యేదే గదయ్యా.

10) నీవు నన్ను విడిచినా, నేను నిన్ను విడువను.

11) మహారాజుని చూస్తే ఏమొస్తుంది? నీ కేముందో అదే నీకు మిగులు కదయ్యా.

12) అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా.

13) నా ఎడల నీ విశ్వాసమే నన్ను కదిలిస్తుంది కదయ్యా.
14) కూలివానికి, అతని చెమటారకముందే, కూలి ఇవ్వటం మంచిది కదయ్యా.

15) ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా.

16) పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా.

17) లాభం కోసం కక్కుర్తి పడితే, ఆ పాపంలో భాగం పంచుకోవాలి గదయ్యా.

18) దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా.

19) అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.

20) మర్యాదలు పాటిస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, సద్గురులకు సేవ చెయ్యటం నేర్చుకోవటం మంచిది గదయ్యా.



వెంకయ్యస్వామి ఆలోచనాధారతో, ఊర్ధ్వ లోకాలలో విహరిస్తున్న నా మనస్సును, వెళ్దామా అన్న ప్రశాంతి పిలుపు, ఇహలోకంలోకి తెచ్చింది. గుడి పక్కనే ఉన్న శిష్యుల సమాధులను దర్శించి, స్వామి వారి కుటీరం చూడటానికి వెళ్ళాము. స్వామి వారి చిన్న ఆవాసాన్ని అలాగే ఉంచి దానిపై నూతన భవన నిర్మాణం చేశారు. ఇక్కడే మేము స్వామివారి శిష్యులు గురవయ్య స్వామివారిని దర్శించాము. మరలా గుడి ప్రాంగణంకి వచ్చి పాదరక్షలు సేకరించుకుని వస్తూ అక్కడే వున్న పుస్తకాల దుకాణంలో వున్న పలు పత్రికలు, స్వామిపై ఎక్కిరాల భరద్వాజగారు రాసిన పుస్తకం చూశాము. వెంకయ్య స్వామిపై వెలువడుతున్న సద్గురు కృప అనే ఆధ్యాత్మిక మాస పత్రిక కూడా అక్కడే చూశాము. శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర మరియు లీలల వివరాలకై చూడండి...
http://www.saimastersevatrust.org/Books/Pdfbooks.html

ఆ రోజు శనివారము అవటము వలన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులకు అక్కడే ఉచిత భోజన సౌకర్యమున్నప్పటికీ, రామకృష్ణగారు మాకై నెల్లూరులో వేచిఉన్నారు కావున, అక్కడ భోజనం చెయ్యకుండానే తిరుగు ప్రయాణమయ్యాము. ఆ ప్రయాణ సమయంలో ప్రశాంతి తాను వెంకయ్య స్వామితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటానని చెప్పి, నన్ను ఆశ్చర్యానికి గురిచేశారు.

శుక్రవారం, నవంబర్ 03, 2006

నా నెల్లూరు పర్యటన -4



గాంధీ బాటలో ఉద్యమకారుడు సుకుమార్ రెడ్డి - 2

పొగాకు శతకము

ఆంధ్ర దేశాన ధూమపానప్రియులధికం. పొగచుట్ట, బీడీలు, పొగాకు, నశ్యం, సిగరెట్ల రూపంలో ధూమపానం గోచరిస్తుంది. పొగచుట్ట గురించి చిరుమర్రి నరసింహ కవి గారు రాసిన ఒక పద్యం ఇది
ప్రొద్దున లేచి
ధూమ్రదళపుంజము
కన్నులకద్దుకొని దా
ముద్దుగ చుట్టదీర్చి తన
మోము పయిం ఘటియించి
మీసముల్
దిద్ది పొగాకువేడియును
ధీజనకోటికి మోదమిచ్చి తా
పెద్దలపేరు జెప్పి
పొగబీల్చినవాడు
కృతార్ధుడిమ్మహిన్


గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలోని గిరీశం ఐతే పొగతాగని వాడు దున్నపోతయి పుట్టున్ అంటూ తీర్మానించేశాడు. ఒక సినీ కవిగారైతే సరదా సరదా సిగరెట్టు, ఇది ఆలోచలను రేగొట్టు అంటూ సిగరెట్టు మనల్ని చైతన్యవంతులుగా చేస్తుందని వాక్రుచ్చారు.

సుకుమార్‌గారి ఆలోచనల ధారా పుస్తకం పొగాకు శతకం. ధూమపానము మొదట సరదాగా మొదలై, విషాదంగా ముగుస్తుందనీ అందుకు అకాల మృత్యువాతపడిన తన తండ్రిగారే పెద్ద ఉదాహరణ అంటారు.
1995లో లయన్స్‌క్లబ్ వారు నిర్వహించిన ధూమపాన వ్యతిరేక నినాదాల పొటేలో సుకుమార్ గారి ' పొగచుట్టలు ప్రజలపాలిటి కొరివికట్టెలు ' నినాదం, ఉత్తమమైందిగా ఎంపికైంది. వీరి శతకంలోంచి కొన్ని ఆలోచల్ని మీముందుంచుతాను.
అంతుబట్టని విషయం
చాలా మంది బస్సుల్లో, రైళ్ళలో,స్త్రీ, బాల, వృద్ధుల మధ్య, మొదలైన చోట్ల పొగదాగుతావుంటారు. వీళ్ళని గాడిదనాల్నో, పందుల్తో బోల్చాల్నో, దున్నపోతులని తిట్టాల్నో అర్థం కాదు.నిజానికియ్యేవి పొగత్రాగవు. అటువంటప్పుడు వాళ్ళని వీటితో పోల్చటం ఈ జంతువుల్ని అవమానించటమే ఔతది. ఐతే, ఇంక దేంతో బోల్చాలా? అది అంతుబట్టని విషయమే.

పొగాకు తినేవాళ్ళకి

తిన్నదాన్ని విసర్జించటానికి అందరికీ ఒక అవయవముంటే, పొగాకుదినేవాళ్ళకి రొండుంటాయి. ఆ రెండో అవయవం పేరు - నోరు.

ధూమపానం మాన్పించటానికి అనేక చిట్కాలు చెప్తారు రచయిత పొగాకు శతకంలో.
చిట్కా
మీ పక్కనెవరైన పొగదాగతుంటే - వాళ్ళ దృష్టినాకర్షించేరకంగా మొఖం వికారంగాబెట్టి, చేతిగుడ్డతో ముక్కు మూసుకోండి. ఈ సందర్భంలో మీరు వాళ్ళ మొఖంలోకి జూడాల్సిన పన్లేదు. సామాన్యంగా ఈ చిట్కా బాగా పంజేసి, వాళ్ళు మీ పక్కనుంచి దూరంగా బొయ్యేట్లు జేస్తది. ఒక్కొసారి - వాళ్ళు తమ పొగదాగుడ్ని అప్పటికి ముగించినా ముగించొచ్చు.

పలు సభలలో ధూమపానానికి వ్యతిరేకంగా ఉపన్యసించారు. కొంతమంది వారి మాటలతో ప్రభావితులై ధూమపానం మానివేశామని సుకుమార్ గారికి తెలియ చెప్పినప్పుడు వారికి కలిగే ఆనందం మాటల్లో చెప్పనలివికాదు.
అహింసా మార్గంలో నిరసన

సుకుమార్‌గారు ఏమి చేసిన కొంత నూతనంగానే తమదైన పద్ధతిలో ప్రచారోద్యమం గాని నిరసనగాని ఉంటాయి. వారింటిముందున్న నల్ల పలుకపై నినాదాలుగాని, నిరసనోద్యమ వార్తలుగాని రాసి ప్రజల దృష్టినాకర్షించి వారి మద్ధతు పొందుతారు.

2000 సంవత్సరం తెలుగుదేశం హయాములో అకస్మాత్తుగ పెరిగిన విద్యుత్ చార్జీల పెంపుపై తమ నిరసనగా ప్రతిరోజూ రాత్రి 7.30 నుంచి 8.30 దాక వారింటిలో విద్యుత్ వాడకాన్ని ఆపివేస్తున్నట్లుగా నల్ల పలుకపై ప్రకటించి దాన్ని నిరాఘంటంగా 3 సంవత్సరముల 11 నెలల 2 రోజులు అమలుపరిచినారు. తెలుగుదేశం పార్టి ఓడిన తదుపరి ఈ దీక్ష విరమించినారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని పలు కష్ట నష్టాలకోర్చి చెయ్యటం జరిగింది.మధ్య కాలంలో సుకుమార్‌గారి తల్లి గారు (71 Years) చీకటిలో పడిపోవటము, వీరి ధర్మపత్ని కి ఒక పర్యాయం 'చిన్న ఆపరేషను ', మరో మారి ' పెద్ద ఆపరేషను ' జరగటం వలన విపరీతంగా చెమటలు పట్టేవి. అయినా కష్టాలకోర్చి నిరసన కొనసాగించారు.

వీరి నిరసన కార్యక్రమాలు Media దృష్టిని ఆకర్షించాయి.సింహపురి రైతు, ప్రజాశక్తి పత్రికలు, విస్సా టెలివజన్ వారు ఈ నిరసన గురించి విపులంగా రాశారు/చూపారు. భారత స్వాతంత్ర పోరాటంనాటి నూలు వడకటం, ఖద్దరు ధారణ, విదేశీవస్తు బహిష్కరణ, ఉప్పు తయారీ వంటి - ఎవరైనా అమలుపరచగలిగిన తరహా కార్యక్రమాలుగా ఈ నిరసనను సుకుమార్‌గారు భావించారు. సుకుమార్‌గారి మాటల్లో చెప్పాలంటే ' మా నిరసన నిర్ణయం, ఆ నిర్ణయంవెనకున్న మా అవగాహన, మా ఆచరణ , మా అనుభవాలు - ప్రజా ఉద్యమాలకి స్పూర్తిగా నిలువగలవనే ప్రగాఢ విశ్వాస భావనతో ఉన్నాము.'

Pinakini Body Donors Organisation

వైద్య విధ్యార్థులు శరీరశాస్త్ర నిర్మాణ రహస్యాలు తెల్సుకోవటానికై మృతదెహాలపై శస్త్రములతోటి ఖేదించి శల్యశాస్త్ర మర్మాలు నేర్వవలసియున్నది కాని మృతదేహముల కొరత మిక్కుటముగాయున్నది. దీనిని గుర్తించి సుకుమార్‌గారు Pinakini Body Donors Organisation స్థాపించినారు. అప్పటికి నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఇంకా రాలేదు. ఇలాంటి ఆలోచన ఆరోజుల్లో చాల కొత్త. ప్రజలలో దేహదానంపై వీరి ప్రయత్నాలు మంచి అవగాహన కలుగచేశాయి. ప్రస్తుతము నెల్లూరులోనే మెడికల్ కాలేజ్ ఉన్నది.

సుకుమార్‌గారు రచయిత కూడ అవటంతో రక్త, నేత్ర దానాలపై కొన్ని రచనలు చేశారు. అవి అముదిత్రములు. సుకుమార్‌గారు 1992 ఆగస్ట్‌లో ఏర్పడ్డ సారా వ్యతిరేకోద్యమ సమన్వయ సమితితో కలిసి పనిచేసి ఆ ఉద్యమానికి చేయూత నిచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వమువారు విద్యుత్ ను Private పరం చేస్తున్నట్లు, ప్రపంచ బాంక్ ఆదేశాలపై విద్యుత్ శాఖలో మార్పులు చేసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో నెల్లూరులో మరో ఉద్యమం వస్తుందా? అనేక ఊద్యమాలకు నాంది పలికిన నెల్లూరు నుంచి ఏమి కొత్త ఉద్యమాలు రానున్నాయో?

P.S. ఈ వ్యాసం చదివాక మీ అభినందనలు సుకుమార్ రెడ్డి గారికి తెలియ చేయాలని ఉందా? వారి సేవా కార్యక్రమాలలో మీకు కూడ పాల్గొనలాని ఉందా? అయితే వారికి రాయండో ఉత్తరం.

Sri Thikkavarapu Sukumar Reddy
223rd House, K.A.C. Avenue,
Opp to Park, Stone House Peta,
Nellore 524 002
Andhra Pradesh
India.

ఉత్తరం రాయటం కష్టమనిపిస్తే, నాకు e-mail చెయ్యండి. మీ స్పందనను నేను వారికి పంపిస్తాను. నా e-mail: cbraoin at gmail.com