శుక్రవారం, నవంబర్ 03, 2006

నా నెల్లూరు పర్యటన -4



గాంధీ బాటలో ఉద్యమకారుడు సుకుమార్ రెడ్డి - 2

పొగాకు శతకము

ఆంధ్ర దేశాన ధూమపానప్రియులధికం. పొగచుట్ట, బీడీలు, పొగాకు, నశ్యం, సిగరెట్ల రూపంలో ధూమపానం గోచరిస్తుంది. పొగచుట్ట గురించి చిరుమర్రి నరసింహ కవి గారు రాసిన ఒక పద్యం ఇది
ప్రొద్దున లేచి
ధూమ్రదళపుంజము
కన్నులకద్దుకొని దా
ముద్దుగ చుట్టదీర్చి తన
మోము పయిం ఘటియించి
మీసముల్
దిద్ది పొగాకువేడియును
ధీజనకోటికి మోదమిచ్చి తా
పెద్దలపేరు జెప్పి
పొగబీల్చినవాడు
కృతార్ధుడిమ్మహిన్


గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలోని గిరీశం ఐతే పొగతాగని వాడు దున్నపోతయి పుట్టున్ అంటూ తీర్మానించేశాడు. ఒక సినీ కవిగారైతే సరదా సరదా సిగరెట్టు, ఇది ఆలోచలను రేగొట్టు అంటూ సిగరెట్టు మనల్ని చైతన్యవంతులుగా చేస్తుందని వాక్రుచ్చారు.

సుకుమార్‌గారి ఆలోచనల ధారా పుస్తకం పొగాకు శతకం. ధూమపానము మొదట సరదాగా మొదలై, విషాదంగా ముగుస్తుందనీ అందుకు అకాల మృత్యువాతపడిన తన తండ్రిగారే పెద్ద ఉదాహరణ అంటారు.
1995లో లయన్స్‌క్లబ్ వారు నిర్వహించిన ధూమపాన వ్యతిరేక నినాదాల పొటేలో సుకుమార్ గారి ' పొగచుట్టలు ప్రజలపాలిటి కొరివికట్టెలు ' నినాదం, ఉత్తమమైందిగా ఎంపికైంది. వీరి శతకంలోంచి కొన్ని ఆలోచల్ని మీముందుంచుతాను.
అంతుబట్టని విషయం
చాలా మంది బస్సుల్లో, రైళ్ళలో,స్త్రీ, బాల, వృద్ధుల మధ్య, మొదలైన చోట్ల పొగదాగుతావుంటారు. వీళ్ళని గాడిదనాల్నో, పందుల్తో బోల్చాల్నో, దున్నపోతులని తిట్టాల్నో అర్థం కాదు.నిజానికియ్యేవి పొగత్రాగవు. అటువంటప్పుడు వాళ్ళని వీటితో పోల్చటం ఈ జంతువుల్ని అవమానించటమే ఔతది. ఐతే, ఇంక దేంతో బోల్చాలా? అది అంతుబట్టని విషయమే.

పొగాకు తినేవాళ్ళకి

తిన్నదాన్ని విసర్జించటానికి అందరికీ ఒక అవయవముంటే, పొగాకుదినేవాళ్ళకి రొండుంటాయి. ఆ రెండో అవయవం పేరు - నోరు.

ధూమపానం మాన్పించటానికి అనేక చిట్కాలు చెప్తారు రచయిత పొగాకు శతకంలో.
చిట్కా
మీ పక్కనెవరైన పొగదాగతుంటే - వాళ్ళ దృష్టినాకర్షించేరకంగా మొఖం వికారంగాబెట్టి, చేతిగుడ్డతో ముక్కు మూసుకోండి. ఈ సందర్భంలో మీరు వాళ్ళ మొఖంలోకి జూడాల్సిన పన్లేదు. సామాన్యంగా ఈ చిట్కా బాగా పంజేసి, వాళ్ళు మీ పక్కనుంచి దూరంగా బొయ్యేట్లు జేస్తది. ఒక్కొసారి - వాళ్ళు తమ పొగదాగుడ్ని అప్పటికి ముగించినా ముగించొచ్చు.

పలు సభలలో ధూమపానానికి వ్యతిరేకంగా ఉపన్యసించారు. కొంతమంది వారి మాటలతో ప్రభావితులై ధూమపానం మానివేశామని సుకుమార్ గారికి తెలియ చెప్పినప్పుడు వారికి కలిగే ఆనందం మాటల్లో చెప్పనలివికాదు.
అహింసా మార్గంలో నిరసన

సుకుమార్‌గారు ఏమి చేసిన కొంత నూతనంగానే తమదైన పద్ధతిలో ప్రచారోద్యమం గాని నిరసనగాని ఉంటాయి. వారింటిముందున్న నల్ల పలుకపై నినాదాలుగాని, నిరసనోద్యమ వార్తలుగాని రాసి ప్రజల దృష్టినాకర్షించి వారి మద్ధతు పొందుతారు.

2000 సంవత్సరం తెలుగుదేశం హయాములో అకస్మాత్తుగ పెరిగిన విద్యుత్ చార్జీల పెంపుపై తమ నిరసనగా ప్రతిరోజూ రాత్రి 7.30 నుంచి 8.30 దాక వారింటిలో విద్యుత్ వాడకాన్ని ఆపివేస్తున్నట్లుగా నల్ల పలుకపై ప్రకటించి దాన్ని నిరాఘంటంగా 3 సంవత్సరముల 11 నెలల 2 రోజులు అమలుపరిచినారు. తెలుగుదేశం పార్టి ఓడిన తదుపరి ఈ దీక్ష విరమించినారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని పలు కష్ట నష్టాలకోర్చి చెయ్యటం జరిగింది.మధ్య కాలంలో సుకుమార్‌గారి తల్లి గారు (71 Years) చీకటిలో పడిపోవటము, వీరి ధర్మపత్ని కి ఒక పర్యాయం 'చిన్న ఆపరేషను ', మరో మారి ' పెద్ద ఆపరేషను ' జరగటం వలన విపరీతంగా చెమటలు పట్టేవి. అయినా కష్టాలకోర్చి నిరసన కొనసాగించారు.

వీరి నిరసన కార్యక్రమాలు Media దృష్టిని ఆకర్షించాయి.సింహపురి రైతు, ప్రజాశక్తి పత్రికలు, విస్సా టెలివజన్ వారు ఈ నిరసన గురించి విపులంగా రాశారు/చూపారు. భారత స్వాతంత్ర పోరాటంనాటి నూలు వడకటం, ఖద్దరు ధారణ, విదేశీవస్తు బహిష్కరణ, ఉప్పు తయారీ వంటి - ఎవరైనా అమలుపరచగలిగిన తరహా కార్యక్రమాలుగా ఈ నిరసనను సుకుమార్‌గారు భావించారు. సుకుమార్‌గారి మాటల్లో చెప్పాలంటే ' మా నిరసన నిర్ణయం, ఆ నిర్ణయంవెనకున్న మా అవగాహన, మా ఆచరణ , మా అనుభవాలు - ప్రజా ఉద్యమాలకి స్పూర్తిగా నిలువగలవనే ప్రగాఢ విశ్వాస భావనతో ఉన్నాము.'

Pinakini Body Donors Organisation

వైద్య విధ్యార్థులు శరీరశాస్త్ర నిర్మాణ రహస్యాలు తెల్సుకోవటానికై మృతదెహాలపై శస్త్రములతోటి ఖేదించి శల్యశాస్త్ర మర్మాలు నేర్వవలసియున్నది కాని మృతదేహముల కొరత మిక్కుటముగాయున్నది. దీనిని గుర్తించి సుకుమార్‌గారు Pinakini Body Donors Organisation స్థాపించినారు. అప్పటికి నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఇంకా రాలేదు. ఇలాంటి ఆలోచన ఆరోజుల్లో చాల కొత్త. ప్రజలలో దేహదానంపై వీరి ప్రయత్నాలు మంచి అవగాహన కలుగచేశాయి. ప్రస్తుతము నెల్లూరులోనే మెడికల్ కాలేజ్ ఉన్నది.

సుకుమార్‌గారు రచయిత కూడ అవటంతో రక్త, నేత్ర దానాలపై కొన్ని రచనలు చేశారు. అవి అముదిత్రములు. సుకుమార్‌గారు 1992 ఆగస్ట్‌లో ఏర్పడ్డ సారా వ్యతిరేకోద్యమ సమన్వయ సమితితో కలిసి పనిచేసి ఆ ఉద్యమానికి చేయూత నిచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వమువారు విద్యుత్ ను Private పరం చేస్తున్నట్లు, ప్రపంచ బాంక్ ఆదేశాలపై విద్యుత్ శాఖలో మార్పులు చేసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో నెల్లూరులో మరో ఉద్యమం వస్తుందా? అనేక ఊద్యమాలకు నాంది పలికిన నెల్లూరు నుంచి ఏమి కొత్త ఉద్యమాలు రానున్నాయో?

P.S. ఈ వ్యాసం చదివాక మీ అభినందనలు సుకుమార్ రెడ్డి గారికి తెలియ చేయాలని ఉందా? వారి సేవా కార్యక్రమాలలో మీకు కూడ పాల్గొనలాని ఉందా? అయితే వారికి రాయండో ఉత్తరం.

Sri Thikkavarapu Sukumar Reddy
223rd House, K.A.C. Avenue,
Opp to Park, Stone House Peta,
Nellore 524 002
Andhra Pradesh
India.

ఉత్తరం రాయటం కష్టమనిపిస్తే, నాకు e-mail చెయ్యండి. మీ స్పందనను నేను వారికి పంపిస్తాను. నా e-mail: cbraoin at gmail.com

6 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

ఇన్ని మంచి పనులు చేసిన సుకుమార్ రెడ్డి గారి గురించి ఇన్నాళ్ళూ నాకు తెలీదు.అనవసర విషయాలకి ఎక్కువ ప్రాముక్యం కల్పిస్తూ....ఇలాంటివాళ్ళ ను మరుగునపడేస్తున్నాము.ఇంత మంచి వ్యక్తిని పరిచయం చేసినందుకు ముదుగా మీకు నా ధన్యవాదములు.ఆ మహానుభావునికి శిరశ్శు వంచి వందనాలు చేస్తున్నాను.

అజ్ఞాత చెప్పారు...

rAvu gAru

bAvundi, inkA ee Satakam gurinci vivarAlu teluputAru ani anukunTU..

nEnu monna mana gumpulO ceppina cirumarri narasimha kavi gAru raasina ee padyam mI ee dhAra ki upOdghAtam gA pani cEsinanduku santOshamgA undi

mAlini

cbrao చెప్పారు...

ఎక్కడో మరుగున ఉన్న చిరుమర్రి నరసిమ్హ కవిగారి కవితను వెలుగులోకి తెచ్చిన మీకు అభినందనలు. సుకుమార్ రెడ్డి గారిపై రెండు టపాలు రాయటం సాహసం అనుకుంటా. పాఠకులు టపాను సాగదీసినట్లుగా భావించక మునుపే వ్యాసం ముగించటం క్షేమకరం. అందుకే పొగాకు శతకం లోని సారాంశాన్ని తెలియచేశాను. William Shakespeare చెప్పినట్లుగా Brevity is the soul of wit. నేను నెల్లూరులో గడిపినది మొత్తం 36 గంటలు. ఇప్పటికి 4 టపాలు. ఇంకా ఎన్ని టపాలు నెల్లూరుపై రాస్తానొ ఇప్పుడే చెప్పలేను. ఎప్పుడూ నెల్లూరేనా అని పాఠకులకు విసుగు జనిస్తొందేమో అనే భయం, నెల్లూరు గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు పాఠకులకు తెలియ చెప్పాలన్న ఆసక్తీ రెండూ ఉన్నాయి.

ఆసా చెప్పారు...

పొగాకు పై పోరాట౦ ఆసక్తికర౦గా వు౦ది. నా వరకు ఈ పోరాట౦ చేస్తునే వున్నాను.
కాలేజీ లో స్నేహితులు 'సిగరెట్టు' కోస౦ చిల్లర కావలని ఎ౦త బతిమాలిన అస్సలు ఇచ్చేవాడిని కాదు.
మా ఆఫీసులో 'సిగరెట్టు' వలన వచ్చే వ్యాదులను ప్రి౦ట్ తీసి , ఒక మీటి౦గ్ లో సిగరెట్ ప్రియులతో చదివి౦చాను.
విచిత్ర౦గా ఇక్కడ ఆస్ట్రేలియా లో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగ పొగ తాగుతారు. ఈ మద్య మన దేశ౦లో కూడ మొదలయి౦ది అనుకొ౦డి.

cbrao చెప్పారు...

రాధిక - మానవసేవే మాధవసేవ అని నమ్మే వారు మన చుట్టూరా ఉన్నారు. నాకు ఈ మధ్య తటస్థపడ్డవారు సుకుమార్‌గారు ఇంకా ప్రశాంతి. ప్రశాంతి తన సేవా కార్యక్రమాలకై ఒక యహూ గ్రూపు నడుపుతున్నారు. మీకు ఆసక్తిఉంటే http://groups.yahoo.com/group/tomakeadifference/లో సభ్యులుగా చేరవచ్చు. మీ స్పందనకు నా ధన్యవాదాలు.

ఆసా - పొగ తాగటం వలన వచ్చే నష్టాలగురించి ప్రజలకు తెలియచెప్పటం లో మీరు చేసే ప్రయత్నాల్లాంటివి మరొ ముగ్గురూ, అ ముగ్గురిని చూసి మరొ ముగ్గురూ మొదలెడితే ఈ సందేశం ఎక్కువ మందికి చేరుతుంది.ఒకప్పుడు నెనూ పొగతాగే వాడినే. కాని అది నిరర్ధకమని గ్రహించి మానివేసాను. ఈ మానివేయటం వెనక నా భార్య సహకారము, బెదిరింపూ కూడ ఉన్నాయి. మీరు పొగాకుకు వ్యతిరేకంగా మీ కార్యక్రమాలు కొనసాగించండి.

ramperugu చెప్పారు...

maa madhya ento niradambaranga thirugaade maa sukumar reddy gurinchi intha manchi vyasam raasi
andariki parichayam chesinanduku
dhanyavaadaalu...
ram

కామెంట్‌ను పోస్ట్ చేయండి