శనివారం, ఏప్రిల్ 11, 2009

చౌదరిగారికి సవాలు విసిరిన విశ్వనాధవారు

నేపధ్యం

శ్రీశ్రీ అభిప్రాయంలో భారతం వాస్తవం, రామయణం మిధ్య. రామాయణ కథ భారతంలో ఉంటే, భారతం Fact అయితే, రామాయణం Myth ఎలా అవుతుంది? శ్రీమద్ రామాయణ కల్పవృక్షము పాషాణ పాకమేనా? పాషాణాన్ని పగులకొడ్తే వజ్రాలు, మణులు రావా? ఇంతకీ చౌదరి గారి సవాలును విశ్వనాధవారు స్వీకరించి, పండితుల సభ పెట్టడానికి అంగీకరించారా? కొత్తగారి విమర్శలు చదవకుండా వాటికి విశ్వనాధ వారు ఎలా జవాబిచ్చారు? -cbrao

నాది పాషాణపాకమనే వారి బుద్ధిలోనే లోపముంది

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

(కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు విమర్శలకు సమాధానంగా అక్టోబరు 29వ తేదీ ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో వ్రాసిన వ్యాసం)

శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరిగారు నేను ఆంధ్ర మహాసభ చెన్నపురిలో చేసిన ఉపన్యాసమునకు బదులుగా అక్టోబరు 22 ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ఒక సమాధానం వ్రాశారు. ఎవరో తీసుకొని వచ్చి చూపించారు. నా ఆవేదన, శ్రీ జలగం సుబ్రహ్మణ్యం నాయుడుగారు చెప్పిన మాటలు, శ్రీశ్రీ అన్న పాషాణపాకం ఇవన్నీ ఇట్లా ఉంచుదాం. నేను ‘గాడ్సేకులం’ వాణ్ణి. ఆయన ‘గాంధీకులం’ వాడు. అది కూడా అట్లా ఉంచుదాం. ‘ధర్మచింత’,

‘పాపభీతి’ ఉగ్గుపాలతో పెట్టిన జాతి వారిది. నేను ఆ సభలో త్రికరణ శుద్ధిగా వర్ణాది భేదాలు లేవన్నది వారు నా రామాయణం ప్రకారం ఋజువు చేస్తారట. వారికే ‘ధర్మచింత’, ‘పాపభీతి’ ఉన్నవని వ్రాస్తున్నారు. నేను సభలో అన్న, నాకు వర్ణ ద్వేషం లేకపోవడం అబద్ధం! వీరు ధర్మచింత మొదలైనవి తమకు కలవని వ్రాయడం నిజం! అవి రెండూ వారికి ఉండడానికి వీలులేదని వారి విమర్శ వ్యాసాలే సాక్ష్యం. ఇందులో ఒక భేదం ఉన్నది. వ్యక్తిగతంగా నాకు ఆ గుణాలు లేవన్నాను. ఆ ధర్మబుద్ధి, పాపభీతి వారి జాతి గుణాలు అని చెబుతున్నా డాయన. నన్ను గురించి నేను చెప్పుకోవచ్చు. తన జాతిని గురించి తాను పూచీ పడడం కష్టం. వారి జాతి యేమిటి? భారతీయ జాతియా? ఆంధ్రజాతియా? ఒక జాతికి ప్రధానమైన లక్షణాలు కొన్ని ఉంటవి. జాతి మొత్తము మీద ఆ లక్షణాలు చెప్పవచ్చు తప్ప, జాతిలో పుట్టిన ప్రతివాడికీ ఆ లక్షణాలు ఉండవనడం చాలా కష్టం.

ఇవట్లా ఉంచి, శ్రీ శ్రీ నా కవిత్వాన్ని పాషాణ పాకమన్నాడు. నేను సమాధానం చెప్పలేదని ఆక్షేపణ. శ్రీశ్రీకి ఎందుకు సమాధానం చెప్పలేదో మనవి చేస్తాను. శ్రీశ్రీ ఆ సభలో దిగాలుపడి కూర్చోవలసి వచ్చింది. నేను సమాధానం కూడా చెబుతే ఆయన ఇంకా దిగజారిపోతాడని చెప్పలేదు. శ్రీశ్రీని నేను నలుబది యేండ్ల నుండి యెరుగుదును. ఆయన అంటే నాకొక విధమైన ప్రేమ ఉన్నది. ఓ చౌదరిగారూ! నేను వ్రాస్తే మీరంగీకరించరు. ఒప్పుకోరు. లౌక్యం కోసం వ్రాస్తున్నానని అనుకున్నా అనుకోవచ్చు. యదార్థంగా మీరన్నా కూడా నాకొక విధమైన అనురాగంవంటి భావం ఉన్నది. ముప్ఫై యేళ్ళ క్రిందట – ఇంకా ఎక్కువ ఏండ్ల క్రిందనో మీరూ, నేనూ, శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారూ కలిసికొన్నాము. ఆనాడు చాలా స్నేహంగా మాట్లాడాము. తరువాత మనము కలిసికొన్నదీ తక్కువే. స్నేహంగా మాట్లాడు కొన్నదీ తక్కువే. మిమ్మల్ని గురించి నాటినుండి నేటివరకూ, ఆ అర్ద్రమైన ప్రభావమే ఉన్నది. అలా అందరికీ ఉంటుంది లోకంలో. అలాగ, మీరు ఇవ్వాళ విమర్శ వ్రాస్తే మీమీద నాకు కోపం రానట్లే, శ్రీ శ్రీ పాపాణం పాకం అన్నా కోపం రాలేదు. సాగదీస్తే శ్రీ శ్రీ కాదు, ఆరు శ్రీలున్నా నిలువడు.

ఆ రోజున శ్రీశ్రీ ఎందుకు దిగాలుపడి ఉన్నాడంటే చెబుతాను. ఆ సన్నివేశం ఆంధ్ర పత్రికా విలేఖరి వ్రాయలేదు. వెయ్యలేదు. అది ఇది. శ్రీ శ్రీ “భారతం (Fact) రామాయణ (Myth)” అన్నాడు. “వాల్మీకులు చాలామంది ఉన్నారు. వాళ్లందరూ వాల్మీకులుకారు. విశ్వనాథ ఒక్కడే వాల్మీకి” అన్నాడు. ఈ సందర్భంలో శ్రీ జలగం సుబ్రహ్మణ్యంనాయుడుగారు – ఆయన సంస్కృతాంధ్రాలలో చక్కని పరిచయం కలవారు సుమండీ. చాలా గడుసువారు కూడాను – ఆయన శ్రీశ్రీని నిగ్గదీశారు. “ఏమండీ! భారతం (Fact) ఏ కదా! రామాయణం (Myth) ఏ కదా? భారతాన్ని ఒప్పుకుంటారు కదా” రామాయణం (Myth) ఏ కదా? ఇల్లా నాలుగుసార్లు శ్రీశ్రీ మాట అనిపించి, సభవంక చూచి, “ఏమండీ! వింటున్నారుకదా!” అని మళ్ళీ శ్రీశ్రీ చేత ఒప్పించి, “అయ్యా! భారతము (Fact) ఐతే భారతంలో రామాయణ కథ చెప్పబడి ఉన్నది. రామాయణం (Myth) అవడం ఎలాగా? భారతంలో ఉన్నదంతా (Fact) అని మీరే అన్నారు కదా! అని బాంబు పేల్చారు. శ్రీశ్రీ డీలాపోయినాడు. తెల్లమొహం వేశాడు. “అయినా (Myth) ఏ” అన్నాడు. నాయుడుగారు “మళ్ళీ అలా మాట్లాడుతారేం?” అన్నాడు.

నాకు స్నేహితుడైన శ్రీశ్రీ సభలో అట్లా కాక వారి పాషాణపాకం అన్నాడని సమాధానం చెప్పి, ఇంకా దిగులుపర్చమంటారా? నాది పాషాణపాకమన్నవాడి ఆంధ్ర సారస్వత విజ్ఞానం పాషాణ ప్రాయమంతే! అని నే ననడం బాగుండదుకదా! ఈ అహంకారాన్ని చూచి ఇతరులు వ్రాసే వ్రాతలు, వాళ్లు మాట్లాడే మాటలు – వాటిపేరు “ధర్మచింత – పాపభీతి” ఎబ్బే.. వారి కనులు అహంకారమేలేదు. అయ్యో బాబూ! అనవసరమైన అహంకారాన్ని మనం చంపుకోలేమే. మాత్సర్యాదులవల్ల పుట్టిన అహంకారాన్ని మనం చంపుకోలేమే? ఎవరో ఒక పనిచేసి, అది గొప్ప పని అనుకుని – చాలామంది గొప్పపని అనడం మూలంగా కూడా, అనుకున్నాడేమో పాపం - వాడు నేను చేసిన పనిలోని గొప్పతనం ఇది ఇదీ అని ఇతరులకు చెబుతే అది గొప్పతనం కాకపోతే కాదను. అంతేకానీ, అది వారి అహంకారమనడమేలా? వారు చెప్పిన గొప్పతనం కాకపోతే వాడు వృద్ధుడు. అహంకారమైనా గొప్పదనమేగా? ఒకడు తన గొప్పతనాన్ని గురించి అహంకార పడడం చూచి అవతలివాడు పడేదానికి పడేదానికి పేరేమిటి? పెద్దలకు తెలియాలి.

మీరు చాలా నెలలబట్టి ఈ వ్యాసాలు వ్రాస్తున్నారు. నే నా ఒక్కవ్యాసం కూడా చదువలేదు. నాకు వర్ణ శాఖాది ద్వేషాలు లేవంటే నమ్మనివారు, ఈ విషయాన్ని నమ్ముతారని నే ననుకోవడం లేదు. నా పాకం పాషాణపాకం అన్న శ్రీశ్రీని అట్లాంటి మరికొందరితో కలిసి అడుగుతున్నాను. అయ్యా! నా గ్రంథాల్ని తమరు ఏవేవి చదివారు? మీరు చదివిన ఒక గ్రంథంలో ఎన్ని పద్యాలు ఉన్నవి? మీకు అర్థంకాకపోవడమేకాదా, పాషాణ పాకమంటే? అందులోవన్నీ అర్థం కాలేదా? కొన్నేకాలేదా? అర్థం ఐనవెక్కువా? కానినెక్కువా? పాషాణపాకమంటే అర్థమేమిటి? పగులగొట్టడానికి వీలులేదనియేకదా? మణులు ఉన్నవి. వజ్రాలు ఉన్నవి. వెలగల రాళ్ళు ఉన్నవి. అవి కాంతిని విరజిమ్ముతూ ఉంటవి. వాటి కాంతిని చూచి ఆనందించాలి తప్ప పగులకొట్టడు. పగులకొట్టి చిన్న చిన్న రాళ్ళుగా వర్తకులమ్ముతారు. ఆ పగులగొట్టే నేర్పు వాళ్లకు తెలుసు. అలాగే మీరన్నట్లు నేను వ్రాసిన వందపద్యాల్లో రెండు మూడు పద్యాలు మీకు పాషాణపాకమనిపిస్తే, వాటి కాంతి మీకు తెలిస్తే ఆనందించండి. తక్కినవి మీ ద్రాక్షాపాకలే, మీ కదళీ పాకాలే వందలాది పద్యాలుంటవి. అవి చూచి ఆనందించండి. మేము మీ గ్రంథాన్ని తిట్టడానికే పుట్టాము. మేము చదువము అని మీరంటే మీకు నమస్కారము.

ఎవరో కొందరు మాత్పర్యగ్రస్తులు ఒక మాటను దేశంమీద పారవేయడం “గతానుగతికోలోక: వలోక: పారమార్థిక:” అన్నట్లుగా తక్కినవాళ్లు దాన్ని పట్టుకొని ప్రాకులాడడం అలవాటైంది. నేను రామాయణంకాని, ఇతర కవిత్వంకాని వందలాది సభల్లో చదివాను. విన్నవాళ్ల్లెవరూ పాషాణపాకమనలేదు. అనలేదు సరికదా ఆనందించారు. ఈ పాషాణపాకం, అనేవాడి బుద్ధిలో ఉంది. హృదయంలో ఉంది. నేను ఆవేదన పొందానని అనుకోవడం శ్రీ జలగం సుబ్రహ్మణ్యం నాయుడుగారు పొరపాటు పడ్డారు. నేను నా జాతి లక్షణం చెప్పుకోలేను కాని, నా వ్యక్తి లక్షణం ఏమంటే “గాఢంగా నేను నా చేత నైనంతలో వూహించడం, త్రికరణ శుద్ధిగా మాట్లాడటం” త్రికరణ శుద్ధిగా మాట్లాడుతుంటే చాలామంది ఆవేదనే అనుకుంటారు. నేను ఆవేదనపడితే శ్రీ చౌదరిగారి విమర్శలకు ఆ విమర్శలు చేసే పత్రికలు, వేయకపోయినా, ఇతర పత్రికలలో సమాధానాలు ఇంతకంటే శరపరంపరలుగా వ్రాసేవాణ్ణి.

వ్రాయడం – మాట్లాడడం రెండు విధాలు. వ్రాయడంలో ఆవేదన ఉన్నదో లేదో తెలుసుకోవడం కష్టం. మాట్లాడడంలోనూ తెలుసుకోవడం కష్టం కానీ, ఇందాక మనవి చేశాను కదూ – వాడు ఆవేదన పడ్డాడాని అనుకోవచ్చు. ధర్మం చెప్పేవాడి మాట ఆవేశంతో చెప్పినట్లు ఉంటుంది. ఆ ఆవేశం ఆవేశమౌనో కాదో మరుక్షణమందు తెలుస్తుంది. అది నిజంగా ఆవేశమైతే తరువాత చాలా సేపు ఉంటుంది. మరుక్షణమందు ఉండని ఆవేశము ధర్మం చెప్పడంలో ఉన్న తీవ్రతకాని ఆవేశం కాదు. ఆ శ్రీ శ్రీ వ్రాసింది పాషాణపాకం. అనగా పగులగొట్టితే ఏమి ఉండదో, అది పాపాణపాకం. నా కవిత్వం పాషాణ పాకమన్నది ఎవడో ఒక టెంకాయ పిచ్చికొండ. కాలం దానికి యోగ్యం కనుక బాగా ఉన్నదన్నమాట.

అదంతా అట్లా ఉంచి శ్రీ చౌదరిగారూ! పండితుల్ని పిలువడం, సభ చేయించడం చాలా పెద్ద ఎత్తు ఎత్తారు! ఇలా పూర్వం శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు వ్రాస్తుండేవారు. ఆ రాశిలో చేరుదామనా? ఈ కల్పవృక్షం మీద విమర్శతో ఒక రాశిలోనికి వచ్చారనుకోండి. పై రాశికి వెళ్ళడం కూడా మంచిదే. అయ్యా “చీద్గగన ప్రాలేయాంశువున్” అని ఉన్నది. ఇక్కడ ‘న’ కారం గురువవుతుందని మీరు వ్రాశారు. అది తప్పని, ఇటువంటివి ఇంకా పాతిక కూడా చూపించారట. తక్కినవన్నీ అట్లా ఉంచి, ఈ నకారం గురువవుతుందా... గురువవుతుంది. ఇది తప్పేను అని మీ యిష్టము వచ్చిన పదిమంది పండితులతో దస్కతులు చేయించి పత్రికలలో వేయించండి. ఆ పదిమంది పండితుల పేర్లు దేశానికి తెలుస్తవికదా! రంగయ్య, పుల్లయ్య పేర్లు పెట్టి వ్రాయించకండి.

అప్పయ్య దీక్షితులు, జగన్నాధ పండితుల వాదం మీరు తెచ్చారు. ఆ ప్రసక్తి ఎందుకు? నక్క ఎక్కడ, దేవలోక మెక్కడ? అముద్రిత గ్రంథ చింతామణి పేరు ఎత్తారు. ఆ విమర్శకీ, మనకూ కొన్ని మైళ్ళ దూరం ఉంది. పెద్ద పేర్లు చెప్పడమెందుకు వూరుకోండి. తక్కినవి చెప్పారు. కొంత బాగా ఉంటే బాగా ఉండవచ్చు. ఇందులో శ్రీ గిడుగు రామమూర్తిగారి పేరు కూడా ఎత్తారు. ఓ అయ్యా! రామమూర్తి పంతులుగారు వ్రాసిన వ్రాతలు కూడా చదివారా యేమి మీరు? అందుకనేనా “చేతురు, కోతురు,” తప్పన్నారట! గడచిన నలుబది యేండ్లుగా ఆంధ్ర భాషా పత్రికలలో జరిగేటటువంటి శబ్ద స్వరూపముల యొక్కయు, అర్థముల యొక్కయు విచారణ లక్షణము మీకు తెలియదని, మీరు చూపించిన దోషాలు మా మిత్రులు చెప్పగా విని నే ననుకొన్నాను. రెండే పద్ధతులు. మీకివన్నీ తప్పులు కావని తెలిస్తేనే వ్రాయాలి. అలా వ్రాస్తే మీకు ధర్మచింతలేదు. పాపభీతి లేదు. తెలియకుండా వ్రాస్తే దాని పేరు పాండిత్యం లేక పోవడం. అదట్లా ఉంచి, మీ ఇష్టం వచ్చిన పండితుల్ని నలుగుర్ని పిలవండి. వారు ప్రసిద్ధులైన పండితులు కావలె సుమండీ. “చీద్గగన ప్రాలేయాంశువున్” తప్పనే పండితులు కాకూడదు. అటువంటి పండితులను మీరు తీసుకవస్తే నేను సభకు రాను. ఇప్పటికివలెనే అప్పుడు కూడా దూరం నుంచే నమస్కారం చేస్తాను. నేను పండితుల్ని తీసుకరాను. పుస్తకాల్ని తీసుక వస్తాను. మీరు తప్పన్నవాటికి ప్రయోగాలు చూపిస్తాను. “భూమిపుండు” ఇందులో అశ్లీలమని వ్రాసినారట. మీరు నలుబది యేండ్లనుండి జరుగుతున్న పత్రికలలోని సారస్వత విమర్శలు చక్కగా అనుసరించామన్నట్లు వ్రాశారే. శ్రీ తిరుపతి వేంకట కవులలో ఇలాంటి అశ్లీలాలున్నవని వారి ప్రతి పక్షులు వ్రాయడం వారు సమాధానాలు వ్రాయడం చదివేవుంటారుకదా? ఇలాంటి అశ్లీలం వ్రాయనివాడుంటాడా? అంతదాకా ఎందుకు? తమరు కూడా ఏదో పుస్తకాలు వ్రాశారని వినికిడి, మీరు ఏవి దోషాలన్నారో అవి మీ గ్రంథాల్లోనే చూపించవచ్చు. మీ సవాలు అట్లా వుంచి ఇది నా సవాలు. ఆ సభ పెట్టించండి. మీ పటం పెట్టి మీ నెత్తినే పొడుచుకున్నట్లవుతుంది. నాకేమీ అభ్యంతరం లేదు.

నేనొక మాట వ్రాస్తున్నాను. వ్రాయబోయేమాటకు నేకు సభకు రానని మాత్రం అర్థం చేసుకోకండి. ఆ సభలో కొంచెం పోలీసు బందోబస్తుతో రావాల్సిన అవసరం నాకు లేకుండా చేయండి. ఇంతదూరం వచ్చింది కనుక మీరు వ్రాసిన వ్యాసాలు తీరికలేక పోయినా, చదువుతాను. మీరు చూపించిన తప్పులు తప్పులు కావని సప్రమాణంగా నిరూపిస్తాను. కాని నా పుస్తకంలో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. వాటిని నేనంగీకరిస్తాను. “రాఘవేశ్వరు గృహముల్” యతి భంగమున్నదని మీరు చూపించారట. నిజమే ఉన్నది. రతీదేవి తప్పన్నారట. అది తప్పనడంలో కూడ కొంత న్యాయమున్నది. బాగా పరిశీలించలేనివాడికి తప్పనిపించవచ్చు. కాని వాచస్పత్యంలో ఈకారాంత స్త్రీలింగం కూడా ఉదహరించబడింది. అయినా ఇవన్నీ సభలో చెప్పవలసిన సమాధానాలు కదా! ఈ రెండైనా ఇప్పుడెందుకు వ్రాస్తున్నానంటే ఆ సభ పెట్టేదీలేదు. జరిగేదీ లేదు. మీరు పిలిచేదీలేదు. వారు వచ్చేదీలేదు. బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు తమ ప్రత్యర్థులకు ఇటువంటి సవాళ్లు నాలుగైదుసార్లు చేశారు. ఇప్పుడు వారి స్థానంలో నేనున్నాను. వారి ప్రత్యర్థుల స్థానంలో మీరున్నారు. ప్రత్యర్థి స్థానీయులైన తమరు ఈ సవాలు చేయడం క్రొత్త తప్ప వేరే క్రొత్త లేదు. అసలు మీ ఇంటి పేరే క్రొత్తాయె. ఇంతకూ మీ బలమేమంటే ప్రజాస్వామ్యం కావడం. ఇంకా ఉన్నవనుకోండి కొన్ని, అలా ఉంచండి. ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్పాలి. మన దేశంలో చాలామంది పత్రికాధిపతులకు విశ్వనాథ సత్యనారాయణమీద విమర్శ ఏదైనా సరే అచ్చు వేద్దామన్న ఉత్సాహమో, ఉబలాటమో, మాత్సర్యమో లాభచింతో ఉండడం. విశ్వనాథ సత్యనారాయణను ఎవడైనా మెచ్చుకుంటే, దాని పేరు చెక్క భజనలట. తిడితే వారికి బాగుంటుంది. పోనీయండి నష్టమేమి? శ్రీ చౌదరిగారూ! శ్రీ శ్రీ అన్నట్లుగా నా కవిత్వము పాషాణపాకమనీ నేను కూడా అనుకున్నానేమోకాని, వందలాది సభల్లో నేను చదివితే ఆనందించేవాళ్ళని చూచి నేను అనుకోలేకుండా ఉన్నాను. మీరు వ్రాసిన కొన్ని దోషాలనుకున్నా, ఇదే బాధ వచ్చింది. కొంతమంది పండితులు విన్నారు. మా యింటికి వచ్చి విన్నారు. కొందరి ఇండ్లకు వెళ్లి వినిపించాను. సభలలో శ్రద్ధగా కూర్చుని విన్నారు. వారు తప్పనలేదు. అందుచేత తప్పులు కావని ఒక అభిప్రాయం నాకేర్పడ్డదేమో!

ఈ గోలంతా ఎందుకు? “చీద్గగన ప్రాలేయాంశువున్” లో నకారం గురువవుతుంది. ఇది తప్పేను అది! నేను నలుగురి పేర్లు చెబుతాను. ఆ నలుగురిచేత దస్కతులు చేయించి వారి ఉత్తరాలు “భారతి’ పత్రికాధిపతి చేతిలో పెట్టి అని ప్రకటించవలసినదని ప్రార్థన. శ్రీ తుమ్మల సీతారామమూర్తిచౌదరిగారు, శ్రీ వేటూరి శివరామశాస్త్రిగారు, శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు ఈ పాయాలో ఉన్న మీ ఇష్టం వచ్చిన మరో పండితుడు. ఈపని మీరు చేస్తే అయినా సరే, కాకపోయినా సరే మీరు చూపించినవన్నీ తప్పనుకుంటాను. ఇంకొక్కటే మనవి. మీరు వ్రాసిన వ్యాసాలకు తిరిగి సమాధానాలు వ్రాస్తే మీ విమర్శలు ప్రకటించే పత్రికాధిపతులతో మా సమాధానాలు ప్రకటించేదిగా సిఫార్సు చేసి పెట్టండి. మీరు దీనికి కూడా యథేచ్ఛగా మళ్లీ వ్రాస్తే “నమోవాకం వ్రశాన్మహే” “మాటకి మాట తెగలు, నీటికి నాచు తెగులు” మీరు ప్రధానంగా చేయవలసింది. “చిద్గగనాంతమందు” గురువుని చూపించడం. మీరు ధర్మచింత, పాపభీతి కలవారు కనుక గురు దర్ళనం మీకు తప్పకుండా జరుగుతుంది. లఘుదర్శనం కలుగుతుందా? అబ్బే! ఇలాంటి వ్యాసాలు మీరు వ్రాసినా, నేను వ్రాసినా ఇట్లాగే ఉంటవి. మీరు ఆ పండితుల ఉత్తరాలు ప్రకటించిన తరువాత మీరు దోషాలన్నవాటికి మాత్రమే సమాధానాలు వ్రాస్తాను. ఇంక ఒక అక్షరం వ్రాయను.

అందుచేత ఇప్పుడింకొక మాట కూడా చెబుతున్నాను. నా రామాయణం నిలువదేమోనన్న భయం మీకెందుకు? నిలువదు. ఏం నిలువకపోతే? మీరు కవుల జీవితాలు చదివే వుంటారు. ఒక్కొక్కరు పాతిక గ్రంథాలు వ్రాస్తే వాడిని రెండు మూడు గ్రంథాలే నిలువడం చదువుతూనే ఉన్నాంగా, రామాయణం నిలువకపోతుందనుకోండి. వేయి పడగలు నిలుస్తుంది. అది మత గ్రంథం కదూ! ఆ మతానుయాయులతో నిలుస్తుంది. తమవంటి వారి విమర్శలవలె మతానుయాయులతో నిలువవచ్చు.

ఒకటే చివరి మాట. వ్రాసిందే చివరకు గట్టిగా చెబుతున్నాను. ఆక్షేపణలు, ఎత్తిపొడుపులు, గడుసుతనం మాటలు మీరు వ్రాయవద్దు. నేనూ వ్రాయవద్దు. మీరు వ్రాసినా మళ్లీ నేను వ్రాయనని మనవి చేస్తున్నాను. ఆ నలుగురు పండితులచేత పూర్వ నకారగురత్వం నిరూపించండి. అప్పుడే వ్రాస్తా. లేకపోతే ఇన్ని నెలలుకాదు సంవత్సరాలైనా వూరుకుంటా.

3 కామెంట్‌లు:

సూర్యుడు చెప్పారు...

బాగుంది. పండితులకి వారు వ్రాసిన వాటిల్లో ఎవరైనా తప్పు కనిపెడితే ఎంత బాధగా ఉంటుందో అర్ధమవుతోంది.

సాఫ్ట్‌వేర్ లో కూడా, ఆర్కిటెక్ట్ చేసిన డిసైన్ లో ఎవరైనా తప్పు కనిపెడితే ఇంటే బాధ ఉంటుందేమో(?) :-) అయినా, నో ప్రోడక్ట్ ఈస్ బగ్ ఫ్రీ అని ఒక డిస్క్లైమర్ తో కొట్టి పడేయొచ్చు ;)

కాలనేమి చెప్పారు...

And your tryst with viswanatha continues...

అజ్ఞాత చెప్పారు...

May I know why you are so interested about Viswanatha? Is there any specific reason posting Viswanatha tapaas?

కామెంట్‌ను పోస్ట్ చేయండి