శనివారం, సెప్టెంబర్ 29, 2007

సాహితీవనం -5



శ్రీశ్రీ గారు కమ్యూనిస్టు కదా? రామ భక్త హనుమాన్ కు పాటలు రాయడమేమిటి? అని గిరి విస్మయం వెలిబుస్తున్నారు. రామభక్త హనుమన్ ఫేం శ్రీశ్రీ అన్న విషయం చేరా గారిని బాధించి,"మరో ప్రపంచ మహాకవి రామభక్త హనుమాన్ ఫేం?" అని అక్రొశిస్తూ,"వారం,వారం నీ రచనల శరవర్షం కురిపించవయా " అంటూ శ్రీశ్రీని అభ్యర్దిస్తూ, స్వతంత్ర పత్రిక లో గేయం రాశారు. అది చదివి,వరవరరావు స్వతంత్ర లో ఒక వ్యాసం రాస్తూ "శ్రీశ్రీ వైపు దేబె మొగాలు వేసుకు చూస్తుండకపోతే, మీరంతా ఎందుకు రాయకూడదూ?" అని ప్రశ్నించాడు. (చూ.స్మృతికిణాంకం.పే 24.)

దేవుళ్లను స్మరించిన మాత్రాన, శ్రీశ్రీ కమ్యూనిస్ట్ కాకుండా పోడు. వస్తున్నాయ్,వస్తున్నాయ్ జగన్నాధ రధ చక్రాల్ అని రాయటం వెనుక జగన్నాధుడు దేవుడని కాక, మన సంస్కృతి లో భాగమైన జగన్నాధుని, తన భావాలను ప్రజల దరిచేర్చే అవసరం కోసం వారికి సుపరిచితమైన జగన్నాధుని, వాడటం జరిగిందని భావిస్తాను. శ్రీశ్రీ జీవితంలో ఎన్నో వైరుధ్యాలున్నై. సినిమాల లో నెహ్రూ ని పొగిడి ఆ తరువాత నాలుక్కరుచుకున్నాడు."ఒక పక్క సోషలిస్ట్ విలువలు పొగడుతూనే,తన సెక్సు విజయాలను చాటుకునే ఫ్యూడల్ మనస్తత్వమూ ఉంది." -చేరా. శ్రీశ్రీ లోనూ మనుషులకుండే కొన్ని లోపాలు లేక పోలేదు. శ్రీశ్రీ లోని కవి, అతను సమకాలీన సాహిత్యాన్ని ప్రభావితం కావించిన తీరు, ఈ లోపాలను సులభంగా అధిగమిస్తాయి.

సాహితీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న, రెండవ విడత ప్రశ్నలివిగో.ఇవి మీకు ఆసక్తికరంగా ఉండగలవని ఆశ.

సాహితీవనం ప్రశ్నలు

A) రష్యన్ సీత కథా సంపుటి రచయిత్రి

1) వాసిరెడ్డి సీతా దేవి
2) వసుంధర
3) కందుకూరి వెంకట మహాలక్ష్మి
4) కొండేపూడి నిర్మల

B) "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు" అని శ్రీశ్రీ రాసిన పాటకు ''ఏవి తల్లీ,నిరుడు మండిన ఎండు తాటాకుల్" అని పారడి రాసిన కవి

1) చలం
2) ఝరుక్ శాస్త్రి
3) శ్రీ రమణ
4) ఆరుద్ర

C) ఇది ఒక భక్తుడి, సాహితీకారుడి సమాధి



1) అన్నమాచార్య, తాళ్లపాక
2) తిరు వాళ్లువార్, కన్యాకుమారి
3) శ్రీత్యాగరాజ, తిరువాయూరు
4) స్వాతి తిరుణాల్, తిరువనంతపురం

D) సుగాత్రి అంటే ఏమిటి?

1) మంచి శీలం ఉన్నది
2) మంచి శరీరం ఉన్నది
3) మంచి చూపు ఉన్నది
4) పైన పేర్కొన్నవి ఏవీ కావు

E) కవి శేషెంద్ర శర్మ అభిమాన సంఘం

!) గుంటూరు సేన
2) శివ సేన
3) కవి సేన
4) ముత్యాల సేన

F) పంజరాన్ని నేనే, పక్షిని నెనే -కవితా సంపుటి రచయిత్రి

1) శిలాలోలిత
2) సావిత్రి
3) యస్.జయ
4) డా.పి.సుమతీ నరేంద్ర

G) ఈ చిత్రం లో ఉన్నవారిని గుర్తించండి.



1) వెల్చేరు నారాయణ రావు
2) ఆరి సీతారామయ్య
3) బి.నర్సింగరావు
4) చిత్రకారుడు చంద్ర

H) ఆలాపన రాసిన రచయిత

1) మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ
2) నూకల చిన సత్యనారాయణ
3) వి.ఎ.కె.రంగారావు
4) యస్.సౌమ్య

I) చిత్రకారుడు, దర్శకుడు బాపు రూపొందించిన చీరలు ఈ చిత్రం లో వాడారు.

1) రాధా గోపాలం
2) ముత్యాల ముగ్గు
3) పెళ్లి పుస్తకం
4) మిస్టర్ పెళ్లాం

J) "మా నిజాం రాజు, జన్మ జన్మల బూజు " అని గర్జించిన రచయిత

1) మాడపాటి హనుమంతరావు
2) దాశరధి కృష్ణమాచార్య
3) వట్టికోట ఆళ్వార్ స్వామి
4) సురవరం ప్రతాప్ రెడ్డి

షరా మాములే. మీ సమాధానాలు,ప్రశ్నలకు సంబంధించిన, ఆసక్తికరమైన విషయాలు దీప్తిధారకు పంపండి.

శుక్రవారం, సెప్టెంబర్ 28, 2007

సాహితీవనం -4


Maredumilli forest,E.G.dt.,A.P. Photo -cbrao

లత, సంతానం చిత్రం లో మాత్రమే కాక ఆఖరిపోరాటం చిత్రం లో కూడా పాడారని సిరి గారు రాశారు.అమూల్యమైన సమాచారాన్నిచ్చిన సిరి గారికి నా ధన్య వాదాలు. లత పాడిన ఆఖరిపోరాటం చిత్రం లో పాటలు మీరు ఇక్కడ వినవచ్చు.

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే భూదేవి అని ఇంకో అర్థం కూడా ఉందని తెలుస్తూంది.ఆసక్తి గలవారు, DTLC Group ఇంకా TELUSA గుంపు చర్చలలో చూడవచ్చు.

ఊ) ప్రకృతి అందాలకు నిలయం తుమ్మపూడి.పచ్చని చేలు, ఆ పక్కనే బకింగ్‌హాం కాలువ, అందులో వెళ్తూండే తెరచాప పడవలు, చెట్లూ, వాటి పై పక్షులూ,మనకు చక్కటి గ్రామీణ వాతావరణాన్ని అందిస్తాయి. చనిపోయే వరకూ సంజీవదేవ్ ఇక్కడే, ప్రకృతిని ఆస్వాదిస్తూ,చిత్ర పటాలు గీస్తూ గడిపారు.

ఎ) పారడీ రచనలైనా, కటుంబ సంబంధ బాంధవ్యాల కథలైనా శ్రీరమణకు కొట్టిన పిండి.

ఏ)భారత రత్న సుబ్బలక్ష్మి గారి గాత్రం అనితర సాధ్యం. గాంధి గారు వైష్ణవ జనతో పాటను వీరి ముహతా వినటానికి ఇష్ట పడే వారు.భక్త మీరా (1945) చిత్రం లో నటించి మీరా భజన్లను పాడారు.ఇంకా సేవాసదనం, సావిత్రి, మీరా(తమిళ్) చిత్రాలలో నటించినా, అవి తన ప్రవృత్తికి సరి పోక పోవటం తో గాయనిగానే కృషి చేశారు.

ఐ) వివిధ రామాయణాలలో గల వ్యత్సాసాలను వివరిస్తూ రాసిన పుస్తకమిది.వీటిలో రాముడికి, సీతకు గల సంబంధాన్ని ఏ రామాయణం లో ఎట్లా రాశారు అని తులనాత్మకంగా పరిశీలించిన గ్రంధం.

ఒ) కారులో షికారు కెళ్లే -ఈ పాట సినిమాలో సందర్భాన్ని బట్టి గాక, పాటకై సందర్భాన్ని సృష్టించినట్లుగా ఉంటుంది. సొషలిస్ట్ భావాలతొ నిండిన ఈ పాట పాఠకులను బాగా తికమక పెట్టింది. చాల మంది దీనిని శ్రీశ్రీ రాసినట్లుగా పొరబడ్డారు. ఈ పాట పై చాలా విశ్లేషణలు కూడా వచ్చాయి. బుచ్చిబాబు గారు దీని పై ఆంధ్ర ప్రభ లేక జ్యొతిలో ప్రత్యేక వ్యాసం రాసినట్లు గుర్తు. ఆత్రేయ గారు శ్రీశ్రీ లో పరకాయ ప్రవేశం చేసి ఈ పాట రాశారేమో అనిపిస్తుంది. అద్భుతమైన పాట.అందుకే ఇంతకాలమైనా మన మదిలో నిలిచిపోయిందీ పాట.

పాఠకుల స్పందన చూద్దాము ఇప్పుడు.
1) నేను సైతం 5 ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారు. 5 మార్కులు
2) కారణి నారాయణ రావు గారు సినీవాలికి ఒకే సమాధానం ఇచ్చి 0.5 మార్కులు పొందారు. మొత్తం మార్కులు 5.5 మార్కులు
3) సినీవాలి కి రెండు అర్థాలు ఇచ్చారు సౌమ్య. మొత్తం స్కోరు 6 మార్కులు.
4) శ్రీనివాస్ పరుచూరి చివరలో రాసిన ఎనిమిదవ జవాబులో ఆరుద్ర అని రాసారు. కాని ఏ ప్రశ్నకు జవాబుగా రాసారో చెప్పలేదు.సాహితీవనం లో చివరగా ఉన్న ఐ,ఒ ప్రశ్నలు రెండింటిలో ఆరుద్ర అన్న option ఉంది.ఆరుద్ర అన్న జవాబు ఒక ప్రశ్నకు సరైనది.వెరే ప్రశ్నకు కాదు.కావున జవాబు invalid vote కింద జమయ్యింది.ప్రశ్న, జవాబు రెండూ రాసుంటే, శ్రీనివాస్ గారికి ఇంకో అదనపు మార్కు వచ్చేదేమో.Topper అయ్యుండే వారు. రామ భక్త హనుమాన్ గా శ్రీశ్రీని గుర్తించింది వీరే.శ్రీనివాస్ గారి స్కోర్ 6 మార్కులు.

సినీవాలికి రెండవ సమాధానం రాసుంటే నారాయాణరావు గారికి 6 మార్కులు వచ్చుండేవి. 5 మార్కులు సాధించిన నేను సైతం ఇంకొంచం శ్రద్ధ పెట్టి జవాబులు రాసుంటే,అందరికీ సమానంగా నిలిచే వారు.సాహితీవనం ప్రశ్నలకు ఉత్సాహంగా జాబులు, జవాబులు రాసిన అందరికీ ధన్యవాదాలు.చివరగా శ్రీనివాస్ పరుచూరి, సౌమ్య ఇద్దరూ చెరి 6 మార్కులతో సమ ఉజ్జీ అయ్యారు.ఉత్తమ సమాధానాలిచ్చిన వీరిరువురికీ దీప్తిధార వీరతాడు వేస్తున్నది.హై, హై నాయకా! హై, హై,నాయకా! సంజీవదేవ్ రచనల సమీక్ష,విశ్లేషణ,జీవితం సంకలన కర్త శ్రీ పారుపల్లి కవికుమార్ సౌజన్యంతో, సంజీవదేవ్ గురించిన పుస్తకం వీరిరువురికీ దీప్తిధార నుంచి అందుతుంది.

సోమవారం, సెప్టెంబర్ 24, 2007

సాహితీవనం -3




సాహితీవనం ప్రశ్నలకు ఉత్సాహంగా బదులిచ్చిన అందరికీ నెనర్లు. జవాబులే కాకుండా ప్రశ్నలకు సంబంధించిన అమూల్యమైన సమాచారం అందించారు.మరో సారి నెనర్లు. ఈ నెనర్లు అంటో ఏమిటో తెలియని వారికి, దీని అర్థం, ధన్యవాదాలు,కృతజ్ఞతలు, అని తెలియజేసిన తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారికి నెనర్లు. గురజాడ ' ప్రేమ ' అనే అర్థం లో వాడారు.నెనరు కున్న అర్థాలులో ఇవి కొన్ని.అవీ కొత్త తెలుగు పదం ముచ్చట్లు.కొత్త తెలుగు పదాలను తెలుసుకోవాలనే ఆసక్తి కల వారు ' తెలుగుపదం ' గుంపులో చేరితే ఉపయుక్తకరంగా ఉండగలదు. సరే, ఇహ మనం సాహితీవనం లో ప్రవేశిద్దాము. మొదటగా ప్రశ్నలకు సరైన సమాధానాలు, దిగువ ఇస్తున్నాను.

అ) " ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? “అని ప్రశ్నించిన కవి

శ్రీశ్రీ

ఆ) కాలాతీతవ్యక్తులు రచయిత్రిగా డాక్టర్ శ్రీదేవి ప్రసిద్ధిగాంచారు.వీరి కాలాతీతవ్యక్తులు ఈ పత్రికలో సీరియల్ గా వచ్చింది.

స్వతంత్ర

ఇ) రామ భక్త హనుమాన్ -ఈ చిత్రానికి మాటలు, పాటలు రాసిన వారు

శ్రీశ్రీ

ఈ) నిదుర పోరా తమ్ముడా అంటూ సంతానం చిత్రంలో ఆంధ్ర దేశానికే లతా మంగెష్కర్ చేత లాలిపాట పాడించిన సంగీత దర్శకుడు

యస్.దక్షిణామూర్తి

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే అర్థం

1) చంద్రకళ కానవచ్చెడి అమావాస్య
2) లక్ష్మి

ఊ) ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్ చనిపోయేదాకా ఇక్కడే నివసించారు.

తుమ్మపూడి

ఎ)' గుత్తొంకాయ కూర మానవ సంబంధాలు ' రాసిన రచయిత

శ్రీరమణ

ఏ) ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నాయికగా నటించిన చిత్రం

మీరా

ఐ) రాముడికి సీత ఏమవుతుంది పుస్తక రచయిత

ఆరుద్ర

ఒ) తోడికోడళ్లు చిత్రం లోని కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దానా పాట రాసిన కవి

ఆత్రేయ

అ) François Villon - 15 శతాబ్దపు ఫ్రెంచ్ కవి రాసిన "Where are the snows of yesteryear?", ప్రేరణగా శ్రీశ్రీ రాసిన కవితే ఏవి తల్లి. ఇది ఖడ్గసృష్టి లో ఉంది.
ఆ) డాక్టర్ శ్రీదేవి స్వతంత్ర పత్రికకు సహాయ సంపాదకరాలుగా పని చేశారు. సంపాదకుడు -గోరా శాస్త్రి.
ఇ) రామభక్త హనుమాన్ కు మాటలు పాటలు రాసినది శ్రీశ్రీ. బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్ నడుస్తున్నప్పుడు, మహాదేవి అనే డబ్బింగ్ చిత్రం తాలూకు పెద్ద పోస్టర్ కంపించింది చేరా గారికి.పోస్టర్ కింద మాటలు పాటలు శ్రీశ్రీ అని బ్రాకెట్ లో రామభక్త హనుమన్ ఫేం అని రాసుందని చేరా గారు తమ స్మృతికిణాంకం పుస్తకం లో రాశారు.రామ భక్త హనుమాన్ శ్రీ శ్రీ అన్న విషయం చేరా గారిని బాధించిందట.అప్పుడు వారేం చేశారో ఆ కథ తెలుసుకోవాలంటే స్మృతికిణాంకం పుస్తకం చదవండి. మీకు పుస్తకం లభ్యం కాకుంటే, దీప్తిధార కు రాయండి.

ఈ) లతమంగేష్కర్ తో తొలిగా పాట పాడించిన సుసర్ల గారికి ఆంధ్రదేశం రుణపడి ఉంటుంది. ఇది లత ఒంటి గొంతుతో పాడే పాట. ఈ పాట చిత్రం లో రెండు సార్లు వస్తుంది.జునియర్ శ్రీరంజని. నాగెశ్వర రావు, చలం చిన్నప్పుడు, మొదటి సారి,మరలా వారు పెద్దయినప్పుడు. రెండో సారి పాట ప్రధమార్థం లత పాడితే, మిగతా పాట ఘంటసాల పాడారు. లత పాట సినిమా లో theme song గా bits, bits గా పెక్కు సార్లు వస్తుంది.

ఈ పాట విన్నవాళ్లు లతకు తెలుగు రాదంటే నమ్మలేనంత చక్కగా పాడారు. లత అప్పటికే ప్రఖ్యాత గాయని. లత తో తెలుగు లో పాట పాడించటానికి ప్రత్యేక కారణం కనపడదు. మేమే లత తొ మొదటగా తెలుగు లో పాడించాం అన్న ఘనత కోసం తప్ప,వెరే కారణం లేదు. ఇది తలత్ మొహమ్మద్ చేత రమెష్ నాయుడు మనోరమ లో, టి.వి.రాజు రఫీ చేత తెలుగు లో పాడించటానికి ఈ పాట ఆద్య మయ్యింది.అప్పుడు అది వింతే మరి. ఈ రోజు హిందీ గాయకుల తో తెలుగు లో పాడించటం సాధారణ మయ్యింది. లత పాడిన ఎకైక తెలుగు పాట చూసి ఆనందించండి.



(సశేషం)

బుధవారం, సెప్టెంబర్ 19, 2007

సాహితీ వనం -2



సాహితీ వనం ప్రశ్నలకు సమాధానాలు పంపిన మీ అందరికీ ధన్యవాదాలు. యువతరాన్ని ఉద్దేసించిన ఈ ప్రశ్నలు కఠినమేమోనని తొలుత సందేహ పడినాను.అడగగానే టక టక చెప్పిన మీకు అభినందనలు.కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడిదానా అనే పాట సొషలిస్ట్ భావజాలంతో నిండి వుండటం వలన రచయిత పేరు చెప్పటం కష్టమే. ఈ పాట ఔచిత్యాన్ని, ఇందులోని భావ గంభీరతనూ వివరిస్తూ కొన్ని వ్యాసాలు ప్రకటితమయాయి గతంలో. ఈ పాట పై ఈ మాట లో వ్యాసం చదివిన గుర్తు. మీకు లింక్ తెలిస్తే పంపండి. ఈ పాట పై మీకు తెలిసిన ఇతర వ్యాసాల లింకులు కూడా పంపండి. మిగతా ప్రశ్నలకు సంబంధించి, మీకు తెలిసిన విషయాలను కూడా పంపండి. సినీవాలి పై గతంలో DTLCgroup లో చర్చ జరిగింది. ఈ పదానికి ఒకటి కంటే ఎక్కువే అర్థాలు ఉన్నాయి.

ఇంతకీ శ్రీ శ్రీ గారు "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు" ఏ పుస్తకం లొ రాశారు? అన్న RSG ప్రశ్నకు ప్రస్తుతానికి అది ఏ పాటలో భాగమో చెపుతాను. పుస్తకం పేరు చెప్పేస్తె రచయిత పేరు మీరు ఇట్టే కనుక్కుంటారు.

చక్రవర్తి అశోకుదెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు

కాళిదాస మహాకవీంద్రుని
కవనవాహినిలో కరంగిన
ఉజ్జయినీ నేడెక్కడమ్మా?
ఉంది: చూపించు

షాజహాన్ అంతఃపురంలో
షట్పదీ శింజాన మెక్కడ
ఝాన్సీ లక్ష్మీదేవి యెక్కిన
సైంధవం నేడేది తల్లీ

సరైన సమాధానాలతో ఇంకో జాబు రాస్తాను.ఈ ప్రశ్నలు సాహిత్యంలోని గతవైభవాన్ని ఒక సారి గుర్తుకు తేగలవని ఆశ.

గత వ్యాసానికి ముఖ చిత్రంగా వేసిన పుస్తకం పేరు అడవిగాచిన వెన్నెల -ఈ పుస్తకానికి మాత్రుక జంగ్ చాంగ్ రాసిన Wild Swans. ఇది కోటి కాపీలు పైగానే అమ్ముడైన పుస్తకం. 30 భాషలలో అనువదించబడింది. చైనాలో నిషెదించబడినది. చైనా సాంస్కృతిక ఉద్యమంలో కష్టాలు పాలయిన మూడు తరాల స్త్రీల వెతలే ఈ పుస్తకం.జంగ్ చాంగ్ కుటుంబ స్వీయ చరిత్ర ఇది.రచయిత్రి, తన, అమ్మ, అమ్మమ్మ ల కథ చెప్తుందీ పుస్తకంలో. 1992 లో NCR Book Award ఇంకా 1994 లో British Book of the Year బహుమతులు వచ్చాయి. చిత్ర రూపంలో రావటానికి ప్రస్తుతం పని జరుగుతున్నది. రచయిత్రి ప్రస్తుత నివాసం బ్రిటన్ దేశం అని విన్నాను. ఈ మధ్యనే విడుదలయిన ఈ పుస్తకం హైదరాబాదు లోని ప్రముఖ పుస్తకాల షాపులలో లభ్యమవుతుంది. కొత్త, పాత పుస్తకాలను పరిచయం చేయటం సాహితీ వనం లక్ష్యాలలో ఒకటి. ఆ ఉద్దేశం తోనే సాహితీ వనం వ్యాసానికి ఈ పుస్తకాన్ని ముఖ చిత్రంగా వేయటం జరిగింది.

ఈ వ్యాసానికి ముఖచిత్రంగా వస్తున్నది సంజీవదేవ్ గురించిన పుస్తకం. పారుపల్లి కవికుమార్ సంకలనం ఇది. పలువురు మేధావులు సంజీవదేవ్ జీవితం, రచనల గురించి చేసిన విశ్లేషణ పుస్తకం ఇది.మరిన్ని వివరాలకు చూడండి

http://www.bitingsparrow.com/sanjivadev/sanjivatelu2.htm

ఈ పుస్తకం కూడా హైదరాబాదు లోని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతుంది.

మంగళవారం, సెప్టెంబర్ 18, 2007

సాహితీ వనం



సాహిత్య విషయాలన్నా, సాహితీ కారులన్నా మిత్రుడు పొద్దు త్రివిక్రమ్ కు అభిమానం,గౌరవం. గతంలో నేనేదో ఊసుపోక సాహిత్యం గుంపుకు కొన్ని సార్లు రెండు ప్రశ్నలు అంటూ సాహిత్యం పై అడిగే ప్రశ్నలను తను ఆసక్తిగా చూడటం జరిగింది.సాహితీ అభిమానులనుంచీ దానికి మంచి స్పందన వచ్చింది.ఎందుకు రెండు ప్రశ్నలు రాయటంలేదని గుర్తు పెట్టుకుకుని నన్ను అడగటం జరిగింది.అదే ఈ వ్యాసానికి ప్రేరణ.


నా వద్ద ప్రశ్నల అమ్ముల పొది సిద్ధంగా ఉంది.తూణీరాలను కాచుకోండి మరి. సాహిత్యాభిమానులకు,
ఈ శరాలు తీయని బాధనే కలుగ చేస్తాయని ఆశ.

అ) " ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? “అని ప్రశ్నించిన కవి

1) ఆరుద్ర
2) ఆత్రేయ
3) శ్రీశ్రీ
4) దేవులపల్లి

ఆ) కాలాతీతవ్యక్తులు రచయిత్రిగా డాక్టర్ శ్రీదేవి ప్రసిద్ధిగాంచారు.వీరి కాలాతీతవ్యక్తులు ఈ పత్రికలో సీరియల్ గా వచ్చింది.

1) ఆంధ్ర ప్రభ
2) ఆంధ్ర పత్రిక
3) స్వతంత్ర
4) భారతి

ఇ) రామ భక్త హనుమాన్ -ఈ చిత్రానికి మాటలు, పాటలు రాసిన వారు

1) శ్రీశ్రీ
2) సముద్రాల
3) పింగళి
4) ముళ్లపూడి

ఈ) నిదుర పోరా తమ్ముడా అంటూ సంతానం చిత్రంలో ఆంధ్ర దేశానికే లతా మంగెష్కర్ చేత లాలిపాట పాడించిన సంగీత దర్శకుడు

1) యస్.దక్షిణామూర్తి
2) ఆదినారాయణరావ్
3) ఘంటసాల
4) సి.ఆర్.సుబ్బరామన్

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే అర్థం

1) చంద్రకళ కానవచ్చెడి అమావాస్య
2) లక్ష్మి
3) భూదేవి
4) సినీ జగత్తుతో సంబంధం కల వ్యక్తి

ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలుంటే, అవన్నీ సరైన సమాధానాలుగా రాయవచ్చు.

ఊ) ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్ చనిపోయేదాకా ఇక్కడే నివసించారు.

1) వీరుల పాడు
2) తుమ్మపూడి
3) తెనాలి
4) సంగం జాగర్లమూడి

ఎ)' గుత్తొంకాయ కూర మానవ సంబంధాలు ' రాసిన రచయిత

1) ఆదివిష్ణు
2) శ్రీరమణ
3) నండూరి పార్థసారధి
4) శంకరనారాయణ

ఏ) ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నాయికగా నటించిన చిత్రం

1) సతీ సావిత్రి
2) మీరా
3) అవ్వైయ్యార్
4) చంద్రలేఖ


ఐ) రాముడికి సీత ఏమవుతుంది పుస్తక రచయిత

1) తాపీ ధర్మారావు
2) త్రిపురనేని రామస్వామి
3) ఆరుద్ర
4) మహారధి

ఒ) తోడికోడళ్లు చిత్రం లోని కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దానా పాట రాసిన కవి

1) ఆత్రేయ
2) కొసరాజు
3) శ్రీశ్రీ
4) ఆరుద్ర

ఇటీవలే వివాహమైన,సాహిత్యాభిమాని, మిత్రుడు త్రివిక్రమ్ కు ఈ వ్యాసాన్నే పెళ్లికానుక గా ఇస్తున్నా. పాఠకులు ఈ వ్యాసంపై మీ స్పందనను,మీ జవాబులను కామెంట్స్ లో తెలియజేయగలరు. మీకు వ్యక్తిగత జవాబులపై ఆసక్తి ఉన్నట్లైతే మీ జాబులో మీ e-mail చిరునామా ఇవ్వటం మరువకండి.

శనివారం, సెప్టెంబర్ 15, 2007

దీప్తిధార సందర్శకుల వివరాలు

దీప్తిధార సందర్శకుల వివరాలు ఇస్తున్నాను -పాఠకుల సమాచారం నిమిత్తం. సమయం: శనివారం రాత్రి 10 గంటలకు సేకరించినవి.






ఈ స్పందన, ఈరోజు ఈనాడు లో, తెలుగు బ్లాగుల పై వచ్చిన వ్యాసం వల్ల వచ్చినది కాదు.J M Garg's Bird Photography (http://deeptidhaara.blogspot.com/2007/08/j-m-gargs-bird-photography.html) పై నేను రాసిన వ్యాసానికి వచ్చిన స్పందన ఇది. కొన్ని పక్షుల గుంపులలో ఈ వ్యాసానికి సంబంధించిన సమాచారం పంపాను.

ఒక్క రోజులో,దీప్తిధారకు ఇంతమంది సందర్శకులు (248) గతంలో ఏనాడూ రాలేదు.

గురువారం, సెప్టెంబర్ 13, 2007

సముద్ర ఘోష


Photo Courtesy: Steven Pinker


ఈ మధ్య కాలంలో కవిత్వం పై విసుర్లు, చమత్కారాలు ఎక్కువయ్యాయి. కవిత్వానికి salability లేక పోవటం తో కవులతో మాట్లాడటమే కాలం వృధా, అన్నట్లుగా వుంటాయి, ప్రచురణకర్తల తీరు తెన్నులు. ఒక మిత్రుడు, ఇంకో మిత్రుడి పై తన సహనాన్ని కొల్పోయిన సందర్భంలో అన్న మాటలు " నువ్వు మనిషివా, కవివా? ". ఒక సినిమా లో వినిపించిన కవిత ' నీ చెల్లికి అవ్వాలి పెళ్లి, మళ్లీ,మళ్లీ '. ఇట్లాంటి కవితలతో సినిమాలలో హాస్య పాత్రలను ప్రవేశ పెట్టి, కవిత్వాన్ని, నవ్వుల పాలు చేశారు.

కవిత్వమొక తీరనిదాహమన్నాడో మహా కవి.కవితలు దేశ ప్రజలను చైతన్య వంతులను చేశాయి.కార్యోన్ముఖులను చేశాయి. వందే మాతరం, జనగనమణ ఇందుకు సొదోహరణలు. శ్రీ శ్రీ మహాప్రస్థానం మరో ఉదాహరణ. భావకవి దేవులపల్లి పాటలు romantic ideas తెచ్చాయి. మనసున మల్లెల మాలలూగించాయి. కరుణశ్రీ పాటలు పూలకూ మనసుంటుందని గుర్తు చేశాయి. మన నిత్య జీవితంలో పాడు కొందుకు, మన మనఃస్థితిని బట్ట్టి రక రకాల పాటలు మనకు సదా గుర్తుకు వస్తూనే వుంటాయి. పాట మన గొంతులో కొట్లాడుతూనే వుంటుంది.

ఇలాంటి నేపధ్యంలో నెల్లూరు కవులంతా కలిసి సముద్ర తీరంలో, సముద్రం పై కవితా గోష్టి నిర్వహించటం ముదావహం. సముద్రంలో మనకు తెలియని ఎదో శక్తి మనలను తన వైపు లాగుతూనే ఉంటుంది.సముద్రపు ఒడ్డులోని ఇసక,గవ్వలు,పీతలు,పడవలు,వలలు ఒక సమ్మొహనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ సందర్భం లో సముద్రం పై నాకు లభించిన రెండు కవితలు మీ ముందుంచుతాను. ఒకటి అట్లాంటా సముద్ర తీరం నుంచి -Dr.Naveena, Child Psychiatrist, USA, రాసిన Feelings. రెండోది బంగాళా ఖాతం దరినుంచి శ్రిమతి వి.ప్రతిమ రాసినది. ఈ కవితలలో కొన్ని సామ్యాలు పాఠకులు సులువుగా గుర్తుపట్టగలరు.

Feelings

I sat in silence, Mesmerized;
Before me lay the jubilantly calm ocean;
How calm it appears and how cool the ‘cember breeze.
Waters washing my feet,
Tamely; ever so tamely.
Yet I know, know of its great strength,
I should, shouldn’t I, it took my most loved.
Suddenly I saw it rise,
A great enchanting wave,
Lapping me up in a gentle embrace;
So graceful, so pure, and yet so sadistic;
I can see it hitting so hard against the hidden racks.
Dashing against the mossy boulders;
Its hurt,
It goes back limping, bruised…
In pain;
But always, always returns from its mysterious depths,
To embrace the blue skies above,
Jumping into the air,
Each time a longer stride, a greater crescendo,
A rising inferno;
Only to hit again, yet again; and…
To die,
With a moan of melancholy!!!
-Naveena N. Innaiah
17/3/’85


సముద్రం కంటే గొప్పది
వి. ప్రతిమ

పురాతనమైన జ్ఞాపకాలని తవ్వుకుంటూ
కోల్పోయిన మనిషితనాన్ని వెతుక్కుంటూ
పారదర్శకమైన మనుషుల కోసం
అప్పుడప్పుడూ సముద్రతీరానికెళ్తాను.
ప్రేమించిన అనేక దుఃఖసమయాలని పోగుచేసి గూళ్ళు కడతాను.
ప్రాణతోరణమై సమూహాలని తన
గుమ్మానికి కట్టేసుకున్న సముద్రం
కాళ్ళు కడిగి నాతో కరచాలనమే చేస్తుంది.
కడుపులో బడబానలాన్ని దాచుకుని పైకి
అలల రెక్కలతో ఉరకలేస్తూ,
హృదయాన్ని మొగ్గలుమొగ్గలుగా విరబూయమంటూ
జీవితరహస్యాల్ని విప్పుతుంటుందుదధి…
అనుకుంటాంగానీ
సైకత తీరాలకేసి తలలు బద్దలుకొట్టుకుని కొట్టుకుని
ఎంతకని ఎక్కిళ్ళను దిగమింగగలదు పాపం
అందుకే అవసరమైతే
ఉత్పాత ఉద్యమమై భూపప్రంచాన్ని వొణికంచనూ గలదు
శాంతి కపోతాన్ని కెరటపు రెక్కల్లో పొదువుకుని
తీరాన తిరుగాడే ప్రజలకు పంచనూ గలదు,
సముద్రం యింకా చాలా చెప్తుంది నాకు
యుద్ధభూమిలో ఉన్నపుడు ఉద్యమం తప్పనిసరి…
నేటి చరిత్రంతా పోరాటాలే కదా మరి.
ఏళ్ళ తరబడి కల్లోల సముద్రాల్ని కడుపులో దాచుకున్న
నాకంటే నువ్వు ఏమంత గొప్పదానివని సవాలు విసురుతాన్నేను.
బొట్లుబొట్లుగా రాలుతోన్న నా ప్రశ్నల వర్షాన్ని తట్టుకోలేక
నాలోలోపలికి ఐక్యమైపోతుంది సముద్రం
మరణమొకటి మొగసాల నిల్చుందని
జీవించడం మానగలమా?
సునామీ వస్తుందని…సునామీ వస్తుందని
సముద్రాన్ని ప్రేమించకుండా వుండగలమా?