సోమవారం, జనవరి 31, 2011

తెలుగు కోకిల అంజనా సౌమ్య

Anjana Sowmya Photo courtesy: Muzigle.com

చక్కటి కంఠస్వరం, వినయం, సౌమ్యం ఆభరణాలుగా  ఉన్న, 1986 లో జన్మించిన, చింతలపూడి అంజనా సౌమ్య  కాకినాడ అమ్మాయి.  'సూపర్ సింగర్స్--4' గ్రాండ్ ఫినాలే లో ఆమెకు మూడు లక్షల రూపాయల బహుమతి వచ్చినా ఎగిరి గంతేయకుండా తన సహ గాయకులను అభినందించే స్థితప్రగ్నత ఉందీ సౌమ్యకు.   పేరుకు తగ్గట్లే  ఆమెలోని నమ్రత ఆమెను శ్రొతలకు మరింత దగ్గరగా చేర్చింది. "కృష్ణా నీ బేగనే బారో" పాటతో ఎందరో సంగీతాభిమానుల గుండెలలో కూర్చుండిపోయింది. 2006-2007 లో కాకినాడ జె.ఎన్.టి.యు లో బి.టెక్ ( ECE) తర్వాత ఎం.బి.ఎ  చేసిన సి.పి.సౌమ్యకు సంగీతమంటే ప్రాణం. తండ్రి (శ్రీ గోపాల కృష్ణ, విశ్రాంత బాంక్ అధికారి) , తల్లి  (శ్రీమతి సుమతి) ల ప్రోత్సాహంతో  మా టి.వి నిర్వహించిన  పాటల పోటీలో విజేతగా నిలిచింది. గురువులైన శ్రీయుతులు కాకరపర్తి వీరభద్ర రావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద శాస్త్రీయ సంగీతం అభ్యసిస్తే, లలిత సంగీతాన్ని శ్రీయుతులు ఉమ మరియు వడలిఫణి నారాయణ గార్ల వద్ద  నేర్చుకోవటం జరిగింది. కర్ణాటక సంగీతం లో డిప్లొమా ఉన్న సౌమ్య, ఆల్ ఇండియా రేడియో లో  కళాకారిణిగా ఎంపికయింది. చదువు, సంగీతం, సినీ నేపధ్య గాయని పనులను ఏక సమయంలో చేసిన ధీశాలి. మా టివి సూపర్ సింగర్ పోటీ 1,2 మరియు 3 లలో విజేత కాలేనప్పటికీ  పట్టువిడవకుండా కృషి చేసి 4 వ సారి కృతకృత్యురాలయ్యింది సౌమ్య.

అవరోహణలు

 
2000 లో పాడుతా తీయగా పిల్లల పోటీలో విజేత.
2004 లో ఈ టివి ప్రియా ప్రియతమ రాగాల విజేత.
2005 సింగపూర్ మరియు చెన్నై ల లో కర్ణాటక, భక్తిగీతాల కచ్చేరి
2010 మా టివి సూపర్ సింగర్ పోటీలో విజేత
2010 లో అమెరికా లో  జి ఆనంద్  నవతరం స్వరమాధురి,చక్రి టాలీవుడ్ హంగామా ల లో సహ గాయకులతో కలిసి  పాట కచ్చేరి.
సినిమాలు:ఆలయం, జులాయి, క్లాస్‌మేట్స్, ప్రేమలోకం, న్యాయం కావాలి మొదలగు చిత్రాలలో నేపధ్య గాయని.     

విజేత అయ్యాక చాలా సినిమాలలో పాటలు పాడినా అవి ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. అయితే కోటి సంగీత సారధ్యం వహించిన  క్లాస్‌మేట్స్  లో మల్లికార్జున్ తో కలిసి పాడిన మౌనమెందుకు, దరిచేరవెందుకు అన్న సిరివెన్నెల పాట ఆమెకు తృప్తి, గుర్తింపు తెచ్చాయి. తాజాగా మా పసలపూడి కధలు టి.వి. ధారావాహికకు పాడిన టైటిల్ సాంగ్ ఆమెలోని ప్రతిభను మరోసారి వెలుగులోకి తెచ్చింది. నిస్సందేహంగా సౌమ్య చక్కటి  గాయని. అయితే, తన గాన మాధుర్యాన్ని పూర్తి స్థాయి లో  ఉపయోగించుకునే పాటలు  పాడే అవకాశం కోసం ఈ తెలుగు కోకిల ఎదురు చూస్తూ ఉంది.  ఆ అవకాశం లభిస్తుందని, సౌమ్య మరింత ఎత్తుకు  ఎదుగగలదని ఆశించవచ్చు.  

తాజాగా అంధ్రప్రదేష్  అనే లఘుచిత్రానికి అంజనా సౌమ్య  శ్రావణ భార్గవి, పవన్ ల తో కలిసి నరేష్ సంగీత సారధ్యంలో  పాడిన పాట  చూడండి.  ఈ పాట రచయిత సాహిత్య సాగర్. దర్శకత్వం: వాసు  నిర్మాణం: TEAM WORKS



ఫేస్‌బుక్ లో మీరు  అంజనా సౌమ్య అభిమానులలో చేరాలనుకుంటే ఈ లంకె  ద్వారా  చేరవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి