మంగళవారం, మే 03, 2011

ఆంధ్రప్రదేష్ రాజకీయాల్లో గౌతు లచ్చన్న

Sardar Goutu Lachanna

భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్, జయంతి ధర్మతేజ,  మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్ర్య  పోరాటాలలో పాల్గొని , అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు.  ప్రకాశం పంతులు మరియు బెజవాడ గొపాలరెడ్డి  మంత్రివర్గంలో, మంత్రి పదవి   నిర్వహించిన లచ్చన్న,మధ్యపాన నిషేధం విషయం లో, ప్రకాశం పంతులు తో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు.చిన్న రాష్ట్రాలు కావాలన్నాడు. తెలంగాణాకొరకు మర్రి చెన్నారెడ్డి తో చేతులు కలిపాడు. తెలంగాణా రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని  వివరిస్తూ పుస్తకం వ్రాశాడు.ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, వ్యతిరేకించి, స్వేచ్చ కోసం పోరాడాడు. చౌదరి చరణ్ సింగ్,జయప్రకాష్ నారాయణ, మసాని లతో పనిచేశాడు.

తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్రానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న.కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, ఆచార్య రంగా ప్రధమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా,రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న .

రైతు రంగా పిలుపునిచ్చె
రారోయి రైతన్నా
మనకు అండ లచ్చన్న వుండగా
మనకెందుకు భయమన్నా
అంటూ రైతులు పాడుతుంటే, శ్రీకాకుళము జిల్లా  బారువ గ్రామములో ప్రారంభమై, 1938 లోనే మందాసా నుండి మద్రాసువరకు రైతు కూలీ చైతన్య యాత్ర నడిపి చరిత్ర సృష్టించిన లచ్చన్నను రాజాజీ వీపుతట్టి శెభాష్ అన్నారు.లచ్చన్న డైరీలు రాసుకున్నందున   ఆయన జీవిత విశేషాలు గ్రంధస్థము చేయ సులువైంది. తొలి ఎన్నికలలో  తన జిల్లా నుండి కొన్ని నియోజక వర్గాలలో పార్టీ ని గెలిపించి, రంగా స్థాపించిన కృషికార్ లోక్ పార్టీ  పరువు నిలిపి,  రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించాడు. కమూనిస్టులు ప్రకాశం తో చేతులుకలిపి అధికారములోకి రావాలని చేసిన ప్రయత్నం లచ్చన్న భగ్నం చేయగలిగాడు.ఇది 1952 చారిత్రక ఘట్టం. తొలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించిన ప్రకాశం ప్రభుత్వాన్ని పడగొట్టి , గీత కార్మికులకొరకు పోరాడి గెలిచిన లచ్చన్న జీవితం గమనార్హం.

1962  ప్రాంతాల  లో,  లచ్చన్న ప్రతి పక్ష నాయకుడుగా స్వతంత్ర  పార్టీని   ఆంధ్ర ప్రదేష్ లో నడిపించాడు. రాజాజి ఉపన్యాసాలు తెలుగులో అనువదించి మెప్పు పొందిన లచ్చన్న, రంగా రాజకీయ పాఠశాలలో ఆరితేరాడు.బహుజన పత్రిక ద్వారా బడుగు జన సందెశాన్ని వినిపించడంలో కృత కృత్యుడయ్యాడు.శాసన సభలో అద్వితీయమైన పాత్ర నిర్వహించాడు. పేద,బడుగు, బలహీన వర్గాల  నాయకుడు  గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్ 19 న కన్ను మూశాడు. స్వాతంత్ర్య యోధుడు, రైతు, కార్మిక సంఘాల నాయకుడు    ఐన లచ్చన్న విగ్రహాలను, సోంపేట, బారువ, మందస, హరిపురం,జిల్లా కోర్టు జంక్షన్, విశాఖపట్నం ప్రాంతాల్లో,  5వ వర్ధంతి సందర్భంగా, ఆవిష్కరించారు.   

లచ్చన్న  జీవిత విశేషాలను, ఇన్నయ్య  గ్రంధస్థం చేసిన   ఈ చిన్ని పుస్తకం “ఆంధ్రప్రదేష్ రాజకీయాల్లో  గౌతు లచ్చన్న  -బారువాలో బాధ్యతారహిత  -బాల్యదశ నుండి” రాజకీయ శాస్త్ర విద్యార్థులకు, పాత్రికేయులకు, ఆంధ్రరాష్ట్ర రాజకీయ చరిత్ర తెలుసుకొనగోరే జిజ్ఞాసులకు ఉపయుక్తంగా ఉండగలదు.  ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవవొచ్చు లేదా దిగుమతి చేసుకోవచ్చు.

2 కామెంట్‌లు:

Rajendra Devarapalli చెప్పారు...

గౌతులచ్చన్న 1969ఆగష్టు 16 న పుట్టటంఏంటండీ?? చూడుము పుస్తకము మూడవపుట.

cbrao చెప్పారు...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: ముద్రారాక్షసానికి విచారం. అచ్చు తప్పులు లేక పోతే అది తెలుగు పుస్తకమే కాదు కదా! గౌతు లచ్చన్న 1909 ఆగష్టు 16 న పుట్టినట్లుగా చదవ కోరుతాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి