బుధవారం, నవంబర్ 22, 2006

నా నెల్లూరు పర్యటన -6

ఆధ్యాత్మిక వాదులు: భౌతిక వాదులు

వీరి మధ్య చార్వాకుల కాలం నుంచీ ఆసక్తికరమమైన చర్చ జరుగుతూనే ఉంది. 'అద్వితీయ శక్తులున్న భగవంతుడున్నారనే వాళ్ళందరూ ఒక వుదాహరణ తప్పకుండా చూపుతారు. దేవుడే లేకుంటే ఈ భూమి క్రమం తప్పకుండా ఎలా తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది? ఇన్ని గ్రహాలు, నక్షత్ర మండలాలూ దేవుడి నిర్దేశం లేకపోతే ఎలా తమ తమ కక్ష్యల్లో అంత క్రమంగా తిరుగుతాయి?' http://www.charasala.com/blog/?p=116

మొదట్లో మానవ పరిణామ క్రమంలో మనిషికి ప్రక్రుతిలోని సహజ సిద్ధమైన అగ్ని,
వర్షం, స్త్రీ గర్భం దాల్చి శిశువును కనటం లాంటివన్నీ ఎంతో వింతగా సంభ్రమాచ్యారాలు కలిగించేవిగా ఉన్నాయి. తనకు అర్థం కాని ఈ విషయలన్నింటినీ తనకు తెలియని ఎదో శక్తి నడిపిస్తోందనీ. ఆ శక్తే దైవమని నమ్మాడు. ఈ క్రమంలో అగ్ని దేవుడు, వరుణ దేవుడు,ఆది శక్తి జనించారు. భూగొళానికి వెలుగునిచ్చే సూర్యుని, చంద్రుడిని దేవుళ్లన్నాడు. గ్రహణాలకు అచ్చెరువొంది రాహు, కేతులు సూర్య చంద్రులను మింగేంస్తున్నారని అపోహపడ్డాడు. ఇంకా కాలక్రమంలో గ్రామ దేవతలు, ముక్కోటి దేవుళ్ళు వెలిశారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు అగ్ని, వర్షం ఇంకా సృష్టి రహస్యాలు కనుక్కుంటున్న ఈ తరుణంలో ఆదిమ మానవుడి ఎన్నో సందేహాలకు , భయాలకు సమాధానం లభించింది. Darwin’s theory of evolution ను God's intelligent design గా మార్చి తమదే పైచేయి అందామనుకున్న మత చాందసులకు ఈ నూతన శాస్త్ర పరిశోధనలు మింగుడు పడటం లేదు.



చంద్రుడిపై మానవుడు కాలు మోపటం అబద్దమని, దాన్ని విశ్వసించవొద్దనీ ఈ చాందసవాదులు చెప్తున్నారు. ‘ఎదీ శూన్యం లోంచి రాదు‘ అని భౌతికవాదులు నమ్ముతారు. అట్లా వస్తే అది మాయా, మహిమా కాదు కనికట్టు అంటారు హేతువాదులు. శాస్త్రవేత్తలు గ్రహాలు,పాలపుంతలను దాటి మన ఊహకు అందని దూరంలో ఉన్న విశ్వ రహస్యాల ఆవిష్కరణకై నిరంతరం శ్రమిస్తున్నారు. మనకు ఒక విషయం తెలియనప్పుడు అది ఎంతో జటిలంగా కనపడుతుంది. ఆది మానవుడి ఊహకు అగ్ని, వర్షం పెద్ద పరీక్షే. ఈ రోజుకీ అంతుపట్టని విషయాలు ఇంకా ఉన్నాయి. ఒక దాని వెంబడి మరొకటిగా అన్ని చిక్కు ముడులూ విడుతున్నాయి.

ప్రశాంతి తను అప్పుడప్పుడూ వెంకయ్య స్వామితో మాట్లాడుతుందని నేను గతంలో రాసినదానిని కొంతమంది పాఠకులు తాము విశ్వసించజాలమని నాకు తెలిపారు. వెశేషమేమంటే ఇలా చెప్పినవారిలో ఆస్తికులు, నాస్తికులిరువురూ ఉన్నారు. దేవుడున్నడా లేడా అనే దానిపై చాలా చర్చ జరిగింది. ఉంటే దానికి నిదర్శన మేది అని హేతువాదుల ప్రశ్న. కంటికి కనిపించేదే సత్యమనీ, శాస్త్ర పరీక్షకు నిలిచేదే వాస్తవమనీ నమ్ముతారు వీరు. గాలి కనిపిస్తొందా - అయినా అది ఉంది కదా, అలాగే దేవుడున్నాడు కాని కనిపించడు అని ఆస్తికుల వాదన. దేవుడిని విశ్వసించేవారికే దేవుడు కనపడతాడు, మిగతా వారికి దేవుడు కనపడడని ఆస్తికుల వాదన. నిప్పు ఆస్తికులనూ , నాస్తికులనూ సమానముగా దహిస్తుంది. అట్లాగే దేవుడూ తను ఉంటే ఆస్తికులు,నాస్తికులిరువిరికీ ఇవ్వాలి దర్శనం అంటారు భౌతికవాదులు. ఈ వాద ప్రతివాదాలు అన్నీ వింటే దైవం వ్యక్తిగతమనీ, వస్తుగతం కాదనీ అవగతమౌతుంది. ఇంకాస్త ముందుకు వెళితే దేవునితో మాటలాడటం Schizophrenia అనే మానసిక స్థితి అని మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణ. మానవ మెదడులో ఎన్నో రసాయనాలుంటాయనీ, Dopamine అనే రసాయన లోపం వలన మెదడులోని Neurotransmission వ్యవస్థ సరిగా నియంత్రించ బడక Schizophrenia అనే స్థితికి కారకమౌతుందని Psychiatrists చెపుతారు. కొంతమంది బాబాలు తాము దేవునితో మాట్లాడుతాం అనే భ్రాంతిలో ఉండి, భక్తులనూ నమ్మిస్తారు. భక్తుల నమ్మికే ఈ బాబాలకు కొండంత అండ. విత్తు ముందా, చెట్టు ముందా లాంటి చర్చలకు ముగింపు ఉండదు. నెల్లూరు పయనిస్తున్న మా వాహనం గమ్యస్థానం చేరింది.


కృష్ణ పట్నం

అప్పటికే రామకృష్ణ గారు వారి కార్యాలయం నుంచి ఇంటికి వచ్చియున్నారు. మధ్యాహ్న భొజనమయ్యాక అందరం కృష్ణ పట్నం వెళ్దానుకున్నాము. ఒక Tourist car లో బయలుదేరాము. విశేషమేమంటే చాల కాలంగా నెల్లూరులో ఉంటున్న రామ కృష్ణగారు గాని, అక్కడే పుట్టి పెరిగిన ప్రశాంతిగాని అంతవరకూ కృష్ణ పట్నం చూడనే లేదు. కృష్ణ పట్నం సహజ సిద్ధమైన లోతైన ఓడ రేవు. ఆంధ్ర దేశానికి ఇది కాబొయే మరో విశాఖ పట్నం. నెల్లూరునుంచి సుమారు 25 K.M. ల దూరంలో ఉంది. ఇక్కడనుంచి ఓడ రేవు దాకా Double lane road ఉంది. భవిష్యత్లో ఇది నాలుగు సందుల రహదారి కాబోతుంది. బెళ్ళారి నుంచి ఎగుమతయ్యే ఇనుప ఖనిజానికి ఈ రేవు చాల దగ్గరగా ఉంటుంది. 2007-2008 నుంచి చెన్న పట్నం నుంచి ఇనుప ఖనిజ ఎగుమతులు ఆపివెయనున్నారు కావున కృష్ణ పట్నంకు చాలినంత పనిఉండగలదు. కృష్న పట్నం నుంచి ఓబులవారిపల్లె (గుత్తి -రేణుగుంట స్టేషన్ల మధ్య) దాకా కొత్త రైల్వే లైన్ 114 కి.మీ. వేయటానికి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కడప జిల్లాలోని ఓబులవారిపల్లె నుంచి కొండలు, లోయలు లోంచి పలు Ghat Lines తో Eastern Ghats మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం గావించ బడుతున్నది. 580 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని Krishnapatnam Rail Road Company Ltd నిర్మాణం గావించబోతున్నది.


Photo:cbrao ఉప్పు సేద్యం

కృష్ణ పట్నం కు వెళ్ళే దారిలో, రహదారి పక్కనే చాలా చేపల, రొయ్యల చెరువులున్నాయి. వీటినుంచి వచ్చే దుర్గంధము ముక్కుపుటాలదిరేలా ఉంది. అంతే కాక ఈ చెరువులు, కాలుష్య కారకులై సమీప గ్రామాల లోని ప్రజలకు తాగే నీరు లేకుండా చేస్తున్నాయి. దారిలో మాకు ఉప్పు మడులు కూడా కనిపించాయి. పొలాలలో గట్లు కట్టి సముద్రపు నీరు ఎండ బెట్టి ఉప్పు సేద్యం చేస్తున్నారిక్కడి రైతులు. ఇంకాస్త ముందు కెళితే మాకు బకింగ్ హాం కాలువ కనిపించింది. బ్రిటిష్ వారి హయాంలో ఇది ఒక వెలుగు వెలిగి ఇప్పటి పాలకుల నిర్లక్ష్యంతో పెద్దగా ఉపయోగించబడకుండా ఉంది.


Photo:cbrao బకింగ్ హాం కెనాల్

1806 లో బకింగ్ హాం కెనాల్ నిర్మాణం ప్రారంభించబడినది. తమిళ నాడు లోని మరక్కాణం నుంచి ఆంధ్ర ప్రదేష్ లోని క్రిష్ణా జిల్లా లోని పెద్దగంజాం దాక ఇది ఉంది. దక్షిణాన చెన్నై నుంచి మరక్కాణం (పాండిచెర్రికి ఉత్తరాన ఉంది)దాకా 163 కి.మీ ఉంది. ఆంధ్ర ప్రదేష్ లో ఈ కాలువ 257 కి.మీ. పొడుగుంది. 1876 మరియు 1878 లో కరువు కోరల్లో చిక్కుకున్న దక్షిణ భారతావనిని ఇది కాపాడింది. 1880 నుంచి 1940 దాక, తక్కువ ఖర్చులో ఇది ప్రజల మరియు సరకుల రవాణా సౌకర్యానికై బాగా ఉపయోగ పడింది. 1947 నుంచి దీన్ని ఉపయోగించటం తగ్గింది.1965 తుఫానుతో కాలువ దెబ్బతినింది. 2004 సునామి సందర్భంలో ఈ కాలువ సముద్రపు నీటికి అడ్డుకట్టై నిలిచి ఎందరో బెస్తవారిని, చాలా గ్రామాలను రక్షించింది. సముద్రానికి 1 కి.మీ. దూరంలో ఈ కాలువ కోస్తా తీరంలో ఉంది. అందమైన ఈ కాలువను కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో పూర్వ వైభవానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.

నెల్లూరు వెళ్తున్నానని హైదరాబాదులోని మిత్రులు మురళీ ధర్ కు చెప్పినప్పుడు కృష్ణ పట్నం గ్రామము నుంచి ఓడరేవుదాకా బకింగ్ హాం కెనాల్లో పడవలో వెళ్ళమని అది సరదాగా ఉంటుందనీ సిఫారసు చేసినారు. అదే విషయాన్ని రామకృష్ణగారికి చెప్పాను. మా కారు కొత్తగా వేసిన తారు దారిపై వెగంగా వెళ్తూ, కాపలా దారు సంజ్ఞతో హటాత్తుగా ఆగింది. కారు ముందు అద్దం లోంచి కృస్ణ పట్నం పొర్ట్ అని పెద్ద Board కనిపించింది. అంటే గ్రామానికి వెళ్ళి పడవలో ఇక్కడకు రావాలిసిన వాళ్ళం తిన్నగా ఇక్కడికే కారులో వచ్చామన్నమాట. Port లో పనులు జరుగుతున్నవి కావున ముందుకు వెళ్ళరాదనీ అక్కడే వెను తిరగాలనీ సూచించాడు. రామకృష్ణ గారికీ ఈ దారి కొత్త కనుక మా driver ఎటు తీసుకు పొతున్నాడో తనూ గమనించలేక పోయారు.

11 కామెంట్‌లు:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

రావుగారూ

ఆధ్యాత్మికత మూఢవిశ్వాసం కాదు. దానికీ దీనికీ ముడిపెట్టరాదు.మనకి తెలిసిన సైన్సు అణువంత.ఆ కొద్దిదానికే గర్వించడం పనికిరాదు.ఆ గర్వం దేవుణ్ణి హీనం చేసి మాట్లాడే దాకా వెళ్ళడం పతన హేతువు.మన జ్ఞానం అంతా ఆయన అనుమతితో సంపాదించుకున్నది.మన జ్ఞానం దానితో మనం అభివృద్ధి చేసుకుంటున్న సంస్కారం ఆయనకి నచ్చనప్పుడు ఈ ప్రగతి అంతా నిర్దాక్షిణ్యంగా ఉపసంహరించబడుతుంది.గతంలో ఎన్నో సార్లు అలా జరిగింది.ఇకముందు కూడా అదే జరగబోతోంది.ప్రకృతి గురించి అణువంత తెలుసుకోవడం ప్రకృతిని అదుపులోకి తెచ్చుకోవడం క్రిందికి రాదు. మహా అయితే అది ప్రకృతిని అనుకరించడం క్రిందికి వస్తుంది.ప్రకృతి అనేది మన ఊహలకి అందని చాలా పెద్ద entity.ఇప్పటికే తెలిసి ఉన్న పాత పదజాలం (known vocabulary) తో ప్రతి phenomenon ని వర్ణించడం scientific గా చెలామణీ అవుతోంది. ఎవడైనా ఆ పదజాలపు పరిధి దాటి వేరే పదజాలంతో వర్ణిస్తే వాడికి అసహ్యమైన పేర్లు పెట్టడం జరుగుతోంది.దేవుడితో మాట్లాడ్డం ఒక మానసిక జబ్బు అంటూ మీరు చేసిన పని అదే.కేవలం ఒక పక్షపు వాదనని భుజానికెత్తుకున్న మీరు ఏ విధంగా scientific అనిపించుకుంటారు ? ఏ అనుభవాలూ పొందని మీరు ఎవరి అనుభవాలకి మానసిక జబ్బు అని పేరుపెట్టడానికి సాహసిస్తున్నారు ? మీ wave-length ఇంకా ఆ స్థాయికి చేరకపోతే చేరుకోలేదని అంగీకరించండి.అంతేగాని మీకు ఆసక్తిలేని విషయం మీద కృషి చేస్తున్న ఆధ్యాత్మికులకి మానసిక రోగులని మరొకటని పేర్లు పెట్టకండి.

రానారె చెప్పారు...

ఆధ్యాత్మికత మూఢవిశ్వాసం అని రావుగారనలేదు.
"మన జ్ఞానం అంతా ఆయన అనుమతితో సంపాదించుకున్నది" - అని మీరంటున్నారు.
"దానితో మనం అభివృద్ధి చేసుకుంటున్న సంస్కారం .." - అంటే మన సంస్కారంమీద దేవుని కంట్రోల్ లేనట్టా!?
జ్ఞానం ఆయనిచ్చినదైనపుడు, దాని Bi-Product ఐన సంస్కారం కూడా ఆయనదే కావాలి కదా.

"శేషం కోపేన పూరయేత్" అని ఒక సంస్కృత వాక్యం గుర్తొస్తోంది నాకు.

spandana చెప్పారు...

తెలిసింది కొంతే అయినా యధార్థవాదులు లేదా హేతువాదులు తెలియనిదానికోసం ప్రయత్నిస్తారు తప్ప "దేవుడు" అనే అభూతకల్పనలో కాలం గడపరు. ఈ అనంతమైన విశ్వరహస్యంలో మానవునికి తెలిసింది కొంతే అనడంలో సందేహించనక్కరలేదు ఎందుకంటే తెలియంది ఎంతో తెలియదు గనుక. అయితే ఆ తెలిసిన కొంతతోనే దేవున్ని, దయ్యాన్ని భయపడే మనస్సు సృష్టించుకొన్నదని అర్థమవుతూనే వుంది.
మనకు అర్థం కానిదెంతో వుందని అంగీకరిస్తూనే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప అదంతా దేవుని సృష్టి అని కూర్చుంటే ఇప్పటికీ భూమి బల్లపరుపుగా వుందనీ, భూమే విశ్వానికి కేంద్రమనీ నమ్ముతూ వుండేవాళ్ళం.
క్రీస్తును నమ్మేవాళ్ళను కించపరచడం నా వుద్దేశ్యం కాదుగానీ, నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు ఓ క్రిస్టియన్ ఉపాద్యాయుడు పదవీవిరమణ చేస్తూ ఆ సందర్బంగా పిల్లలందరికీ బైబిల్ పంచిపెట్టాడు. అదీ నేను మొదట బైబిల్ చదవడం. మెదటి అద్యాయం లోనే నా ఆసక్తి అంతా నీరుగారి పోయింది.
"భూమి సృష్టింపబడాలి అనగానే భూమి సృష్టింపబడెను."
"గాలి, నీరు సృష్టింపబడాలి అనగానే అవి సృష్టింపబడెను." ఇలా మొదలవుతుంది.
ఆయన అన్నంత మాత్రాన్నే అవి సృష్టింపబడి వుంటే ఎంతో మేధాశక్తితో, ఎంతో పరిశ్రమ చేసి మనిషి చేసిన సృష్టి దేవుడి సృష్టి కంటే విలక్షణమైనది కదా! మనిషే దేవుడి కంటే తెలివైనవాడు కదా అని అనుకొన్నాను.
ఈ భూమి ఎలా సృష్టింపబడిందో, ఈ గాలీ నీరూ, అసలుకు ఈ చలనం అన్నది ఎలా మొదలయ్యిందో తెలుసుకోలేని వాళ్ళు ఇలా మొదలెట్టారు ప్రజలను వంచించడం, తమకు నిజంగానే తెలిసినట్లు. తీరా తమకు తెలిసింది వాళ్ళకు కలలో కనిపించిన విషయమైనా అది నిజమేనని నమ్మించారు.
--ప్రసాద్
http://blog.charasala.com

అజ్ఞాత చెప్పారు...

కొన్ని మాటలు , అనవసరమయిన చర్చలు పక్కన పెట్టి - అంటే "భక్తుల నమ్మికే ఈ బాబాలకు కొండంత అండ. విత్తు ముందా, చెట్టు ముందా లాంటి చర్చలకు ముగింపు ఉండదు." లాంటివి పక్కన పెడితే - అసలు ఈ బాబాల వల్ల కానీ వారి శిష్యులుగా చలామణి అవుతున్న వారు కానీ, తమ చుట్టుపక్కల వాళ్ళకి, వారి వల్ల ఊర్లో జనాలకి కానీ, ఇతరంగా కానీ ఏ మాత్రం ఉపయోగం సిద్ధిస్తోంది అనేది పెద్ద ప్రశ్న. ఒక వేళ నిజంగా మంచి పనులు అంటే తమ సంస్థలకు ఉన్న ధనంలో నుంచి చెరువులు కట్టించటం లాంటివి, ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలు జరిపించే వాళ్ళని దేవుడు అని పిలవటంలో తప్పు లేదు. ఎందుకంటారా ? వాళ్ళు ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి. మనం ఈ ఒడ్డున కూర్చుని ఏ పని చెయ్యకుండా - ఎంతసేపు మనము , మన కుటుంబము అని ఆలొచిస్తూ అవతలి వారి మీద దిక్కుమాలిన మాటల బాణాలను వదలకుండా - నిజంగా ప్రజలకు ఉపయోగపడేవారిని, వారు చేసే పనులను హర్షించడం నేర్చుకున్నప్పుడు ఏ గొడవ ఉండదు.

ఈ బాబాలు అనేవారు కూడా మనుషులే, కాబట్టి తప్పులు చెయ్యటం కూడా సహజమే, కానీ వారి వల్ల సిద్ధించిన ప్రయోజనాన్ని బేరీజు వేసుకుని చూడండి. ఒకవేళ ఉపయోగం ఎక్కువ ఉందా, తప్పు గురించి మర్చిపోండి. వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకుంటారు. ఒక వేళ తెలుసుకోలెదా, తెలియచెప్పటం ప్రజల చేతిలో పనే.

పనికిమాలిన, అనవసరమయిన చర్చలు పక్క పెట్టి కొన్ని ఉపయోగపడే కార్యక్రమాలకి అందరూ పూనుకుంటే చాలా బాగుంటుంది అని నా భావన.

అజ్ఞాత చెప్పారు...

I really feel bad that my personal issue is being defined as Schziophrenia. How can anyone comment of one's personal experiences. Without sharing what I actually said, you just cannot say that 'She said she talks with Baba.' I confessed that it is not like normal talking with friends and people but it is something like my prayers are answered. I have given examples as well. If you people believe god or not, it is not my issue. I never asked anyone to believe god. Then why post such a disastrous comment on one's own, purely personal aspect of life.

This is completely in a very bad and poor taste. I am feeling bad for having shared my personal issues feeling someone as an elderly person.

Those who want to write something, write it in its entirety. Don't mention only half of it which gives a completely different meaning.

I request people to stop commenting on my personal beliefs.

-Prasanthi.

అజ్ఞాత చెప్పారు...

After reading this post, what prashanthi said might be right. I have observed some other posts also which are biassed and it's not right on some one, particularly this elderly person to butcher the trust of people who open up with strangers. See this is what happens. Sorry to express this way. But I am compelled to...

Reddy

cbrao చెప్పారు...

చర్చలు సిద్ధాంతాలకు పునాది. ఈ సిద్ధాంతాలు ప్రపంచ చరిత్ర గతినే మార్చి వేశాయి. కార్ల్ మార్క్స్ మార్కిస్మ్ కనిపెట్టక పోయి ఉంటే రష్యా, చైనా, హంగరి వగైరా దేశాల చరిత్ర మరోలా ఉండేది. ప్రపంచాన్ని ఈ దేశాలు ఎంత ప్రభావితం చేశాయో మీకు తెలుసుగదా.

ముమ్మిడివరం బాలయోగి ఒక తెలుగు సినిమా (యోగి వేమన?) చూసి ప్రభావితుడై సమాధిలోకి వెళ్లినట్లు చెప్తారు. మూగమనసులు సినిమా చూసి కొందరు ప్రేమికులు వచ్చే జన్మలో వారి ప్రేమ సాఫల్యం చెందుతుందని భావించి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం దినపత్రికలలో చదివాము.

మానవులను, ప్రపంచ దేశాలను ఇంతగా ప్రభావితం చేసే చర్చలు గురించి చిన్న చూపు తగదు.

మానవుడు నిరంతరాణ్వేషి, నిత్య పరిశోధకుడు, విహారి. మన పూర్వీకులు అసాధ్యమనుకున్న ఎన్నింటినో సుసాధ్యం చేశాయి నేటి శాస్త్ర పరిశోధనలు. ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలకు సమాధానం దొరకగలదనే ఆశాభావంతో ఉన్నారు మన శాస్త్రజ్ఞులు.

ఈ వ్యాసంలో పైన ఉన్న వ్యాఖ్యలు ప్రశాంతిగారికి అశాంతి కలిగించినందుకు చింతిస్తున్నా. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే ఇక్కడ ప్రశాంతి నిమిత్తమాత్రురాలు. చర్చ తన మీద కాదనీ, మానవుల విశ్వాసాలపైనని, బాబాలు, భక్తులపైననీ గమనిస్తే ఈ అపోహ నుంచి తను బయటపడగలరు. ప్రశాంతి స్నేహశీలి, దయార్ద హ్రుదయురాలనీ గతంలో పేర్కొనియున్నాను. గుడిలో దేవుడి కంటే మానవ సేవే మాధవ సేవ అని నమ్మే సుకుమార్, ప్రశాంతి గార్లలో దైవత్వాన్ని చూస్తాను.

spandana చెప్పారు...

నా వాదాన్ని నేను సమర్థిస్తూ రాశానే తప్ప వ్యక్తిగతంగా నేను ఎవ్వరినీ విమర్శించలేదని మనవి. రావు గారు కూడా పేరుతో వ్యక్తులని ఎత్తిచూపకుండా సిద్దాంతాన్నో, వాదాన్నో మాత్రమే ఖండిస్తే బాగుండేది. ఇక్కడ జరిగిన వాఖ్యానాల వాదాలు ఆధ్యాత్మిక X భౌతిక వాదాల పైనే గానీ వాటిని నమ్మిన వ్యక్తులపైన గాదని గమనించండి.
--ప్రసాద్
http://blog.charasala.com

అజ్ఞాత చెప్పారు...

బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు ఇక్కడ అధ్యాత్మికతను మూఢవిశ్వాసానికి లింకు ఎక్కడ చూసారు? మనకి తెలిసిన సైన్సు అణువంతే కాదనను, కానీ మనకు తెలిసిన దేవుడు కూడా అణువంతే కదా? మన జ్ఞానంతో తయారు చేసుకున్న సంస్కారం అతనికి (ఇక్కడ కూడా మగాడా?) నచ్చకపోతే "నిర్దాక్ష్యణ్యంగా" ఉపహరించబడుతుందా? చేయించేది అంతా దేవుడే అయితే మరలా నచ్చటం నచ్చకపోవటం ఏమిటి చీప్ గా. దేవుడే ఉంటే ఇక్కడ పేర్కున్న మానసిక వికారాలు (నిర్దాక్షిణ్యతో, కోపమో,శాపమో లేదా అష్ట వికారాలో) కలిగి ఉంటాడా/రా? కోడి కొయ్యక పొతే దేవత కోపగిస్తుందనుకునే మాస్ మెంటాలిటీ (మానవుడు తన మానసిక వికారాలను దేవుడికి కూడా ఆపాదించి సంతోషిస్తాడు) ఇది. దేవుడితోనే కాదు, ఎవరితోనైనా కనిపించనప్పుడు కూడా మాట్లాడుతుంటే అతి భక్తి పారవశ్యం (ఇది ఒక రకమైన మానసిక స్థితి..జబ్బు కాదు) అయినా అవ్వవచ్చు. లేదా నిజంగా జబ్బు కావచ్చు. ప్రస్తుతం ఉన్న బాబాలు కూడా కనికట్టు ద్వారా ఈ స్థితి కల్పిస్తున్నారు.శ్వేతనాగు అనే నవల ఈ స్థితిపైనే రాయబడింది. మనం దేవుని కంటే గొప్ప కాకపోవచ్చు, కానీ ఇప్పటి వరకూ సాధించిన అద్భుత శాస్త్ర విజ్ఞానానికి గర్వం అని పేరిచ్చే స్థితిలో మాత్రం లేము.శాస్త్రం నిజంపైన నిలబడి ఉంటుంది. దైవం నమ్మకం మీద నిలబడి ఉంటారు.ఇక్కడ నాకైతే ఏమి అసహ్యకరమైన పదాలు కనిపించలేదు. అలానే ప్రశాంతి గారి అనుభవంలో కూడా ఏమి తప్పులేదు. మన మనస్సు దేనిని గాఢంగా నమ్ముతుందో మన కళ్ళు దానినే చూపిస్తాయి. కళ్ళు పదేపదే నులిమి చూసినా అదే కనిపిస్తుంది. ఇది ఏమి జబ్బు కాదు..ఒక మానసిన స్థితి మాత్రమే.

Unknown చెప్పారు...

Accumulated English పదానికి కి తెలుగు పదం ఎమిటో చెబుతారా
నేను పేరుకున్న అని అంటాను ఒకరు పేర్కున్న అంటారు ఇంకొకరు పేర్కొన్న అని అంటారు. సరైన పదం ఎమిటో చెప్పగలరా

cbrao చెప్పారు...

పేరుకుపోయిన.

కామెంట్‌ను పోస్ట్ చేయండి