మంగళవారం, జనవరి 27, 2009

కవి సామ్రాట్టు....!



Chalasani Prasada Rao Painting by R.K.Laxman

నేపధ్యం:శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిపై ఇన్నయ్య గారి వ్యాసానికి అనూహ్య స్పందన లభించింది. లభిస్తున్నది. పాఠకులని విస్మయానికి గురిచేసిందా వ్యాసం. వారిలో ఎన్నో సందేహాలు పొడసూపినవి. పాఠకుల ఉత్తరాలకు ఒక్కటొక్కటిగా జవాబిస్తున్నాను. అయినా జవాబివ్వని ఉత్తరాలింకా చాలా ఉన్నవి. ప్రతి ఒక్కరికీ జవాబివ్వటం సులభ సాధ్యం కాదు. మిత్రులు కీ.శే.చలసాని ప్రసాద రావు (విపుల, చతుర మాస పత్రికల సంపాదకులు)వ్రాసిన "ఇలా మిగిలేం" అనే విమర్శనాత్మక వ్యాసాల పుస్తకం గురించి గతంలో దీప్తిధారలోని ఇలాకూడా జరగొచ్చు అనే టపాలో ప్రస్తావించియున్నాను.విశ్వనాధ వారి భావాలను, వారు తలకెత్తుకొన్న హైందవ సాంప్రదాయ పునరుద్ధరణాలోచనలపై సమీక్షలు,పాఠకులకు వాటిగురించిన అవగాహనకు తోడ్పడగలవు. ఈ ప్రయత్నంలో భాగంగా విశ్వనాధ వారి రచనలు,వారు వెలిబుచ్చిన భావాల పై చలసాని ప్రసాదరావు గారి అభిప్రాయాలను, వారి కబుర్ల శీర్షికలో వెలువడిన వ్యాసాన్ని, "ఇలా మిగిలేం" పుస్తకం నుంచి, మీ కోసం ప్రచురిస్తున్నాను. ఈ వ్యాస రచనా కాలం 1971.
-cbrao

కవి సామ్రాట్టు....!

"నూటికి తొంభయ్యయిదుగురు దరిద్రంలో మునిగిఉండే సమాజంలో వాళ్లకేవేనా దూరపుకొండలూ, వాటి మీద టెక్నికలర్ ఆశల పుష్పాలూ చూపించకపోతే వారిని ఆపటం కష్టం. కనుకనే, రేసులు, లాటరీల్లాంటివి పుట్టుకొచ్చి, తెల్లారేసరికెవరైనా సరే లక్షాధికారులు కాదగ్గ సోషలిజానికి దగ్గరి జాక్ పాట్ దారులు వేశారు.

మనకు బుర్రంటూ ఒకటున్నాక దానికి కాస్త కాలక్షేపం, వినోదం, ఉల్లాసం కలిగించటానికి నట, విట, గాయక, రచయితల్లో ఓ విదూషక బృందం కూడా తప్పనిసరి. మరి ఈ దరిద్రులక్కూడా ఏవేనా కలర్ ఆశలు చూపకుంటే ఎలా?

అందుకే ఏటేటా ఈ నిర్భాగ్యులకు నూట పదహార్లూ, వేయిన్నూట పదహార్లూ ఉదారంగా ముష్టి వేసే సాహిత్య కంపెనీలు కొన్ని బయలుదేరాయి. దాంతో ఈ అభాగ్యులు ఆ కంపెనీలచుట్టూ తిరుగుతూ, ఆయా బహుమతులు కోసం చేయవలసిన చెక్క భజనచేస్తూ, పట్టవలసిన వాళ్ల కాళ్లు పడుతూ, లేస్తూ, యధాశక్తి తమ కష్టాలు మరచి సాహిత్య సేవ చేస్తుంటారు.

కానీ, అసలే మన సోషలిస్టు రూపాయి డివాల్యుయేశన్ తో సగం చచ్చిన సంగతి అలా ఉండగా, ఈ లాటరీలూ, రేసులూ విజృంభించి పదార్లకూ, వేయిన్నూటపదార్లకూ విలువ లేకుండా చేశాయి. కనుక, సాహిత్యంలో కూడా "జాక్ పాట్" లు లేకుంటే లాభం లేదని కొందరు ఉదారులు లక్ష రూపాయల జాక్ పాట్ తో "జ్ఞానపీట" నోదాన్ని సృష్టించేరు, శుభం.

జ్ఞానపీఠం వారి లక్ష రూపాయల సాహిత్య జాక్ పాట్ ఈసారి మన కవిసామ్రాట్టు, కళా ప్రపూర్ణ, సాహిత్య డాక్టర్ విశ్వనాధ సత్యనారాయణ గారికి రావటం మనందరికీ గర్వకారణం. ఈ సారి మనం ఏ ఢిల్లీయో, కలకత్తాయో వెళ్లినప్పుడు, అక్కడ సగర్వంగా పిలక ఎత్తుకొని చెప్పుకోవచ్చు, మన తెలుగూ సాహిత్య ఘనతను గురించి. ఇంతవరకూ మరో అయిదుగురు మాత్రమే సాధించ గలిగిన ఈ జాక్ పాట్ ను కొట్టగలిగిన విశ్వనాధ వారి "రామాయణ కల్పవృక్షం" చదవటం సంగతలా ఉంచి, కనీసం మరోసారి చూసి, ఈ సారి కళ్లకద్దుకునైనా తరిద్దామని తహతహలాడి పోయాను.

ముందు తరాల విమర్శకులు విశ్వనాథ వారిని గొప్పకవిగా గాక పెద్ద నవలా రచయితగా గుర్తిస్తారు. ఆయన నవలలన్నింట్లోకి "రామాయణ కల్పవృక్షం" చాలా గొప్పదంటారు" అని, దివ్వదృష్టిగల ఓ మహాకవిగారు ఏనాడో సెలవిచ్చారు.

కనుక, నేనో పుస్తకాల దుకాణానికి పోయి 'ఫలానా నవల కావాలండీ' అంటే, అక్కడి సాహిత్య విక్రయకుడు నన్నెగాదిగా చూసి "ఆ పేరుతో నవలేదీ లేదు నాయనా! ఛందో బందోబస్తులతో పకడ్బందీగా అల్లిన విశ్వనాధ వారి కావ్యం మాత్రం ఉంద"న్నాడు.

నాకు సంస్కృతం అంతగా రాకున్నా సంస్కృత రామాయణం చదివి, అర్థం చేసుకుని, ఆనందించగలిగాను. కానీ, తెలుగు బాగా వచ్చి ఉండికూడా విశ్వనాధ వారి తెలుగు "రామాయణ కల్పవృక్షం" మాత్రం చదవలేకపోయాను. వారిది పాషాణ పాకం అని ఏనాడో శ్రీ శ్రీ అన్న మాటలు గుర్తొచ్చి, ఆ షాపు వాడికీ, వాడి అటక మీది సదరు జాక్ పాట్ గైడ్ కూ ఓ దండం పెట్టి వచ్చేశాను.

విశ్వనాథ వారు కారణ జన్ములు. మన తెలుగు సాహిత్యాన్నీ, ప్రాచీన హిందూ మత ప్రాభవాన్నీ ఉద్దరించేందుకే శ్రీవారు పుట్టారనటంలో సందేహం ఉన్నవారికి ఈ జన్మలో జాక్ పాట్ సంగతలా ఉంచి కనీసం లాటరీలో కన్సోలేషన్ ప్రై జయినా రాకపోగా సరాసరి నరకానికే పోతారు. ఆయనే స్వయంగా ఓసారి చెప్పుకున్నారట "నా అంతటి వాడు మరో వెయ్యేళ్ల దాకా పుట్టబోడు" అని మరెవరో అన్నారట గదా "నిజమే మహా ప్రభో! తమరు వెయ్యేళ్ల క్రితమే పుట్టేరు. ఇపుడు మమ్మల్ని అవస్త పెడుతున్నారు" అని.ఏది ఏమైనా మరో వెయ్యేళ్ల తర్వాత కూడా విశ్వనాథ వారి వంటి మహానుభావుడు పుట్టబోడనేది మాత్రం నిస్సందియమే.

విశ్వనాథ వారికి వ్యాకరణ, ఛంధో, అలంకారాది శాస్త్రాల్లో నూటికి సదా నూటొకటిన్నర మార్కులు వచ్చేవిట. అదీ వారి దర్జా! వారి వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్షం, హాహా... హిహీ... హుహూ, లాంటి మహద్గ్రంధాల్లోని మన మట్టి బుర్రలకు అర్థం గాని గొప్పల్నీ, ఉన్న – లేని అందాల్నీ కీర్తిస్తూ శ్రీవారి భక్త కోటి అసంఖ్యాకంగా వ్యాసాలు రాసి, సాహిత్య పత్రికల పేజీల్ని ఈ వరకే నింపివేశారు. ఇపుడు మనం అదనంగా పరిశోధించి పట్టుకునేందుకు ఏమీ లేదు.

"పురాణ వైర గ్రంధమాల" అంటూ విశ్వనాథ వారీ మధ్య ఓ అరబీరువాడు నవలల్ని లైబ్రరీల మీదికి వదిలేరు. అంత వేగంగా అన్ని నవలల్ని రాయగలగటం నిస్సందేహంగా గొప్ప సంగతే. "మన చరిత్రకారులు చరిత్రను సరిగా రాయలేదనీ, రాసిందంతా తప్పుల కుప్ప అనీ విశ్వనాధ వారు తమకు మాత్రం దైవానుగ్రహంతో లభ్యమైన దివ్య దృష్టి వల్ల కనుగొన్నారు. కనుక సదరు చరిత్రల్లోని తప్పులన్నింటినీ తిరుపతి వెళ్ళొచ్చిన గుండులా స్వచ్ఛంగా సవరించి బ్రహ్మణాధిక్యతనూ, బ్రాహ్మణేతరుల "నీచ" త్వాన్నీ సవివరంగా వర్ణిస్తూ, తాము కలల్లో కనుగొన్న అద్భుత చారిత్రక సత్యాలన్నింటినీ నవలలుగా మనకు అందించేందుకు స్పెషల్ గా ఓ కంకణం కూడా కట్టుకున్నారు.

"వారి ఉద్దేశం ఏమయినప్పటికీ, ఈ నవలల పుణ్యమా అని తెలుగు సాహిత్యంలో హాస్య రచనలు అంతగాలేని లోటు మాత్రం తీరిపోయింది. ఓపికగల పాఠక మహాశయులీ నవలల్లో అపూర్వ విషయాలెన్నో తెలుసుకుని చైతన్యవంతులు కాగలరు. ఉదహరణకు ఓ నవలలో "అచ్చోటనొక వాగుయున్నది" అంటూ విశ్వనాథ వారు. "అచటనే ఎందుకు యున్నది?" అని వారే ప్రశ్నించి, "యుండవలె గనుక యుండె" నని ఠకీమని
జవాబిస్తారు. "ఇంతకన్నా క్లుప్తంగా, ఘనంగా చెప్పి పాఠకుల నోళ్ళూ, బుర్రలూ మూయించగల ఘనులింకెవరన్నా మన తెలుగువాళ్ళలో ఉన్నారా?

"విశ్వనాథ వారి పురాణ వైర గ్రంథమాలా శైలి అద్భుతం. అంతగొప్పగా వాల్మీకి కూడా రాయలేదని వారి శిష్యుల ఉవాచ, పైచెప్పిన వాగునే తీసుకుందాం. ఆవాగు అక్కడనే ఎందుకున్నదీ బల్లగుద్ది చెప్పాక, అసలు వాగు అననేమి? అదెట్లు పుట్టును... అనే శాస్త్ర చర్చ మొదలెడతారు, శ్రీవారు. "అక్కడెక్కడో కొండలుండెను. వాటిపై మంచు పేరుకొనును. అది కరిగి నీరుగా ప్రవహించును. ఆ పిల్ల వాగులు అలా, అలా, అలా, అలా, రాళ్ళను ఒరుసుకుని, వాటిని అరగదీయుచూ ప్రవహించి పెద్దవై, పెద్దవై, మరింత పెద్దవై వాగుగా మారును... అంటూ ఓపికను బట్టి ఆరు... లేదా పదారు పేజీల పొడుగునా వివరిస్తారు, విశ్వనాథ గారు.

"అంతగొప్ప ప్రకృతి రహస్యాన్ని ఇంత సులువుగా, మామిడి కాయలోని రసం పిండి నోరు పగలదీసి సరాసరి గొంతులో పోసినంత చక్కగా మరే కవి అయినా చెప్పగలడా?

"అందుకే ఆయన మహాకవి అయ్యేడు. తాము చెప్పెడిదే వేదము, రాసినదే ప్రామాణికము, దానికి తిరుగులేదనేది విశ్వనాథ వారి దృఢాభిప్రాయం. "తందాన" అనుటయే వారి శిష్యుల క్వాలిఫికేషన్. అందుకేనేమో వళ్ళుమండి కొత్త సత్యనారాయణ చౌదరి అనే మరో కవిగారు "నీకేం తెలీదు విశ్వనాథా! అసలు నీకే శాస్త్రమూ సరిగా రాదు. నీ రామాయణ కల్పవృక్షం వాల్మీకికే అపచారం. అందులోని పద్యాలు వజ్రపు తునకలు కావు, రాళ్ల ముక్కలు రానాయనా, రాళ్ళ ముక్కలు" అంటూ విరుచుకుపడి, ఆ విషయాన్ని సశాస్త్రోక్తంగా నిరూపించారు.

"ఓ ఆర్నెల్ల పాటు అలా నానా సాహిత్య గొడవా, రగడా జరిగాక విశ్వనాథ వారిహ ఈ సాహిత్య నాస్తిక దుర్మార్గుల్తో వాదించలేక "నాయనలారా! నా మేడ మీద గదిలో నేనొక్కడినే ఒంటరిగా పడుకుంటూ ఉంటాను గదా! మీకు అంత కసిగా వుంటే ఓ సైనేడ్ బుడ్డీ విసిరేయకూడదా! ఇలా చిత్ర వథ చేయనేల!" అని చేతులెత్తేసి మరీ వాపోయారు.

ఆ తుఫాను అలా వెలిసిందగ్గర్నుంచీ శ్రీవారు అహంకారం కాస్త తగ్గించుకుని ప్రశాంతంగా "పురాణవైర గ్రంథమాల"లో తమ మానసిక దురదలన్నింటినీ సాహిత్య వరంగా గోక్కోనారంభించారు. అందుకే దేవుడు గారు దయదలచి జ్ఞానపీఠ జాక్ పాట్ రూపంలో అనుగ్రహించినట్లున్నారు.

అందులో సందేహం అక్కర్లేదని విశ్వనాథ వారే అంటున్నారు. "నా గ్రహబలమే ఈ జ్ఞానపీఠం బహుమతి అనుగ్రహఫలం" అని శ్రీవారే స్వయంగా చెప్తున్నారంటే మనం చచ్చినట్లు నమ్మాల్సిందే! ఇప్పుడు నాకు బుధ మహర్దశ వచ్చింది. నా జాతకం అలా ఉంది. కనుకనే ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నా రాని ప్రైజు ఏ టిక్కెట్టూ కొనకుండానే వచ్చి నా కాళ్ల మీద పడింది అంటున్నారు విశ్వనాథ వారు.

మరి "రామాయణ కల్ప వృక్షం" సంగతేమంటారా? అయ్యా, తమరు ఉత్త అమాయకులు. ఇవన్నీ నశ్వరాలు, నిమిత్త మాత్రాలు. విశ్వనాథ వారే శలవిస్తున్నట్లు ఇవన్నీ రాయువాడూ, ఇప్పించువాడూ, ఇచ్చువాడూ, పుచ్చుకొనువాడూ, తినువాడూ, లేదా దాచుకొని వడ్డికిచ్చువాడూ, అంతా ఆ పరంధాముడి చేతికీలు బొమ్మలే!".

ఇది విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా అప్పట్లో నేను నెలనెలా "వసుధ" మాసపత్రికలో రాసే "కబుర్లు" శీర్షికలో 1971 ఆగస్టు సంచికలో రాసినది.

అప్పట్లో మిత్రులే కొందరు "మరి ఇంత కటువుగానా?" అని నొచ్చుకున్న సందర్భాలున్నాయి. అయితే వ్యక్తిగత విషయాల్లో మర్యాదలు పాటిస్తాంగానీ, సాహిత్య సిద్ధాంత విషయాల్లో నిర్మొహమాటంగా ఉండాల్సిందే. అది లేకనే మనమిలా తగలడ్డాం అనేది నా అవగాహన.

నిజానికి అంతకు చాలా చాలా సంవత్సరాలకు పూర్వమే నేను "విశాలాంధ్ర"లో పనిచేసే రోజుల్లో ఈ అంశం మీదనే అప్పటి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మద్దుకూరి చంద్రశేఖరరావు గారికి నా నిరసన తెలిపి ఉన్నాను.

అదేమంటే....

ఓ రోజున విశాలాంధ్ర ప్రచురణాలయం మేనేజర్ నన్ను పలిచి, ఓ పుస్తకాల లిస్టు ఇచ్చి "ఇవి ఏలూర్రోడ్డు మీద ఫలానా ఎస్సారార్ సివిఆర్ కాలేజీ దగ్గర్లో, ఫలానా చోట ఉండే విశ్వనాధ సత్యనారాయణ గారి ఇంటి వద్ద దొరుకుతాయి. ఈ చీటి ఆయనకిచ్చి పుస్తకాలు పట్రా" అని ఆజ్ఞాపించారు.

నేనప్పటికే విశ్వనాధ వారి పుస్తకాలు దొరికినంత వరకు చదివి ఉన్నాను. ముఖ్యంగా "వేయిపడగలు" మూలంగా ఆయన్ను మహా ఛాదస్తునిగా లెక్కవేసుకొని ఉన్నాను. "హాహా హిహి హుహు"లోనో మరెందులోనో గానీ ఆంగ్ల భాష విషయంలో ఆయన విమర్శలు మరీ హాస్యాస్పదంగా కనుపించాయి. అందుకని "ఈయన పుస్తకాలు అంతదూరం నించీ మోసుకొచ్చి అమ్మే ఖర్మ మనకేమిటీ? అనడిగేను, మేనేజరు వెంకట్రామయ్య గారిని. "ఓ ఆర్డరు ఉందిలేవోయ్! మన పుస్తకాల్తో పాటు అవీ సప్లయి చేయాలిగానీ, వెళ్ళి పట్రా" అన్నారాయన.

సరే, నేను అంతదూరం శ్రమపడి వెళ్లేను, కనీసం అంత "గొప్ప" వాడిని, "కవిసామ్రాట్టు"ను చూసినట్లవుతుందని.

కాలేజీలో లెక్చరర్ గనుకా, కవి సామ్రాట్ బిరుదాంకితులు గనుకా ఏలూరు కాల్వకు సమీపంలోని ఆయన "పర్ణశాల" నాకు తేలిగ్గానే దొరికింది. నిజంగా ఆదో పర్ణశాలే! చుట్టూ కర్రల్తో కట్టిన "దడి", దానికో గేటు, మధ్యలో పూరిల్లు.

నేనాగేటుకున్న తాడో పేడో గానీ వదిలించి గేటు తీసుకొని రెండు అడుగులు లోపలికి వేశానో లేదో, సాక్షాత్తూ కవిసామ్రాట్టు గారే ఆ కుటీరంలోంచి బయటికి వచ్చేరు, రెండు చేతులూ ఎత్తి "ఆగుము, ఆగుము" అని ఆదేశిస్తూ.

ఆయన నా దగ్గరకు రాగానే నేనెవర్నో బహుశా అర్థం అయిపోయుంటుంది. అయినా, ఫలానా అని చెప్పి జేబులోంచి మా మేనేజరు గారి లేఖ మరియు శ్రీవారి పుస్తకముల జాబితా ఉన్న కవరుతీసి వారిచేతికి అందివ్వబోయేను.

మడి, అంటరాని తనం అలా పాటించారు:

ఆయన జడుసుకున్నారో ఏమో గానీ "ఆగాగు" అని చెప్పి నాలుగడుగులు వెనక్కి వేసి "ఆ లేఖనట పెట్టుము" అని వర్ణశాల అరుగుకేసి చూపించేరు. నేనున్నూ కవి సామ్రాట్టుల వారి ఆజ్ఞ శిరసావహించేను.

అపుడాయన ఆ లేఖ రాజంబును మడిచెడకుండా రెండు వ్రేళ్లతో ఎత్తి తీసుకొని శ్రద్ధగా పఠించిన వారై "అచ్చోటనే యుండుము, ముందుకు రాకుము" అని యాజ్ఞాపించి వర్ణశాలలోని కేగిన వారయిరి. మరి కొంతసేపటికి పుస్తకములు తెచ్చి, తీసుకుపోమ్మని యువాచించగా "హమ్మయ్య" అనుకుని నేను గ్రంథరాజములను నా ద్విచక్ర వాహనము వెనుక సీటుకు తగ్గించుకొని, ఆఫీసున కేగి, మానేజర్ గారికా పుస్తకములకట్ట, కవి సామ్రాట్టుల స్వహస్త లిఖిత బిల్లు సహితంగా అందజేసి "అయ్యా, నన్నింకెన్నడూ సదరు చాదస్తుని వద్దకు పంపకుడు" అని ప్రార్థించిన వాడినైతిని.

ఆ తర్వాత ఓ రోజు "మద్దుకూరి చంద్రశేఖ రావు గారు" కాస్త తీరిగ్గా కనపడితే అడిగేను "ఇలాంటి వాళ్ల పుస్తకాలు అమ్మే ఖర్మ మనకేమిటండీ" అని.

చంద్రం గారు కేవలం పార్టీ కార్యదర్శేకాదు. సాహితీ పరులకు గౌరవ పాత్రుడయిన ఆనాటి ప్రముఖ విమర్శకుడు కూడానూ.

"కొందరు రచయితలు రాజకీయంగా మనకు మిత్రులే, మనవాళ్లే అయినా, వారి రచనల్లో మనకు నచ్చని రాజకీయ లేదా సిద్ధాంతపర అంచనాలున్నాయన్న కారణంగా ఇప్పటికే కొందరి పుస్తకాలు విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అమ్మటానికి నిరాకరించి విరోధాలు తెచ్చి పెట్టుకున్న అసలు సిసలు కమ్యూనిస్టులం గదా మనం! మరి ఈ విశ్వనాధ సంగతేమిటండీ!" అనేది నా అభ్యంతరం సారాశం.

ఆయన అందుకు సమాధానంగా ఏమీ అనలేక పోయినట్లున్నారు. కేవలం విని ఊరుకున్నారు. నేను రెట్టించలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి ప్రశ్నలు అడిగే వాడేలేడు.

ఆనాడు విశ్వనాథ వారి ఫ్యూడల్ సంస్కృతీ ప్రతీకలైన సాహిత్యాన్ని అమ్మిపెట్టే విషయంలో ఏదో పొరపాటు జరిగింది లెమ్మనుకున్నా అది ఆ తర్వాత అలవాటుగా మారి, అంతకన్నా హీనమైన పెట్టుబడిదారీ "క్షుద్ర" సాహిత్యాన్ని కూడా అమ్మిపెట్టే స్థితికి అభివృద్ధి చెందామంటే దానికి బీజాలు ఆనాడలా పడినవే కాదా!

- కీ.శే. చలసాని ప్రసాదరావు

("ఇలా మిగిలేం" పుస్తకం (1993) నుండి స్వీకరణ)

59 కామెంట్‌లు:

కామేశ్వరరావు చెప్పారు...

విశ్వనాథ సాహిత్యాన్ని గురించిన విమర్శలలో మరో అద్భుత ఆణిముత్యాన్ని అందించారు! సంతోషం. విశ్వనాథ సాహిత్యం మాట ఎలా ఉన్నా, ఇలాటి వ్యాసాల వల్ల రెండు విషయాలు బాగా తెలుసుకోవచ్చు:
1. విశ్వనాథవారి మీద కొందరికి ఎంత కసీ ద్వేషం ఉందీ అన్న విషయం.
2. ఒక వ్యక్తి మీదున్న కసినీ ద్వేషాన్నీ ఎంత సునిశితంగా, జాగ్రత్తగా (అంటే ఎక్కడా un-parliamentary భాష వాడకూండానే దాని స్ఫూర్తిని కలిగించడం) వ్యాసంలో వ్యక్తీకరించవచ్చు.

ఇంతకీ "సమ్రాట్టు" అన్న పదాన్ని "సామ్రాట్టు"అని తప్పుగా రాసింది చలసానివారేనా అది మీ అచ్చు తప్పా?

అజ్ఞాత చెప్పారు...

కిందటి వ్యాసం చూసాకకూడా కొంచెం సందేహాలుండేవి. ఈ వ్యాసం చూసాక పూర్తిగా తీరిపోయాయి.
'రావు'గారూ,ఈ వ్యాసపరంపర ప్రచురించడం వెనక మీకు ఏమి 'వచ్చు'నో పూర్తిగా అర్థం అయ్యింది.
కానీండి... ముందుకు సాగండి.

Aruna చెప్పారు...

Though he is in poverty, he followed the rituals and traditions. My admiration for him has increased thousand fold. :)

Request you to write few more articles on him. :)

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
kasturimuralikrishna చెప్పారు...

వేయి పడగలు, కిన్నెర సాని లాంటి మహద్గ్రంథాలలో మన మట్టి బుర్రలకు అర్ధంకాని...... ఇది నమ్మినవారెవరయినా ఒక్క సారి నా బ్లాగులో నేను రాసిన 9 కిన్నెరసాని వ్యాసాలలో ఏఒక్కటి చదివినా, అది అర్ధంకానివారిదెంతగా మట్టిబుర్రో అర్ధమయిపోతుంది. ఇక్కడ ఉదాహరించిన మిగతా పుస్తకాలు కూడా త్వరలో పరిచయం చేస్తాను. చలసాని మాటలు కాక ఎవరికి వారే తెలుసుకుని నిర్ణయించుకోవచ్చు. గొప్పవారుకూడా మనుషులేకదా! పొరపాట్లు జరుగుతాయి. అలాంటి పొలిటికల్లీ కరెక్ట్ పొరపాటీ వ్యాసం.

కొత్త పాళీ చెప్పారు...

చలసాని ప్రసాద రావుగారంటే చాలా విషయాల్లో నాకు చాలా గౌరవం. కానీ, మనం గౌరవించే వ్యక్తి అన్ని విషయాల్లోనూ మన గౌరవానికి పాత్రుడై ఉండాలనేం లేదు.

netizen నెటిజన్ చెప్పారు...

"..మనం గౌరవించే వ్యక్తి అన్ని విషయాల్లోనూ మన గౌరవానికి పాత్రుడై ఉండాలనేం లేదు." బాగా చెప్పారు!

అజ్ఞాత చెప్పారు...

నెటిజెన్
కదావీళ్ళకు చెప్పినా అర్థం కాదులె.
నువ్వు మటుకు గుడ్ షో.
అప్పుడప్పుడూ ఇలాగ నన్ను సమర్థిస్తూ ఉండు.
లేకుంటే తెలుసుకద.. బురద బురద చల్లించేస్తా

ఆమెన్

cbrao చెప్పారు...

టపా పై వ్యాఖ్యలు లో వ్యక్తి దూషణలు వద్దు. వ్యాసంలో వెలిబుచ్చిన భావాలపై మాత్రమే మీ అభిప్రాయం తెలియ పరచగలరు.

అజ్ఞాత చెప్పారు...

విశ్వనాధగారి రచనలు మీద ఆయన విస్వాశాలతో, ప్రసాదారావుగారిలాగే విభేదించే చే.రా. అభిప్రాయాలు బేలన్స్ తో వుంటాయి. ఆయన వచన శైలి మీద చే.రా. అద్భుతమైన వ్యాసం (వచన తత్వ పరిశీలనలో వుందనుకుంటా)లో చెప్పినట్ట, విశ్వనాధ తన ఆడియన్స్ కి తగని శైలిని ఎంచుకున్నారు. అది నచ్చని వాళ్ళు ఆయన్ని చదవకపోతే, వాళ్ళ దురదృష్టం. IMHO, విశ్వనాధ రచనలని చులకన చేసి, నిర్లక్ష్యం చేయడం సృజనాత్మక వామపక్ష సాహిత్యకారులకైనా నష్టదాయకమే.
రమణ

అజ్ఞాత చెప్పారు...

Futile attempts to portrait VSN as a villain is apparent. Chalasaani's piece is misused here.Damn sure that the late and kind soul would have strongly opposed to such usage. You know, Chalasani was a great soul! Such an open minded and affectionate person. Anyway, let the demonizing saga continue and history will decide what's right or wrong. The great and extremely complex soul VSN would not care for it though. But people who read deep into his books will know for sure. All the best Mr Rao and associates.

Now donot ask me what piece was misused here, you should know by now if you read the "ila migilam" book.

Anonymous ? (Am I ?)

Well. I am for now.

అజ్ఞాత చెప్పారు...

ధన్యోస్మి. బహు బాగు. అసలు ఈ ఒకళ్ళ మీద మరొకళ్ళు పడి ఏడిచే సంస్కృతికి కొంపదీసి ఆంధ్రులే ఆద్యులు కాదు కదా? ఇవి "కబుర్లు" ఏంటండీ బాబూ, చక్కగా ఏ "శాపనార్ధాలు" అనో "కుళ్ళు(కున్న)కబుర్లు" అంటే బాగుండేదేమో.

ఆనాటికి పుట్టనివాడిని కాబట్టి నేను వారి గుణగణాలు గూర్చి మాట్లాడలేను కానీ, ఇప్పటివారికి మాత్రం మన పెద్దవాళ్ళ P.H.D (పుల్ హిమ్ డౌన్) సంస్కృతి మాత్రం బాగా అర్ధమవుతుంది.

ఇక కమ్యూనిస్టుల విశాలాంధ్ర వారు అమ్మని పుస్తకాలేమున్నాయ్? పైగా "అమ్మిపెట్టాము" అని అక్కడేదో రచయితలపై కరుణ చూపినట్లు మాట్లాడటం బాలేదు. కొనేవాళ్ళుండాలే గానీ, "లెనిన్ శుద్ధ హిందువే" అనో పుస్తకం ఉన్నా అమ్మేస్తారు. వ్యాపార విషయాల్లో కమ్యూనిస్టులు మడికట్టుక్కూచోరనేనాడో అర్ధమయింది.

అజ్ఞాత చెప్పారు...

పునరుద్ధీకరణ ఏంటండీ ? పునరుద్ధరణ కాదూ ? అమెరికా వెళ్ళాక మీరు తెలుగు మర్చిపోవడంలేదు కదా ?

అజ్ఞాత చెప్పారు...

నేను హైదరాబాదు కేంద్రవిశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. లో చేరినప్పుడు విశ్వనాథవారి అభ్యుదయభావాల మీద ఒక అధ్యాయం కే్టాయిద్దామా ? అంటే
కరుడుగట్టిన కమ్యూనిస్టయిన మా గురువుగారు (గైడు) కోపం తెచ్చుకొని "అది చాలా గొడవలకి దారి తీస్తుంది. విశ్వనాథకి ఆ ఇమేజి లేదు"అని అన్నారు. కానీ
ఆయన నవలలు చదివినప్పుడు విశ్వనాథవారిలో కూడా ఆధునికభావాలు లేకపోలేదనిపించిన మాట నిజం.

మొత్తమ్మీద నాస్తికుల పర్యవేక్షణలో నేను పి.హెచ్.డి. చెయ్యడం దేవుడికి ఇష్టం లేదేమో తరువాతి కాలంలో నేనా పరిశోధనావ్యాసంగం నుంచి స్వచ్ఛందంగా విరమించుకొన్నాను.

కామేశ్వరరావు చెప్పారు...

సి.బి. రావుగారు,
"టపా పై వ్యాఖ్యలు లో వ్యక్తి దూషణలు వద్దు" అన్నారు.
నాదికూడా ముమ్మాటికీ ఇదే మాట. వ్యాఖ్య చేసేవాళ్ళందరికీ నా విన్నపం కూడా ఇదే.
మరో చిన్న మాట. ఇంత ఉచితానుచితాలు తెలిసిన మీకు మీరు పోస్టు చేసిన రెండు టపాల్లోనూ వ్యక్తి దూషణ కనపడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది!
అన్ని చోట్లా మీరు ఒకే రకమైన ప్రమాణాలు పాటిస్తే బావుంటుంది.

cbrao చెప్పారు...

@ భైరవభట్ల కామేశ్వర రావు : "ఇంతకీ "సమ్రాట్టు" అన్న పదాన్ని "సామ్రాట్టు"అని తప్పుగా రాసింది చలసానివారేనా అది మీ అచ్చు తప్పా?" -చలసాని వారే.
"మీరు పోస్టు చేసిన రెండు టపాల్లోనూ వ్యక్తి దూషణ కనపడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది!" - వ్యక్తి దూషణకు, భావజాల విమర్శకు తేడా గమనించగలరు.

ఒక వ్యక్తి ప్రతిభలో బొమ్మ బొరుసూ ఉంటాయి. విశ్వనాధ వారిని కీర్తిస్తూ రాసినవి తెలిసినట్లుగా విమర్శలు పెద్దగా తెలియవనే చెప్పాలి. విమర్శలు సరే, ఈ కాలం వారు పెక్కుమందికి విశ్వనాధ రచనలతో పరిచయమే లేదు. కొందరు పాఠకులు కోరినట్లుగా విశ్వనాధ వారిగురించి కొన్ని రచనలు వెలువరించే ప్రయత్నంలో భాగంగా,గుప్త పాశుపతము పై నా సమీక్ష పుస్తకం.నెట్ లో ప్రచురించాను. మరికొన్ని పుస్తకాలపై సమీక్షలు ప్రచురించాలని అకాంక్ష. అమెరికాలో విశ్వనాధవారి పుస్తకాలు సులభంగా లభ్యం కావు. మీకు నచ్చిన విశ్వనాధ పుస్తకాలను సమీక్షిస్తే ,అంతర్జాల తరం యువత విశ్వనాధ పుస్తకాలలోని అంతర్లీన వస్తువేమిటో తెలుసుకొనగలరు. మీకు ఏ పుస్తకం సమీక్షించంటంపై ఆసక్తి ఉందో తెలుపండి. మిగిలిన ఔత్సాహికులు ఇతర పుస్తకాలను సమీక్షించవచ్చు. ఇది పెద్ద పనంటారా? అవును. ఇష్టమైతే కష్టం కాదు మీకు. విశ్వనాధ పై విమర్శలు ప్రచురిస్తున్నానని నా పై కోపం ప్రదర్శించే వారు తలా ఒక పుస్తకం సమీక్షించే పని చేస్తే బాగుండదా?

cbrao చెప్పారు...

@ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: "పునరుద్ధీకరణ ఏంటండీ ? పునరుద్ధరణ కాదూ ? " -అచ్చుతప్పుకు క్షమించాలి. తప్పు సరిదిద్దుతున్నాను. విశ్వనాధ వారి చెలియలికట్ట చదువుతుంటే వారికి మనస్తత్వ శాస్త్రం, కామ శాస్త్రం పై ఉన్న అవగాహన నన్ను విస్మయపరిచింది. ముగింపు చర్చించనీయమైనా, ఎంత తెగింపు కల కధాంశంతో కధ వ్రాశారు!

విశ్వనాథవారి అభ్యుదయభావాల మీద మీ Ph.D ఆగిపోవటం వెనుక కధ ఆసక్తికరంగా ఉంది. విశ్వనాధ అభ్యుదయవాదంటే కమ్యూనిస్ట్లెవరైనా ముక్కు మీద వేలేసుకోవల్సిందే.

కామేశ్వరరావు చెప్పారు...

సి.బి. రావుగారు,

"వ్యక్తి దూషణకు, భావజాల విమర్శకు తేడా గమనించగలరు"
సరిగ్గా నేను చెప్తున్నదీ అదే! ఇది సాహిత్య విమర్శకానీ కనీసం "భావజాల" విమర్శ కానీ కాదనీ, వ్యక్తి దూషణ అనే నేనూ అంటున్నాను. ఎందుకో కిందటి టపాకిచ్చిన వ్యాఖ్యలో వివరంగా ప్రస్తావించాను. దానికి సమాధానం నాకు రాలేదు. ఈ టపాకి అలాటి వివరణ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను. ఇది వ్యక్తి దూషణ కాదు, భావజాల విమర్శ అని మీరనడం వెనక కారణాలేమిటో వివరిస్తారా? అసలు "భావజాల" విమర్శకి వ్యక్తితో సంబంధం ఉందా? సాహిత్య సంఘాలని "విదూషక బృందం" అనీ, సాహిత్య సంఘాలు సన్మానించేవాళ్ళని "నిర్భాగ్యులనీ", "ముష్టివాళ్ళనీ" అనడం వ్యక్తి దూషణ ఎందుకు కాదో చెప్పండి? సరే మళ్ళీ ఇలా ఉదాహరణలివ్వడం మొదలుపెడితే ఈ టపా అంతా మళ్ళీ ఇక్కడ రాయాలి. మొదటి టపా వ్యాఖ్యలో నేనడిగిన ప్రశ్నలకే జవాబు లేదు కాబట్టి మళ్ళీ ఇది అనవసరం.

ఇక, విశ్వనాథవారి సాహిత్యం గురించిన పరిచయమూ, సమీక్షా చెయ్యడం కోసం ఇలాటి టపాల అవసరం లేదు. ఆసక్తి ఉన్నవాళ్ళకి చుట్టూ చూస్తే అలాటివి కనిపిస్తాయి. ఆసక్తి ఉంటే, కొన్నాళ్ళ కిందట ఈమాటలో "పాదూ ఖండం" అనే నా వ్యాసం చదవండి.
నేను కిందటి టపాలో పేర్కొన్న Digital Libraryలోని పుస్తకం విశ్వనాథ సాహిత్యం గురించి కావలసినంత పరిచయం ఇస్తుంది, దాన్ని మీరు చదివారో లేదో నాకు తెలీదు.
విశ్వనాథ కల్పవృక్షం మీద "ఇది కల్పవృక్షం" అని వడలి మందేశ్వర రావుగారి మంచి పుస్తకం ఉంది, అదైనా చదవచ్చు. ఇవన్నీ మీకు "భట్రాజీయం"లా అనిపిస్తే మాత్రం నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. విశ్వనాథ రచనల్లో లోపాలు చూడ్డమే మీకు ఆసక్తికరమైతే, మీరే స్వయంగా ఆ పనికి పూనుకోవచ్చు. అది చేసే ముందు, మరీ పాతవాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయినా, చేరాగారిలాంటి వాళ్ళ వ్యాసాలు చదివితే, రచనని విమర్శించడానికీ వ్యక్తిగత దూషణకీ తేడా ఏమిటో మీకు మరింత స్పష్టంగా తెలుస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

రావు గారి కి ఆయన గ్యాంగుకు యోగి అయితేనే కరెక్టు. కామేశ్వరం మాష్టారు, మీలాంటి వారు మంచి మాటలతో గెలవలేరు. కానీ ఏమిచేద్దాము.
యోగీ చూస్తున్నవా?

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

రావుగారూ మొత్తానికి ఈ మీ మనోల్లాస పోష్టులతో అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు. మామూలుగా విస్మయానికి గురికాని నేను, మీ పాత పోష్టులో ఉన్న 110 కామెంట్లలో సుమారు 70 మీవే చూసి ఆనందం, ఆశ్చర్యం, ఉల్లాసం, ఉత్తేజానికి గురి అయ్యాను, ఈ వయసులో కూడా మీ జ్వాలల్ని భుగ భుగ మండిస్తున్నందుకు. ఆ విస్మయ మాయాజాలంలో పడి నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసాను కూడా. అందుకే ఈ కామెంటు.

అదేదో రచనలో విశ్వనాథ చెప్పినట్టు

"నా నెత్తిపైకెక్కి పిండిగొట్టుచున్నావు, నా గుండెలోనుండి గగ్గోలు చేయుచున్నావు, లుంగయైపోతి"...అనే వాక్యాలు మీకు అన్వయిస్తే, అవి మీ కపాలభేదంలోని ఉపాసనాశక్తిని తెలియచేస్తున్నాయి. అందుకోండి నీరాజనాలు. విశ్వనాథ వారి రచనలు చదివితే ఆయన ముందుగా ఒక వ్యక్తి అని, ఆ పైన కవి అని, ఆపైన ఒక తత్త్వవేత్త అని తెలుస్తుంది. వ్యక్తి అన్నాక ఉండవలసిన లోపాలు ఉండకుండా ఉండవు.మీరూ వ్యక్తే కాబట్టి మీకూ బోలెడు లోపాలు ఉంటవి. కాబట్టి మిమ్మల్ని తప్పు పట్టి ప్రయోజనం లేదు. ఎవరి లోపాలు వారివి. రచనల శక్తి అర్థం కానప్పుడు చర్చలు రావటం సమంజసమే. ఆ చర్చ ద్వేషంలోనుంచి పుట్టుకొస్తేనో, లేక ఏదోరకంగా నలుగురి కళ్ళల్లో పడాలి అనే ఉద్దేశముంటేనో చర్చ లేవనెత్తిన వారికి, ఇతరులకు వచ్చే తిప్పలు చెప్పనలవి కాదు. అయితే ఈ చర్చ కొంతమదికి అయినా బహు హృద్యంగా ఉన్నది అని స్పందన చూసి ఏర్పరచుకున్న అభిప్రాయం, అందుకు సందేహమేమీ లేదు. అందుకు మీరు అభినందనీయులు. పాత ఒక రోత అని, కొత్త అంతా మంచి అని అనుకునే సమకాలీకులకు ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, మనబోంట్లకు అది పనికిరాదు.కాలప్రవాహాన్ని తనవైపుకు తిప్పుకునేవాడినే మహాకవి అంటారు. విశ్వనాథ కొందరి దృష్టిలో మహాకవి కాకపోవచ్చు, ఆ ప్రవాహానికి ఎదురీదే వారూ ఉండొచ్చు, అలా ఈదుతూ ఆ ప్రవాహంలో మునిగిపోయే వారూ ఉండొచ్చు, పైకి తేలి రొప్పేవారూ ఉండొచ్చు. ఇంకా చాలా రాయలని ఉన్నది కానీ, ఇంకో కల్పవృక్షం అవునేమో అని భయానందం వేయుచ్నున్నది...ఇంతే సంగతులు చిత్తగించవలెను...

ఏతావాతా తేలిందేమిటయ్యా అంటే ఈ పోష్టులని బట్టి అమెరికా వచ్చాక మీకు ఖాళీ సమయం బాగా దొరికుతోంది అనీ, దాన్ని సద్వినియోగం చేస్తున్నారు అనీ గమనించిన పిదప మిక్కిలి సంతోషమయినది. :)...:)

అజ్ఞాత చెప్పారు...

ఈ టపా చూసిన తర్వాత, ఇంతకు ముందు టపా చదివిన తర్వాత ఇంకొక్క సారి నా అభిప్రాయాలను పంచుకునే సాహసం చేస్తున్నాను. చర్విత చరణంగా చెబుతున్న మనవి. నా వ్యాఖ్య ఎవరిని నొప్పించినా, నిర్ద్వంద్వంగా క్షమాపణలు.

వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత విమర్శ, భావజాల విమర్శ అంటే ఏమిటి ? విశ్వనాథ వారి మీద ఇంత తీవ్ర విమర్శ ఎందుకు వస్తున్నది? చలసాని ప్రసాద రావు గారు తక్కువ వ్యక్తి కారు. ఆయన ప్రముఖ విలేఖరి, వక్త, రచయిత. అలానే విశ్వనాథ విమర్శకుల్లో శ్రీశ్రీ ఒకరు. ఇది వరకు ఇన్నయ్య గారు సాహితీ వేత్త కాకపోయినా, తమ రంగంలో నిష్ణాతులు. వీరందరికీ విశ్వనాథ వారిపైన కేవలం అసూయ, ద్వేషం, జ్ఞానపీఠం అనవసరంగా తనకు ఇచ్చారన్న తీవ్రమైన అసహనమా? నాకు అనిపించిన విశ్లేషణ ఇది. (ఇది కేవలం నా ఊహే తప్ప ఏ రకంగానూ ప్రామాణికత లేదు)

రెండు వర్గాల రచయితలు ఉన్నారనుకుందాం (విశ్లేషణా సౌలభ్యానికి).
మొదటి వర్గం. ఈ వర్గం రచయిత లేదా కళాకారుడు వ్యక్తిగతంగా ఓ పెద్ద తాగుబోతు, విషయలంపటుడు. అయితే ఈ రచయిత మహా రచయిత. తాగుబోతు తనం అన్నది తన బలహీనత. ఇక్కడ ఒక విషయం గమనించాలి. తాగుబోతు తనం - అన్నది ఓ సిద్ధాంతం (ideology) కాదు. తనకు తన ఊహాలోకంలో ఓ విధమైన స్వేచ్చ కావాలి.అందుకు తాగడాన్ని ఆసరగాా తీసుకుంటాడు. ఇందులో ఎదుటి వ్యక్తి కి హాని కలిగించే అంశం లేదు. అలాగని తన రచనల్లో తాగుడుని ప్రోత్సహించడు. తాగడం తన బలహీనత మాత్రమే.
రెండవ వర్గం : ఈ వర్గం లో రచయిత ఓ చాందసుడు. అహంకారి (క్షమించాలి, ఈ పదం వాడినందుకు). ఇంకాస్త నిరంకుశంగా చెప్పాలంటే తిరోగమన వాది. ఇక్కడా ఓ విషయం గమనించాలి. అహంకారం, తిరోగమన వాదం, చాందసం అన్నవి బలహీనతలయినా, ఇవి ఆలోచనలను ప్రభావితం (కలుషితం) చేసేవి కాబట్టి, వీటి వల్ల ఎదుటి వ్యక్తులకు (సమాజానికి)ముప్పు తప్పదు. ఇవి ఈ రచయిత రచనల్లో, లేదా ఇంకోచోటనో ప్రతిబింబించక మానవు.

మొదటి వర్గం రచయితను "తాగుబోతు" అని సంబోధిస్తే - అది ఖచ్చితంగా వ్యక్తిగత దూషణ.
రెండవ వర్గం రచయితను "చాందస వాది" గా పేర్కొంటే? ఇది వ్యక్తిగత దూషణ కిందకు వస్తుందా? ఎందుకంటే "చాందస వాదం" రచనల్లో కనిపిస్తున్నది కాబట్టి.

అయితే దైవ కృప వల్లో, మేధా సంకల్పం వల్లో, రెందవ వర్గం రచయిత మహా గొప్ప రచయిత. నిరుపమానమైన ప్రజ్ఞాపాటవాలు కలిగిన వారు. ఆయనను సాహిత్య పరంగా విమర్శించడం అసాధ్యం. అయినంత మాత్రాన ఆ రచయిత (రచనల్లో, లేదా వ్యాఖ్యల్లో ఉన్న)భావజాల పరంపర సరి అయినదేనా? అంతటి గొప్ప రచయిత, ఉదాహరణకు : రామాయణంలో సీత అగ్ని ప్రవేశ ఘట్టాన్ని ఎంతో ఆర్ద్రతతో సీత పట్ల సానుభూతి కలిగించేట్టు చిత్రీకరించిన వ్యక్తి, నిజ జీవితంలో ఓ మహిళా రచయితను "విషకీటకం" గా దూషించటం సరి అయినదేనా? వ్యక్తి నిబద్ధతను (నిబద్ధత రచనల్లో కనిపించాల్సిన అవసరం లేదా?) ఏరకంగానూ ప్రశ్నించరాదా? తన భావప్రకటనల వల్ల బాధకు గురి అయిన వ్యక్తులు ఆయన ఆలోచనా విధానం తప్పని చెప్పడానికి ఏ పద్ధతి వాడుకోవాలి? సాహిత్య విమర్శ ద్వారానేనా?

ఇవన్నీ నాకు కలిగిన అనుమానాలు (నాణేనికి అటువైపు నుండీ పరిశీలిస్తే). విశ్వనాథ వారి మీద అసూయతో, ద్వేషంతో విమర్శలు చేస్తున్నారు అని నిరూపితమైతే ఈ చర్చే అనవసరం. ఒకరి అసూయకు, ద్వేషానికి స్పందించాల్సిన అవసరం లేదు.

భాస్కర రావు గారు కొన్ని వ్యాసాల ద్వారా విశ్వనాథ వారి గొప్పతనాన్ని అంచనా వేయడం ప్రశ్నార్థకమైతే, ఇక్కడ కనిపించిన ఒకట్రెండు విమర్శల ఆధారం చేసుకుని, విశ్వనాథ విమర్శకులను వ్యక్తిగత దూషకులుగా పరిగణించటం కూడా ప్రశ్నార్థకం కాదంటారా?

భైరవభట్ల గారు, రెండు వైపులా ఆలోచించి, కాస్త గట్టి సమాధానం చెప్పాలి మీరు నాకు. లేకపోతే, నా లాంటి వాడికి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. :-) (ఇవి ఆలోచనలు మాత్రమే సుమా, విశ్వనాథ, శ్రీశ్రీ, వీరి మీద సమీక్షలు, విమర్శలు చేసేంత తాహతు లేదని నాకు లేదని, మీకు తెలుసని నాకు తెలుసు :-).)

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

@రవి గారూ
మీ వ్యాఖ్య, అందులో సందేహాలు బాగున్నాయి... నాకు ఇప్పుడు ఈ టపాలోను, వ్యాఖ్యల్లోనూ విషయాన్ని అర్ధం చేసుకోవడం లో కొంత అయోమయం పోయింది. మీకు నెనర్లు... ఇక జవాబు వ్యాఖ్యల గురించి ఎదురుచూస్తున్నా....

yogirk చెప్పారు...

కూడలిని కొద్దిరోజుల క్రితం నా కంప్యూటర్ లో block చేసాను. నా మనశ్శాంతికోసం. నిన్న ఒక బ్లాగ్మిత్రునితో మాట్లాడుతుండగా రావు గారి "దీప్తిధార" లో ప్రతిఫలించిన ఈ సరికొత్త కాంతిపుంజం గురించి విని వద్దు వద్దనుకుంటేనే ఈ అంతర్జాలమనే కారుచీకటిలోని దీప్తిధారను తెరవడము, ఏం జరుగుతుందో తెలిసే లోపల చవేయడం, భైరవభట్ల గారి, రవి గారి వ్యాఖ్యలు చూడటం జరిగిపోయింది. అలవాటు పడ్డ ప్రాణం, ప్రతిస్పందించాల్సి వస్తోంది.

క్రితం సారి విశ్వనాథ గారి మీద ఇన్నయ్యగారి "విమర్శనాత్మక" వ్యాసమూ దానికి కొనసాగింపుగా వచ్చిన "గొప్పవాళ్ళ మీద కువిమర్శలు అవసరమే" లాంటి వ్యాఖ్యలు, అదే స్థాయిలో రావు గారి అంచెలంచెల సుజ్ఞానపూరిత వ్యాఖ్యాధార లోనూ కొట్టుకుపోయిన నేను మళ్ళీ ఇటు తిరిగి చూసే సాహసం చెయ్యలేదు. కానీ రవి గారి వ్యాఖ్యలు నన్నీ ప్రతిస్పందనకు పురిగొల్పాయి. (అజ్ఞాతగారూ మన్నించండి. వీధిపోరాటాలు చేసేంత ఓపికలేదు)

ఈ వ్యాసపరంపరకు నేపథ్యం గా రావు గారు చెప్పే కారణం - " ఒక వ్యక్తి ప్రతిభలో బొమ్మ బొరుసూ ఉంటాయి. విశ్వనాధ వారిని కీర్తిస్తూ రాసినవి తెలిసినట్లుగా విమర్శలు పెద్దగా తెలియవనే చెప్పాలి. విమర్శలు సరే, ఈ కాలం వారు పెక్కుమందికి విశ్వనాధ రచనలతో పరిచయమే లేదు. కొందరు పాఠకులు కోరినట్లుగా విశ్వనాధ వారిగురించి కొన్ని రచనలు వెలువరించే ప్రయత్నంలో భాగంగా,గుప్త పాశుపతము పై నా సమీక్ష పుస్తకం.నెట్ లో ప్రచురించాను. మరికొన్ని పుస్తకాలపై సమీక్షలు ప్రచురించాలని అకాంక్ష. అమెరికాలో విశ్వనాధవారి పుస్తకాలు సులభంగా లభ్యం కావు. మీకు నచ్చిన విశ్వనాధ పుస్తకాలను సమీక్షిస్తే ,అంతర్జాల తరం యువత విశ్వనాధ పుస్తకాలలోని అంతర్లీన వస్తువేమిటో తెలుసుకొనగలరు. మీకు ఏ పుస్తకం సమీక్షించంటంపై ఆసక్తి ఉందో తెలుపండి. మిగిలిన ఔత్సాహికులు ఇతర పుస్తకాలను సమీక్షించవచ్చు. ఇది పెద్ద పనంటారా? అవును. ఇష్టమైతే కష్టం కాదు మీకు. విశ్వనాధ పై విమర్శలు ప్రచురిస్తున్నానని నా పై కోపం ప్రదర్శించే వారు తలా ఒక పుస్తకం సమీక్షించే పని చేస్తే బాగుండదా?"

అంటే, విమర్శించే పని మాత్రం రావు గారు చేస్తారు మిగతా వారందరూ తలా ఒక పుస్తక రివ్యూ రాయమని అర్థం. మంచి చేయటానికి ఇంత డొంకతిరుగుడు మార్గాలన్నది నాకు అర్థం కాని విషయం. మీకెవరికైనా అర్థం అయ్యిందా? అంతర్జాల యువతకు విశ్వనాథవారిని పరిచయం చెయ్యబోవటం హర్షణీయమే. విశ్వనాధుని రచనలతో పెద్ద్గా పరిచయంలేని అంతర్జాల యువతకు నేను ప్రాతినిధ్యం వహించటం మీకు సరీనదిగా అనిపిస్తే, రావు గారి కి నాదో సూటి ప్రశ్న. పిల్లలకు మామూలుగా బోధించే విధానం ఏమిటి? ఏ విషయం మీదనైనా ఆసక్తి కలిగించడం ఎలాగ? ఆవు గురించి వ్యాసం రాయడం ఎలాగో మనం పిల్లలకు నేర్పిస్తున్నాం అనుకుందాం. ఎలా మొదలు పెడతాం? "ఆవు సాధు జంతువు. ఆవు పాలిచ్చును...." ఇలాగే కాదా?(తప్పయితే మన్నించాలి నేను బడికి సక్రమంగా వెళ్ళలేదు.) మరి ఆవుకు ఇంకో పార్శ్వం కూడా ఉంది కదా, మీరూన్నట్లు నాణేనికి ఇంకో వైపు. ఆవు పాలే కాదు ఇంకా చాలా ఇస్తుంది. మరి మనం అలా నేర్పించడం మొదలుపెడతామా?


ఇన్నయ్య గారు వారి రంగం లో నిష్ణాతుడైవుండవచ్చును గాక. రిచర్డ్ డాకిన్స్ లాంటి అకెడెమియా లో ఏ మాత్రమూ విలువలేని రచయితల పుస్తకాలను అనువదించుకుని అంతో ఇంతో పేరు సంపాదించి ఉండవచ్చును గాక. పురాణప్రలాపం అనబడే వరసలు తెలియని తాగుబోతు బాబాయి ప్రేలాపనలు లాంటి పుస్తకాలను జనానికి అందించడం ఒక ఉద్యమంగా తలపెట్టినవాడు అయిఉండవచ్చును గాక. పీ హెచ్ డీ లు చేసినా కనీసం ఒక చిన్నపాటి చెత్త సిద్ధాంతాన్నయినా ప్రతిపాదించి అకడెమియా ముందు ఉంచిన చరిత్ర అసలే లేకపోతే లేకపోనీ గాక విశ్వనాధుని సాహిత్యం మీద కాకుండా, రవి గారు చెప్పినట్లు గా ఆయన సాహిత్యం ప్రబోధించే "చాందస భావాల" మీద విమర్శ పేరుతో "అవ్యవస్థ, భట్రాజీయం" అని ఎందుకు రాయాలి? రాస్తే రాసుకోని, దానిని రావు గారు ప్రచురించడం లో అర్థం ఏమిటి? మొదటగా, ఇన్నయ్యగారి విమర్శ అశాస్త్రీయం. ఎందుకంటే విమర్శ అంతా అక్కసు కనపడుతుందే తప్ప, వ్యంగ్యం కోసం చేసిన వ్యర్థ ప్రయత్నం కనిపిస్తుందే తప్ప ఒక నిష్ణాతుడైన వ్యక్తి చెప్పదలచుకున్న అర్థవంతమైన ఆలోచన కనిపించదు. (ఈ పేరా వ్యక్తిగత దాడి అని అనకండి రావు గారు. మన ఇన్నయ్యగారు ఎలా మాట్లాడారో, నేనూ అలాగే మాట్లాడుతున్నా. అది జ్ఞానం, ఇది దాడి ఎలా అవుతాయి?)

Innaih studied Philosophy of Sciences. Philosophy of sciences question assumptions, foundations and implications of science. It deals with questions like what is a theory, what is an explanation, what is a law and what is a phenomenan. It questions every underlying principle. Logic and reason are its backbone. so Innaiah should be questioning theories like Religion, Capatalism, Marxism etc., What the heck is he doing with his non intellectual, adhoc criticisms on a writer? And why the heck is that being propagated? and How the heck does that help internet youth understand Viswanatha?

ఏది వ్యక్తిగత దాడి, ఏది కాదు అని అంత కూలంకషంగా ఆలోచించేదానికి ముందు చెయ్యల్సిన పని ఇంకోటి ఉంది. ఏది విమర్శ, ఏది కాదు? నాకు ఎయిరో డైనమిక్సు అసలు తెలియకపోయినా నేను నిర్భయం గా విమానాన్ని ఎక్కి తిరగాను. విమానాన్ని ఎక్కాలంటే ఎయిరోడైనమిక్సు తెలియనవసరంలేదు. కానీ కడుపునొప్పి వస్తే మత పెద్దలదగ్గరికి వెళ్తామా? డాక్టరు దగ్గరికి వెళ్తాం. వీటి రెండిటికీ మధ్య తేడా అర్థం అయితే ఎవరు దేన్ని ఎలా విమర్శించచ్చో పూర్తిగా అర్థం అవుతుంది.

రెండు వర్గాల రచయితలు ఉన్నారు. మొదటి రచయిత తాగుబోతు. జూదరి, స్త్రీలోలుడు. కానీ ఆయన అక్షరాలు నిప్పులు చిమ్ముతాయి. ఆయన ఎప్పుడూ తన బలహీనతలను తన రచనల్లో వినిపించలేదు. అలాంటి రచయితను తాగుబోతూ అనడం వ్యక్తిగత దాడి. నిజమే.

ఇంకో రచయిత ఉన్నాడు. తాగుబోతు. ముక్కోపి. కానీ ఆయన రచనలు విప్లవ భావాలతో మనిషిని ఊరిస్తాయి. నిజమైన రచయిత ఎవయినా భావాలు తన గుండెలను తాకకపోతే, మస్తిష్కంలో జాతర చేయకపోతే వాటిని అద్భుతం గా అక్షరబధ్ధం చేయలేడు. ఆయన మనసా వాచా నమ్మిన విప్లవభావాలే ఆయన రాతలు. అదే ఆయన ఐడెంటిటీ. విప్లవం, కమ్యూనిజం, మార్క్సిజం లు అసహ్యించుకోబడే అమెరికాలాంటి దేశంలో పుట్టి ఉంటే, ఆయన భావాలు పొలిటికల్ గా తప్పుడు భావాలు. మరి ఈయనను జూదరి, తాగుబోతు అని విమర్శించచవచ్చా?

ఇంకో రచయిత ఉన్నాడు. ఆయన "అహంకారి", సరే. "చాందసవాది". సరే. ఈయన భావాలన్నీ పాత చింతకాయ పచ్చడులు. అదీ సరే. "తిరోగమన వాది". అది కూడా సరే. ఆయన త్రికరణశుద్ధి గా నమ్మిన భావాలే, ఆచరించినవే ఆయన ఇడెంటిటీ. అవే ఆయన రచనల్లో ప్రతిఫలిస్తాయి. మరి ఇలాంటి వారిని విదూషకులు, జాక్ పాట్, భట్రాజులు, అవ్యవస్థ అని నిందించటం ఏ రకమైన విమర్శ? రచయితను విమర్శించాలంటే రచనలను విమర్శించాలి. రచయిత చెప్పే చాందసవాదాన్ని నిరసించాలంటే ఆ భావాలు ఏరకం గా తప్పయినవో శాస్త్రీయంగా నిరూపించాలి. ఈ రెండుకాకుండా విమర్శల పరమార్థం ఇంకేమయి ఉంటుంది? పోనీ విశ్వనాధుని పరిచయం చేద్దామనుకుంటే.. ఇదేనా పద్ధతి? మనమంతా రచనల్లో సౌందర్యానికి ఆకర్షితులౌతామా లేక అక్కసు చూపే వ్యాసాలకా?

దీనికి సమాధానం నేను చెబుతాను. విశ్వనాధుడు సాంప్రదాయ వాది. రాసేటప్పుడు చలసాని వారు పాపం ఏ ధ్యాసలో ఉన్నారో, ఎందుకు రాసారో మనకు తెలియదు. కానీ ఇలాంటివి ఇప్పుడు పైకి తేవడం లో ఆంతర్యం, విశ్వనాధుని మీద బురద చల్లడం, సంస్కృతి సంప్రదాయాలమీద బురద చల్లటంతో సమానం గా భావింపబడటం. సంప్రదాయం మీద బురద చల్లేది ఎవడైనా గౌరవనీయుడు గా మన సమాజంలో చెలామణీ కావడం. మనది అన్న ప్రతి దాన్ని గేలి చేయటం(గమనించాలి, ప్రశ్నించటం కాదు. గేలి చేయటం) ఇక్కడ దిగుమతి చేసుకున్న హేతువాదం. రవిగారూ, మీలాంటి ఆలోచనా పరులు దృష్టి సారించాల్సింది ఇలాంటి విషయాల్లో. ఎందుకని సంప్రదాయానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కటీ వెక్కిరించబడుతుంది? ఎందుకు ఇలాంటివి సమాజంలో జ్ఞానం గా చెలామణీ అవుతుంది. You don't need professors, university degrees or philosophies to answer that question. One needs to take a deep look, access one's own experiences and there you find answers.


మరి ఇలాంటివన్నీ రావు గారు తన బ్లాగులో ఎందుకు ప్రచురించడం? దీనికి సమాధానం నేనూ ఆలోచించాను. నేను మాట్లాడితే దాడి అవుతుంది కాబట్టి, చలసాని వారి మాటలను ఉపయోగించుకుంటాను. మిగతాది మీ ఊహకు వదిలేస్తాను(చలసాని గారికి క్షమాపణలతో)

"మనకు బుర్రంటూ ఒకటున్నాక దానికి కాస్త కాలక్షేపం, వినోదం, ఉల్లాసం కలిగించటానికి నట, విట, గాయక, రచయితల్లో ఓ విదూషక బృందం కూడా తప్పనిసరి. మరి ఈ దరిద్రులక్కూడా ఏవేనా కలర్ ఆశలు చూపకుంటే ఎలా?"

అదీ సంగతి. విశ్వనాధుడూ, సాహిత్యం, చలసాని, అంతర్జాల యువతా అంతా మాయ! మనకు బ్లాగు ఉంది. రాయడానికి ఏదయినా కావాలి. ఏ దారిన పోయే దానయ్య మీదో రాయి వేస్తే, వెటకారం చేస్తే చూసే వాడెవడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి.

అప్పుడే హిట్లూ, నాలాంటి తలబిరుసు వాళ్ళ కామెంట్లూ!

బ్లాగ్ హిట్ మయం ఇదం సర్వం!

అజ్ఞాత చెప్పారు...

@రవిగారూ,
చాలా చక్కగా, సహేతుకంగా ప్రశ్నించారు. నాకు చాలా ఆనందంగా వుంది. నేను సరిగ్గా రావుగారి దగ్గర నుండి ఇలాంటిది ఆశించాను, కానీ నిరాశే మిగిలింది.

విశ్వనాధవారిని విమర్శించిన వారిలో 90 శాతం వారి రచనలను చదవకుండా విమర్శించినవారే. అందుకు ప్రత్యక్ష నిదర్శనం పై వ్యాసకర్తే. వారికి హాహాహుహూ ఏ కధో విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు ఏదో తెలీదు.రామాయణ కల్పవృక్షం నవలో, కావ్యమో తెలీదు. ఆటువంటి వారు చేసే/రాసే రాతలు నా దృష్టిలో వ్యక్తిగత దూషణలే.

ఉదాహరణకి ఒకరు ఆరుద్ర గారి త్వమేవాహం చదవలేదు అనుకోండి, ఎవరివో మాటలు పట్టుకొని ఆ పుస్తకాన్నీ రచయితను తిడితే అది దూషణా లేక విమర్శా?

ఇక మీరు లేవనెత్తిన ప్రశ్నల గురించి. కొంచెం పెద్ద వ్యాఖ్య రాయాలి. త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను.

అభినందనలతో
సూర్యప్రకాషు

Kathi Mahesh Kumar చెప్పారు...

@యోగి: at last back to do more of your "poking around"! రవి గారి ప్రశ్నల్లోని సాధికారతను చూసి చర్చ గాడిలో పడిందనుకున్నాను. కానీ మొత్తానికి నువ్వొచ్చి మళ్ళీ శుష్కవాదంలోకి నెట్టేస్తున్నావు. కానివ్వు, you essentially do what you are good at. Please carry on.

చదువరి చెప్పారు...

రవి గారిదేమో చర్చా, యోగి గారిదేమో శుష్క వాదమా? భలే! ఆ లెక్కన, మహేష్, మీరు దాన్ని వ్యక్తిగత దాడి స్థాయికి దిగజారుస్తున్నారు.

కామేశ్వరరావు చెప్పారు...

రవిగారు,

"విశ్వనాథ వారి మీద ఇంత తీవ్ర విమర్శ ఎందుకు వస్తున్నది?" ఇది మంచి ప్రశ్న. దీనికి సమాధానం కాదు కానీ మరికొన్ని ప్రశ్నలు జతచేసి జవాబుని మిమ్మల్నే వెతుక్కోమంటాను, కాని ఇప్పుడు కాదు చివర్లో...
ముందు మీరిచ్చిన విశ్లేషణ, ఉదాహరణల గురించి.
"మొదటి వర్గం రచయితను "తాగుబోతు" అని సంబోధిస్తే - అది ఖచ్చితంగా వ్యక్తిగత దూషణ". తాగుబోతుని తాగుబోతు అనడం వ్యక్తిగత దూషణ ఎందుకవుతుంది? అతన్ని దరిద్రుడనో, ముష్టివాడనో అంటే వ్యక్తిగత దూషణే అవుతుంది. ముందా తేడని మీరు గ్రహించాలి. అయితే, ఆ రచయిత సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు అతన్ని తాగుబోతుతనాన్ని చెప్పి అతని రచనల్ని అంచనా వెయ్యడం తప్పు. అది సాహిత్య విమర్శ అనిపించుకోదు.
ఇక రెండవ వర్గం గురించి.
"తాగుబోతుతనం" ఎదుటివాళ్ళ ఆలోచనలని ప్రభావితం చెయ్యనప్పుడు, "అహంకారం" మాత్రం ఎలా చేస్తుందో నాకర్థం కాలేదు. కొంచెం వివరించాలి మీరు.
తర్వాత "ఛాందస వాదం", "తిరోగమన వాదం" గురించి. "ఛాందసవాదం" అంటే ఏమిటో, అది ఎందుకు చెడ్డదో నాకు తెలియదు. దాని గురించి కూడా మీరు వివరించాలి. "తిరోగమన వాదం" - ఇది ఒక వ్యక్తికి ఆపాదిస్తున్నప్పుడు, దానికి సరైన ఆధారాలుండాలి కదా? మడికట్టుకున్న వ్యక్తిని తిరోగమన వాది అనడం నాకైతే సమంజసంగా అనిపించడం లేదు.
"అయినంత మాత్రాన ఆ రచయిత (రచనల్లో, లేదా వ్యాఖ్యల్లో ఉన్న)భావజాల పరంపర సరి అయినదేనా?" - కావచ్చు, కాకపోవచ్చు. దీని గురించిన తప్పకుండా పరిశీలించవచ్చు. కాని అది ఎలా చెయ్యాలో మీరే ఆలోచించండి.
1. ముందు ఏది "సరి", ఏది "సరికాదు" అన్న విషయం తేలాలి.
2. అతని రచనల్లో కాని, వ్యాఖ్యల్లో కాని "సరికానిది" ఎత్తిచూపించాలి.
3. ఎందుకు సరికాదో వివరించాలి.
అవునా కాదా? ఇలాటి విశ్లేషణ ఈ రెండు వ్యాసాల్లోనూ నాకు అణుమాత్రం కనిపించలేదు.
"నిజ జీవితంలో ఓ మహిళా రచయితను "విషకీటకం" గా దూషించటం సరి అయినదేనా". సరికాదు. సరి అని నేననలేదే? ఈ వ్యాసంలో కూడా దానిగురించి లేదే? దీని ప్రస్తావన అసలెందుకు వచ్చింది?
నేను మరోసారి స్పష్టపరుస్తున్నాను. విశ్వనాథ విమర్శకి అతీతుడు అని నేనే మాత్రమూ అనడం లేదు. నేనంటున్నదల్లా, ఈ వ్యాసంలోనీ కిందటి వ్యాసంలోని నాకు కనిపించినది వ్యక్తి దూషణ తప్ప మరొకటి కాదని. ఎందుకో స్పష్టంగానే వివరించాను. మీరు దానికి ముందు ఒప్పుకుంటున్నారో లేదో చెప్పండి.
"ఇక్కడ కనిపించిన ఒకట్రెండు విమర్శల ఆధారం చేసుకుని, విశ్వనాథ విమర్శకులను వ్యక్తిగత దూషకులుగా పరిగణించటం కూడా ప్రశ్నార్థకం కాదంటారా?" ఇది కూడా నేనెప్పుడూ అనలేదు. నేను తప్పుపట్టింది కచ్చితంగా ఈ రెండు వ్యాసాల గురించే. ఈ వ్యాసల పరిథిని దాటి మీరే ఆలోచిస్తున్నారు.
" విశ్వనాథ వారి మీద అసూయతో, ద్వేషంతో విమర్శలు చేస్తున్నారు అని నిరూపితమైతే ఈ చర్చే అనవసరం." ఇది ఎలా నిరూపించగలమో చెప్పండి?
ఇప్పుడు మొదటి ప్రశ్నకి వద్దాం. "విశ్వనాథ వారి మీద ఇంత తీవ్ర విమర్శ ఎందుకు వస్తున్నది?" దీనికి సమాధానం నాకు తెలీదు. నేనర్థం చేసుకున్నంతలో, విశ్వనాథ భావజాలం మీద వ్యతిరేకత వల్లనే ఇంత తీవ్ర విమర్శ వస్తోంది. అయితే, విశ్వనాథ భావజాలం ఏమిటి? అతను రామాయణం రాసారు. వాల్మీకంలో లేని విషయాలు, తాను స్వంతంగా జొప్పించిన వాటిలో "తిరోగమనాన్ని" ప్రేరేపించేవి ఏవైనా ఉన్నాయా? నాకు తెలిసినంత వరకూ లేవు. అంచేత ఈ విమర్శించే వారి దృష్టిలో అసలు రామాయణాన్ని తిరిగి రాయడమే "తిరోగమనం" అయ్యుండాలి. దీనితో మీరు ఏకీభవిస్తారా? పోని అలా తిరిగి రామాయణాన్ని ఈ కాలంలో ఎంతమంది రాయలేదు? మరి అంతమందినీ ఎందుకింత తీవ్రంగా విమర్శించటం లేదు? నాకు తట్టిన జవాబు, మిగతా రామాయణాలు విశ్వనాథ రామాయణం అంత ప్రసిద్ధిని పొందలేదు కనక. ఎందుకు పొందలేదు, విశ్వనాథదే ఎందుకు పొందింది? దీనికి ఈ విమర్శించే వాళ్ళిస్తున్న జవాబు విశ్వనాథ "భట్రాజులని" పోగేసుకొని తన రామాయణానికి ప్రచారం ఇచ్చుకున్నారు కాబట్టి! పోనీ తనింతలా కష్టపడి "భట్రాజులని" పోగేసుకొని ప్రచారం వల్ల సాధించినదేవిటి? "జ్ఞానపీఠ". మరి ఆ జ్ఞానపీఠం వల్ల వచ్చిన సొమ్మంతా తన సొంతానికి వాడుకున్నారా విశ్వనాథ? లేదు. ఇందులో ఈ "భట్రాజులకి" ఏవిటి లాభం? నాకు తెలీదు.
మరి మీరేమంటారు?
మీరు ఈ విషయాలగురించి మరోసారి ప్రతిస్పందించే ముందు మీకొక విన్నపం. ఈ వ్యాసాల్లో ఉన్నది వ్యక్తి దూషణే అని మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో సూటిగా చెప్పండి. ఒప్పుకోకపోతే, నేనింతక ముందు టపాల్లో అది వ్యక్తిగత దూషాణే అనడానికిచ్చిన వివరణనలో తప్పేమిటో చెప్పండి. అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పండి. అలా చెయ్యలేనప్పుడు, అయినా ఇవి వ్యక్తిగత దూషణలని మీరెందుకు ఒప్పుకోలేకపోతున్నారో ఆలోచించండి. తెలిస్తే, చెప్పాలనిపిస్తే ఇక్కడ చెప్పండి.

Kathi Mahesh Kumar చెప్పారు...

@చదువరి: సావకాశంగా చర్చ కావాలనుకునేవారు ఎకసెక్కాలూ,ఎద్దేవాలూ,అవహేళనలూ చేస్తూ ఎత్తిపొడిచే కార్యక్రమం చెయ్యక తమ వాదనను వినిపిస్తారు. యోగికీ రవికీ అదే తేడా.

అజ్ఞాత చెప్పారు...

భైరవభట్ల గారు,
మీకు చాలా సాధికారికంగా సమాధానం చెప్పాలంటే ఇప్పుడు విశ్వనాథ వారి రచనలు అన్నీ చదవాలి. వారి గురించి తెలిసి ఉండాలి. అది ప్రస్తుతం సాధ్యం కాని పని.

ఇక మీరు ఈ వ్యాసం, ఇంతకు ముందు వ్యాసం, విశ్వనాథ వారి రామాయణం ... ఈ పరిధిలో ఆలోచిస్తున్నారు. ఈ విషయం పై నాకు కొన్ని అనుమానాలున్నాయి, ఈ విమర్శల scope ఇంత చిన్నది అని నేను భావించడం లేదు.

సరే, విషయానికి వద్దాం.

"ఈ వ్యాసాల్లో ఉన్నది వ్యక్తి దూషణే అని మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో సూటిగా చెప్పండి. "

ఎవరైనా అనవసరంగా వ్యక్తి దూషణకు ఎందుకు పాల్పడుతారో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా retort ఇవ్వడానికో, ఆయన వల్ల తాము బాధపడ్డామని చెప్పడానికో తెలుపుతారు. ఇవి కాకుండా ఈర్ష్యా, ద్వేషాలే అయితే, దానికి ఖచ్చితంగా కారణం కావాలి.

ఉదాహరణకు : రామాయణ కల్పవృక్షం అని ఒక కావ్యం రాస్తే, ఓ మహిళ రామాయణ విషవృక్షం రాసింది. ఆయన మనోభావాలు దెబ్బ తిని తీవ్రంగా విమర్శించాడు.

ఇక్కడ అలాంటి విషయాలేమీ లేవే? చలసాని కి విశ్వనాథకు మధ్య ఏ మనస్పర్థలు లేవే? (ఉన్నట్టు మనకు తెలియదు). ఇప్పుడు రెండు దార్లు. ఏ రకమైన మనస్పర్థలు లేవు కాబట్టి, ఈర్ష్య, ద్వేషం అని conclude అవటం ఒక దారి అయితే, చలసాని వారికి విశ్వనాథ వారి భావజాలం నచ్చలేదు అన్నది ఇంకొక దారి.

మీరంటున్నదేమంటే,

"అతను రామాయణం రాసారు. వాల్మీకంలో లేని విషయాలు, తాను స్వంతంగా జొప్పించిన వాటిలో "తిరోగమనాన్ని" ప్రేరేపించేవి ఏవైనా ఉన్నాయా? నాకు తెలిసినంత వరకూ లేవు. అంచేత ఈ విమర్శించే వారి దృష్టిలో అసలు రామాయణాన్ని తిరిగి రాయడమే "తిరోగమనం" అయ్యుండాలి. దీనితో మీరు ఏకీభవిస్తారా? పోని అలా తిరిగి రామాయణాన్ని ఈ కాలంలో ఎంతమంది రాయలేదు? మరి అంతమందినీ ఎందుకింత తీవ్రంగా విమర్శించటం లేదు? నాకు తట్టిన జవాబు, మిగతా రామాయణాలు విశ్వనాథ రామాయణం అంత ప్రసిద్ధిని పొందలేదు కనక. ఎందుకు పొందలేదు, విశ్వనాథదే ఎందుకు పొందింది? దీనికి ఈ విమర్శించే వాళ్ళిస్తున్న జవాబు విశ్వనాథ "భట్రాజులని" పోగేసుకొని తన రామాయణానికి ప్రచారం ఇచ్చుకున్నారు కాబట్టి! పోనీ తనింతలా కష్టపడి "భట్రాజులని" పోగేసుకొని ప్రచారం వల్ల సాధించినదేవిటి? "జ్ఞానపీఠ". మరి ఆ జ్ఞానపీఠం వల్ల వచ్చిన సొమ్మంతా తన సొంతానికి వాడుకున్నారా విశ్వనాథ? లేదు. ఇందులో ఈ "భట్రాజులకి" ఏవిటి లాభం? నాకు తెలీదు."

ఇక్కడ ఓ విషయం చెప్పాలి మీకు. beleive it or not, విశ్వనాథ వారి రామాయణం గురించి, విమర్శకులకు దానిపైనే గురి అన్న కోణం లో నేను ఆలోచించలేదు. మీరు చెప్పిన తిరోగమన సిద్ధాంతంతో నేను ఏకీభవించను. విశ్వనాథ వారు రాసిన రామాయణం వల్ల, ఆయన స్థాయిని అందుకోలేక ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయి, విమర్శలు గుప్పించటం అన్న కోణం లో నేను ఆలోచించలేదు, నాకు ఆ కారణం సబబని అనిపించట్లేదు కూడా. ఎందుకు అనిపించట్లేదు అంటే, నా వద్ద సమాధానం లేదు.

ఇక సబబు కారణాలేవి? చలసాని, ఇన్నయ్య, శ్రీశ్రీ, మార్క్సిస్టులు, కమ్యూనిజం పై మొగ్గిన వారు (మీకు తెలిసిందే). కమ్యూనిష్ట్ ల భావావేశం మీకు తెలిసినదే. విశ్వనాథ వారు సంప్రదాయ వాది. రెంటికీ చుక్కెదురు. ఇందువల్ల విమర్శలు వచ్చి ఉండవచ్చునని నా ఆలోచన.

దీనికి వ్యాసాల్లో నేను గమనించిన విషయాలు ఉటంకిస్తాను.

"మన చరిత్రకారులు చరిత్రను సరిగా రాయలేదనీ, రాసిందంతా తప్పుల కుప్ప అనీ విశ్వనాధ వారు తమకు మాత్రం దైవానుగ్రహంతో లభ్యమైన దివ్య దృష్టి వల్ల కనుగొన్నారు. కనుక సదరు చరిత్రల్లోని తప్పులన్నింటినీ తిరుపతి వెళ్ళొచ్చిన గుండులా స్వచ్ఛంగా సవరించి బ్రహ్మణాధిక్యతనూ, బ్రాహ్మణేతరుల "నీచ" త్వాన్నీ సవివరంగా వర్ణిస్తూ, తాము కలల్లో కనుగొన్న....."

బ్రాహ్మణేతరుల "నీచ"త్వం అని ఉటంకించారక్కడ. అంటే విశ్వనాథ వారి రచనల్లో ఓ చోట ఆ విషయం కనుగొని, ఆ చాందస భావాన్ని ఆక్షేపిస్తూ, విమర్శించి ఉండవచ్చుగా? ఆ విషయం కూలంకషంగా చర్చించి, నిరూపించలేదు అని అంటారా? దానికి రచయిత కారణాలు రచయితకు ఉండవచ్చు.

""విశ్వనాథ వారి పురాణ వైర గ్రంథమాలా శైలి అద్భుతం. అంతగొప్పగా వాల్మీకి కూడా రాయలేదని వారి శిష్యుల ఉవాచ, పైచెప్పిన వాగునే తీసుకుందాం. ఆవాగు అక్కడనే ఎందుకున్నదీ బల్లగుద్ది చెప్పాక, అసలు వాగు అననేమి? అదెట్లు పుట్టును... అనే శాస్త్ర చర్చ మొదలెడతారు, శ్రీవారు. "అక్కడెక్కడో కొండలుండెను. వాటిపై మంచు పేరుకొనును. అది కరిగి నీరుగా ప్రవహించును. ఆ పిల్ల వాగులు అలా, అలా, అలా, అలా, రాళ్ళను ఒరుసుకుని, వాటిని అరగదీయుచూ ప్రవహించి పెద్దవై, పెద్దవై, మరింత పెద్దవై వాగుగా మారును... అంటూ ఓపికను బట్టి ఆరు... లేదా పదారు పేజీల పొడుగునా వివరిస్తారు, విశ్వనాథ గారు.

"అంతగొప్ప ప్రకృతి రహస్యాన్ని ఇంత సులువుగా, మామిడి కాయలోని రసం పిండి నోరు పగలదీసి సరాసరి గొంతులో పోసినంత చక్కగా మరే కవి అయినా చెప్పగలడా?""

పైన చెప్పినది కువిమర్శే నంటారా? ఇందులో ఈర్ష్య, అసూయ ప్రతిబింబిస్తున్నాయంటారా? కనిపిస్తున్నాయి అంటే, చెప్పవలసిందేమీ లేదు.

""హాహా హిహి హుహు"లోనో మరెందులోనో గానీ ఆంగ్ల భాష విషయంలో ఆయన విమర్శలు మరీ హాస్యాస్పదంగా కనుపించాయి.""

ఎందుకు కనిపించాయో చెప్పలేదు కాబట్టి - చలసాని వారికి అసూయ అని తీర్మానిస్తారా?

"...విశ్వనాథ వారి ఫ్యూడల్ సంస్కృతీ ప్రతీకలైన సాహిత్యాన్ని..."

రామాయణం ఫ్యూడల్ సంస్కృతి ని ప్రతిబింబించే గ్రంథం అని ప్రముఖ కమ్యూనిష్ట్ రంగనాయకమ్మ చెప్పిన విషయమే.

ఇక తిరోగమనం, చాందస వాదం గురించి కూలంకషంగా చెప్పాలంటే, ఆయన రచనలు కొన్ని "మాకళీ దుర్గం లో కుక్క",వంటి కథలు "వేయి పడగలు" పుస్తకం లో కొన్ని సన్నివేశాలు, "హాహా హీహీ హూహూ" ఇవన్నీ ఉటంకిస్తూ, ఓ గొప్ప సిద్ధాంత వ్యాసం రాయాల్సి ఉంటుంది. అంతా రాసినా, చివరకు వచ్చేసరికి, అవి విమర్శకుడి వ్యక్తిగత అభిప్రాయాలనో, ద్వేషం అనో వస్తుంది.

విశ్వనాథ వారి మీద వ్యక్తిగత దూషణలు కాకపోయి ఉండవచ్చు అని నాకు అనిపించిన కారణాలలో ఇవి కొన్ని.

కామేశ్వరరావు చెప్పారు...

రవిగారు,
ప్రస్తుతం తొందరలో ఉన్నాను. వచ్చే మూడూ రోజులూ జాలాన్ని చూడలేను. కాబట్టి మీకు వివరంగా సమాధానం ఇవ్వలేనిప్పుడు.
All I can say for now is, you are giving too much of benefit of doubt to the author(s) which I don't find as reasonable.
"ఎవరైనా అనవసరంగా వ్యక్తి దూషణకు ఎందుకు పాల్పడుతారో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా రెతొర్త్ ఇవ్వడానికో, ఆయన వల్ల తాము బాధపడ్డామని చెప్పడానికో తెలుపుతారు. ఇవి కాకుండా ఈర్ష్యా, ద్వేషాలే అయితే, దానికి ఖచ్చితంగా కారణం కావాలి."
ఇక్కడకూడా ఇది వ్యక్తి దూషణ అవునో కాదో ముందు చెప్పకుండా, దానికి ఎందుకు పాల్పడతారూ అన్న ప్రశ్నని వేస్తున్నారు. ఇక్కడ వ్యక్తిగత దూషణని చేస్తూ వ్యాఖ్యలు రాసిన వాళ్ళని మీరు సమర్థిస్తారా చెప్పండి? కేవలం ఈర్ష్య వల్లనే వాళ్ళలా రాసారంటారా? ద్వేషానికి వెనక కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అంచేత ఏదో కారణం వల్ల వచ్చిన ద్వేషంతో వ్యక్తి దూషణ చేస్తే దాన్ని మీరు సమర్థిస్తారా?
నేను చెప్పగలిగేదల్లా, మళ్ళీ మీరు వ్యాసాలనీ, నా వ్యాఖ్యలనీ, మీ వ్యాఖ్యలనీ ఒక నెల్లాళ్ళ తర్వాత తిరిగి చదవండి, ఆలోచించండి. అప్పటికీ మీకు ఈ వ్యాసాలు సమంజసమైనవే అనిపిస్తే, ఇక వాదించడానికి ఏమీ ఉండదు :-)

అజ్ఞాత చెప్పారు...

భైరవభట్ల గారు,

మీ సూచనను గౌరవిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. :-)

yogirk చెప్పారు...

Katti,

I am in no mood to indulge in a dailogue with dimwits, lunatics and retards. I can not allow myself to grant the attention to people like you. I am over it. I have nothing to do with you.

Your intervention here was uncalled for, yet you intervened. So listen this for one last time. Yes, When I feeli like, I will poke around and do whatever I want to. If you peddle your commonsense crap, and if you come anywhere near me, you'll be nailed.

Katti - my dear retard, you are ignoored. Period.

అజ్ఞాత చెప్పారు...

రావు గారు,
ఈసారి తెలివిగా ఇంతకు మునుపు అందరూ హేతువాది ఇన్నయ్య విశ్వనాథ గారిని విమర్శించటం ఎమిటి అంటె దానికి సాహితి వేత్త్త చలసాని విమర్శను ప్రచూరించి అందరికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తునట్లు అనిపిస్తునాది . I appreciate the way you are supporting Mr. Innaiah.

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

"సావకాశంగా చర్చ కావాలనుకునేవారు ఎకసెక్కాలూ,ఎద్దేవాలూ,అవహేళనలూ చేస్తూ ఎత్తిపొడిచే కార్యక్రమం చెయ్యక తమ వాదనను వినిపిస్తారు. యోగికీ రవికీ అదే తేడా."

@ మహేష్ గారూ
మీరు చర్చ కావాలనుకునే వారి గురించి మీ అభిప్రాయం చెప్పేస్తుంటే, మీరు మొన్న రాసిన "రామసేన సేవ" గుర్తొచ్చింది... అందులో అవకాశం తీసుకుని మరీ అవసరం లేకపోయినా ఎకసెక్కం, ఎద్దేవా, అవహేళణ చేసినట్టు అనిపించేసింది... అది కనీసం వ్యక్తిని కూడా కాదు, ఆ ఘటన పేరు చెప్పి ఒక సమూహన్ని ఎద్దేవా చేసారు. అసలు మీ రచనా శైలిలో అవి లేకుండా ఉండటం కష్టం. యోగిని రవిగారితో పోల్చి చర్చ ఎలా ఉండాలో చెప్పేస్తున్నారు కాబట్టి, అదే రవి గారితో మిమ్మల్ని పోల్చి చూస్తే మీరు చేసిన వ్యాఖ్య మీకే వర్తిస్తుంది...

కన్నగాడు చెప్పారు...

ఇక్కడ వదనలాడే వారంతా ఎన్ని విశ్వనాథ గారి పుస్తకాలు ఎన్ని చదివారో నాకైతే తెలీదు కాని నేను మాత్రం ఓకే ఒక పుస్తకం చదివాను, అదీ ఈ మధ్యనే ఆ పుస్తక ప్రస్తావన ఈ వ్యాఖ్యలలో విమర్శనాత్మకంగా వచ్చింది కాబట్టి నేను స్పందిస్తున్నాను, నా వ్యాఖ్య పరిధి ఆ పుస్తకం మేరకే. అది 'విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు'
ఈ పుస్తకంలో ఓ నలభై యాభై పుటల తర్వాత మొత్తంగా ఇంగ్లీష్ భాషాను విమర్శనే ప్రధానంగా ఉంటుంది, కాని అది సద్విమర్శే, మన దేవనాగరి భాషలలో ఉన్న సౌలభ్యాలతో పోల్చినప్పుడు ఇంగ్లీష్ స్థాయి ఏపాటిదో అమ్దరము ఎరిగినదే అయినా వేలం వెర్రిగా ఎందుకు ఎగబడుతున్నాం అని అడగాడానికి విమర్శ చేసారు. నూటికి నూరుపాళ్లు అది సద్విమర్శే. (వ్యాఖ్యపై విమర్శకు సిద్దమై ధూర్బిణీ సహితంగా విచ్చేసినవారికి 'వేలం వెర్రీ' అనే మాటను వాడుకోగలరేమో! నా ఉద్దేశ్యం ప్రస్తుత కాలమానం ప్రకారం ఇంగ్లీష్ నేర్చుకోవాలి కాని మాతృభాషను గాలికొదిలేసి కాదు.)
ఇక ఈ పుస్తకంలో కేవలం విమర్శ చేసివదిలేయకుండా ఒక భాష నేర్చుకోవాలంటే ఏంకావాలి ఏలా నేర్చుకోవాలి అనేదానిని చక్కగా వివరించారు. అది చదివాక నా ఇంగ్లీష్ ఎలా అభివృధి చేసుకోవాలో అర్ధమైంది. నేనేదో(నాలా ప్రస్తుత యువతలో సగం మంది) గత పదిహేను సంవత్సరాలుగా ఇంగ్లీష్ చూసి చూసి చూసి మాట్లాడుతున్నాను తప్ప నాకు ఇంగ్లీష్ వచ్చి కాదని అర్థమైంది.

ఇక ఎవరైన ఆ పుస్తకం కావాలంటే నాకో జాబు రాయండి, స్కాన్ చేసి ఉంచిన పుస్తకం ఉంది పంపుతాను.
sreekanthrao.t@gmail.com

Kathi Mahesh Kumar చెప్పారు...

@ఏకాంతపు దిలీప్: కేవలం argument కోసం కాకపోతే మీకు టపాకూ వ్యాఖ్యకూ తేడా తెలీదా...ఇన్నాళ్ళుగా బ్లాగుల్లో ఉన్నారు.టపా నా వ్యక్తిగత అభిప్రాయం. అది సాధికారంగా చెప్పే అధికారం, ఎంత సృజనాత్మకంగానైనా విరచించే స్వతంత్ర్యం ఉంటాయి. వ్యాఖ్య ఇతరులతో చర్చించే ప్రక్రియ. దానికీ దీనికీ ఉద్దేశాల్లోనూ,విషయవస్తువులోనూ తేడా ఉందిగనక భాషా సంబోధనల్లో తేడా ఉంటుంది, ఉండాలి.

యోగి ప్రత్యక్షంగా వ్యక్తిగత ధూషణ చేసినాకూడా కనిపించని మీకు నా టపాలో అభ్యంతరం కనిపించిందా...నా వ్యాఖ్యలు అసంబద్ధంగా అనిపిస్తున్నాయా...try to think like a human being ఆ తరువాత భావజాలం రంగుటద్ధాంల్లోంచీ ప్రపంచాన్ని (ముఖ్యంగా నన్ను) చూడటం మొదలెట్టండి. లేకపోతే మీకు మిగిలేది భావజాలమేతప్ప భావుకత కాదు. This is my sincere advice.

అజ్ఞాత చెప్పారు...

దిలీప్ గారు, మహేష్ గారు, యోగి గారు, ఈ గొడవకు కారణం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నేనయితే, దయ చేసి ఆ విషయం వదిలేసి, కాస్త అసలు విషయానికి వద్దాం. ఇది నా proposal. ఏమంటారు?

yogirk చెప్పారు...

రవి గారు,

నేను అసలు విషయం గురించి మాట్లాడటానికే మొదటి వ్యాఖ్య చేసింది. నాకు ఇప్పుడు తెలుగు బ్లాగు లేదు, ఈ వ్యాఖ్య ద్వారా సాధించాలనుకున్నదీ ఏమీ లేదు. నా మొదటి వ్యాఖ్యలో వ్యంగ్యం అనాలోచితం కాదు. ఇన్నయ్య గారు, చలసాని గారు వ్యంగ్య రచనలు రాసినప్పుడు జ్ఞానం గా పరిగణించే వారికి నా వ్యాఖ్యలు గేలి చేసేవి, వ్యక్తిగత దాడి అనే హక్కు లేదు. అది శాస్త్రీయం అయితే ఇదీ శాస్త్రీయమే. అది అవహేళన అయితే ఇదీ అవహేళనే. ఈ రెండింటి స్వభావం ఒక్కటే.

సరే మీరన్నట్లు అసలు విషయానికి వద్దం. నా మొదటి వ్యాఖ్య చదివి దానికి స్పందించండి(మీరు స్పందించాలనుకుంటే) - ఇక మీదట ఈ thread తో సంబంధంలేని విషయాలకు నేను స్పందించను లెండి.

అసలు విషయం కోసం ఎదురుచేస్తూ..
యోగి

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

@ మహేష్ గారూ
నేను యోగి గురించి రాయలేదు. నేను ఇక్కడ యోగిని, మిమ్మల్ని పక్క పక్కన పెట్టి ఒకరికి వత్తాసు పలకడం లేదు. కాబట్టి మీరు రెండో పేరాలో నాగురించి ప్రకటించినది నేను స్వీకరించడం లేదు. కేవలం మీ గురించి మాత్రమే రాసాను అని గ్రహించగలరు...

మీ బ్లాగు నాకు చాలా కాలం నుండి పరిచయం ఉంది కాబట్టి, మీ వ్యాఖ్యని చూసాక అది మీకు కూడా ఆపాదించవచ్చు అని మాత్రమే చెప్పాను. ఇక పోతే టపాకి, వ్యాఖ్యలకి తేడా ఎమీ లేదు. రెండూ భావ ప్రకటనే. వ్యాఖ్యలు ముదిరి టపాలైన సంధర్భాలు బ్లాగుల్లోనే కాదు, అన్ని రకాల మాధ్యమాల్లో జరుగుతున్నదే. మీరు వాడితే సృజనాత్మకత,చర్చ, వేరే వాళ్ళు వాడితే అవహేళణ, రచ్చ అనే భావనలో ఉన్నారేమో ఒకసారి ఆలోచించుకోండి... ఏమి వ్యక్తపరుస్తున్నాము అనేది ఎంత ప్రాముఖ్యమో ఎలా వ్యక్తపరుస్తున్నాము అనేదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది అని మీకు తెలుసు అనుకుంటున్నాను...

మిమ్మల్ని నేను అర్ధం చేసుకోలేదు అనే అపోహలో ఉంటే దయచేసి బయటకి రండి.మీ బ్లాగులో మీరు లేవనెత్తిన చాలా విషయాలు, ప్రకటించిన ఆలోచనలు పది మందినీ ఆలోచింపచేసాయి.ఇంతకుముందు ఆయా విషయాల మీద ఆలోచించని వాళ్ళు కూడా ఆలోచించడం మొదలు పెట్టారు అని చెప్పగలను.ఆ విధంగా మీరంటే నాకు గౌరవం ఉంది. వ్యక్తపరిచే అభిప్రాయాల్లో తేడా ఉంటే చర్చించవచ్చు కానీ, వ్యక్తపరిచే విధానంలోనే తేడా ఉంటే చర్చించాలని కూడా అనిపించదు. మీరు వ్యక్తపరిచే విధానాన్ని ప్రశ్నిస్తున్నాను. ఒక పది మంది ఒక విషయం మీద చర్చించ దలచినప్పుడు, ఆ చర్చ సక్రమంగా సాగాలనుకుంటే కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అలా అంగీకారమైనప్పుడే ఎదుటి వాడు చెప్పేది వినబుద్ధి అవుతుంది, ఫలితం నెరవేరుతుంది. అలా కాకుండా మీ సృజనాత్మకత మీరు వాడుకుంటాను అంటే మీ ఇష్టం, చర్చని మీలాంటి వాళ్ళనుండి మాత్రమే ఆశించండి. మిగిలిన వాళ్ళు వారి సృజనాత్మకతని ఉపయోగిస్తారు...

ఇంక సెలవు...

@ రవి గారూ
మీరు దేనికీ కారణం కాదు. పైన మీరు చేసిన మరో మంచి వ్యాఖ్యకి నెనర్లు.

cbrao చెప్పారు...

@ రవి: ఇన్నయ్య గారు హేతువాది, కమ్యూనిస్ట్ కారు. చలసాని గారు తొలుత కమ్యూనిస్ట్ భావాలను విశ్వసించినవారే. హైదరాబాద్, కోఠీ, బడీ చౌడీ లోని హేమంత్ మార్కెట్(?) లోని పుస్తకాల దుకాణంలో తరచుగా కలుస్తుండేవాళ్లము అప్పట్లో (1971-1977). ఆ దుకాణం లో ఎక్కువగా లభించేవి కమ్యూనిస్ట్ భావజాల పత్రికలు, పుస్తకాలు. ఈనాడు లో పనిచేస్తూ పెట్టుబడిదారుల వర్గంలో చేరాడని విమర్శించిన కమ్యూనిస్ట్లే, తమ పిల్లలకు ఈనాడులో ఉద్యోగమిప్పించమని చలసానిని అభ్యర్ధించేవారు. తన షష్టిపూర్తి సందర్భంగా ప్రముఖ రచయితలకు తమ నివాసం (జూబిలీ హిల్స్) లో విందు ఇచ్చారు. చలసాని గారు నాకు వ్యక్తిగత మిత్రుడవటంతో నేనూ ఆ విందుకు హాజరయ్యాను. అక్కడే కథకులు కారామాస్టారు వగైరా ప్రముఖులను మొదటిసారి చూడటం జరిగింది. కమ్యూనిస్ట్లను నిరసిస్తూ "ఇలా మిగిలేం" (1993) అనే పుస్తకం రాసారు. అయినా, ఆయన తమ వాడేనని కమ్యూనిస్ట్లు భావిస్తారు.చలసాని గారి వర్ధంతికి పెద్ద సంఖ్యలో కమ్యూనిస్ట్లు హాజరయ్యారు.

విశ్వనాధవారిపై ఇన్నయ్య, చలసాని గార్ల విమర్శలను కేవలం వారు ఉదహరించిన రచనలే కాకుండా విస్త్రుత తెరపట్టా పై చూడాలి. విశ్వనాధ చేతిలో జాషువా అవమానం, విశ్వనాధ వారి మడి, అంటరాని తనం ఇంకా తమ రచనలలో చూపే బ్రాహ్మణేతర నీచత్వం ఈ విమర్శకులను తమదైన హాస్య, వ్యంగ్య ధోరణిలో స్పందించేలా చేశాయనిపిస్తుంది. నిజానికి విశ్వనాధవారు చేసిన వ్యక్తి దూషణలకు వీరు స్పందించిన విధానము ఆ కాలానికి సరిపోయింది. విశ్వనాధవారు ఈ రోజున జాషువాను అలా అవమానిస్తే, స్పందన వేరే విధంగా వుంటుందని మీకు తెలుసు కదా!

అజ్ఞాత చెప్పారు...

యోగి గారు :
"బ్లాగ్ హిట్ మయం ఇదం సర్వం!"

ఎవరైనా బ్లాగు ఎందుకు రాస్తారు? కాస్తో కూస్తో గుర్తింపు కోసం, తన ఆలోచనలు పంచుకోవటం, ఇతరుల ప్రతిస్పందన కోసం. బ్లాగు అన్న విషయంపై వ్యక్తిగతంగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. బ్లాగులో ఏది రాయాలి, ఏది రాయకూడదు అన్నది పూర్తిగా బ్లాగు అధికారికే సొంతం. ఇది మీరు కానీ నేను కానీ చెప్పకూడదు.ఇది ఒక public forum అని నేను ఒప్పుకోను. హిట్ల కోసం రాసారు అంటే, ప్రతిస్పందించకుండా ఊరుకుంటే చాలు. (ఇది నేను నమ్మిన సూత్రం)

ఈ వ్యాసాలపై నా ప్రతిస్పందనకు కారణాలు.

చాలాకాలం క్రితం ప్రవీణ్ గార్లపాటి ఓ సినిమా పరిచయం చేశారు. ఆ సమీక్ష చదవండి.

రెండవ కారణం : వర్ణ వివక్షత నా దృష్టిలో అమానుషం. వర్ణ వివక్షత ను కొమ్ముకాచే వాదాన్ని, వారిని ఎంత చిన్న పరిమాణంలో అయినా సరే. నేను అంగీకరించలేను. (ఇది పూర్తిగా నా వ్యక్తిగతం.)

ఇతర కారణాలు ఇక్కడ వద్దు.

"కానీ ఇలాంటివి ఇప్పుడు పైకి తేవడం లో ఆంతర్యం, విశ్వనాధుని మీద బురద చల్లడం, సంస్కృతి సంప్రదాయాలమీద బురద చల్లటంతో సమానం గా భావింపబడటం. సంప్రదాయం మీద బురద చల్లేది ఎవడైనా గౌరవనీయుడు గా మన సమాజంలో చెలామణీ కావడం. మనది అన్న ప్రతి దాన్ని గేలి చేయటం(గమనించాలి, ప్రశ్నించటం కాదు. గేలి చేయటం) ఇక్కడ దిగుమతి చేసుకున్న హేతువాదం."

శ్రీశ్రీ గారు కూడా విశ్వనాథను విమర్శించారు కదా. ఆయనా ఇదే కోవకు చెందినాయన అంటారా? ఇలా generalization చేయడం కరెక్టేనంటారా? There is an element of doubt in your opinion.That which is real will survive, whether it's tradition or modern(rationalization).It does not need any prop.

ఇతర సమాధానాలు భాస్కర రావు గారే చెప్పాలి.

అజ్ఞాత చెప్పారు...

పైన ఓ విషయం చెప్పడం మరిచాను. ఏ విషయమైనా ఒక conclusion కు వచ్చే ముందు అనేక రకాలుగా పరిశీలించాలి అనే కారణంతో ఆ సినిమా సమీక్షను ఉదహరించడం జరిగింది.

భాస్కర రావు గారు :విశేషాలు బాగున్నాయి. ఒక చిన్న అభ్యర్థన. శ్రీశ్రీ గారి విమర్శ ఎక్కడైనా దొరుకుతుందా?

cbrao చెప్పారు...

@ యోగి:
"విశ్వనాధుడూ, సాహిత్యం, చలసాని, అంతర్జాల యువతా అంతా మాయ! మనకు బ్లాగు ఉంది. రాయడానికి ఏదయినా కావాలి. ఏ దారిన పోయే దానయ్య మీదో రాయి వేస్తే, వెటకారం చేస్తే చూసే వాడెవడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. అప్పుడే హిట్లూ, నాలాంటి తలబిరుసు వాళ్ళ కామెంట్లూ! బ్లాగ్ హిట్ మయం ఇదం సర్వం! " - ఏ రామబాణమో వేస్తారనుకుంటే మంచి యోగ్యతా పత్రాన్నే ఇచ్చారు కదా. నాకు ఏ దురుద్దేశమూ ఆపాదించకుండా, కేవలం హిట్ల కోసమే విమర్శలు ప్రచురిస్తున్నానని సరిపుచ్చినందుకు నెనర్లు. నేను హిట్ల కోసం ఈ విమర్శలు ప్రచురిస్తే, మీరు ఇంత సుదీర్ఘ ఉత్తరం ఏమి ప్రయోజనాన్ని ఆశించి వ్రాశారు? దీప్తిధారను విమర్శించి పేరు తెచ్చుకుందామని, వ్రాశారని నేను అనవచ్చునా?
ఈ పేరు వలన మీ కెంత ప్రయోజనముందో, దీప్తిధారకు హిట్లు వచ్చినా అంతే ప్రయోజనము. దీప్తిధారలో ఎలాంటి వ్యాపార ప్రకటనలు ఉండవని మీరు గమనించే ఉంటారు. పేరుకోసం మీరు శ్రమ తీసుకొని అంత సుదీర్ఘ జాబు రాయలేదని నేను నమ్ముతాను. ఈ విమర్శల ద్వారా మీకు తెలియని విశ్వనాధవారి రచనల దోషాలు,భావజాలాలలోని తిరోగమన వాదాన్ని, విమర్శకులు కేంద్రీకరించిన విషయం మీకు తట్టలేదా? ఇది కేవలం హిట్లకై ప్రచురించిన విమర్శలవలే కనిపిస్తున్నవా? యోగి, విమర్శకుల నాడి పట్టుకోవడంలో మీరు విఫలమయ్యారు. విమర్శలు ఎందుకు ప్రచురించటము? ప్రశంసల జల్లులే చదివి అదే విశ్వనాధవారి లోకమనుకుంటే వారి తత్వము, రచనల స్వరూప స్వభావాలెలా బోధపడుతాయి? ప్రశంసలే కాని విమర్శలు ప్రచురించరాదని మీ భావమా? మీకు బ్లాగు ఉంటే, అందులో మీరు కోరుకునే పద్ధతిలో వ్యాసాలు ప్రచురించుకోవచ్చు.

"విశ్వనాధుని మీద బురద చల్లడం, సంస్కృతి సంప్రదాయాలమీద బురద చల్లటంతో సమానం గా భావింపబడటం. " - సంస్కృతి, సంప్రదాయాలు ఏ దేశానికైనా జీవనాడే. అయితే వీటిలో ఛాందస భావాలు విడనాడిన నాడే జాతి ముందు కెళ్తుంది. ఆలొచనా విధానంలో ఉండవలసినది ప్రగతి, తిరోగమనం కాదు. విశ్వనాధవారి రచనలలోని దోషాలను కళా ప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారి "కల్పవృక్షఖండనం" ఇంకా 'పంచశతీ పరీక్ష' లో కనుగొనగలరు. రచన గుణ పరిశీలన బురద జల్లడం అనటం సబబా?


"అంటే, విమర్శించే పని మాత్రం రావు గారు చేస్తారు మిగతా వారందరూ తలా ఒక పుస్తక రివ్యూ రాయమని అర్థం." - అందరూ అన్ని పనులు చెయ్యలేరు. ఉదాహరణకు విశ్వనాధను విమర్శిస్తూ ఒక వ్యాసం, మీరు వ్రాయగలరా? విమర్శ కుదరనప్పుడు ఒక ప్రశంస మీరు చెయ్యవచ్చుగా. నాకు మీ గురించి ఏమీ తెలియదు. మీ గురించి రాయగలరు. మీరు గతంలో విశ్వనాధ పుస్తకాలపై సమీక్ష చేసి ఉంటే వాటి లింక్ ఇవ్వగలరు.

yogirk చెప్పారు...

రవి గారు,

ఇది "బ్లాగు ఎందుకు" అన్న చర్చగా పరిణమించటం నాకు ఇష్టం లేదు కాని, మీరు నమ్మిన సూత్రాలకు సమాధానం గా ఓ రెండు ముక్కలు. మీరు చెప్పింది సబబు గానే ఉంది. ఏది రాయాలో, ఏది రాయకూడదో ఎవరికీ నియంత్రించే హక్కు లేదు. కానీ ఒక అగ్రిగేటర్ లో మనం రాస్తున్నదంతా జనానికి చేరుతున్నప్పుడూ, మన రాతలకు వ్యాఖ్యల రూపంలో ప్రతిస్పందన మనం ఆశిస్తున్నపుడు చూసే జనం తప్పకుండా ప్రతిస్పందిస్తారు. రావు గారు ఏది రాయలో ఏది రాయకూడదో చెప్పటానికి నాకూ మీకూ హక్కు లేనట్లే, అంతే సహజం గా, స్పందించేవారు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్పే హక్కూ నాకూ మీకూ ఉండకూడదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తే chaos అయిపోతుంది కదా? అందుకే ఆయా వ్యక్తుల సంస్కారం బట్టీ ఒక్క బ్లాగు, ఒక్కో చర్చ ఒక రూపు ను సంతరించుకుంటుంది. మీరు ఈ విషయం తో అంగీకరిస్తారని అనుకుంటాను. When the blog is up on an aggregator, when the blog deals with things that naturally invoke a reaction in people, and when it is open and has an option for comments, it is but logical that people respond. Aggregators are used for community blogging. If you want to know more about the dynamics of community blogging, internet groups etc., this guy is doing some serious research, please take a look: http://www.shirky.com/writings/powerlaw_weblog.html

ఈ వ్యాసాలపై మీ స్పందించిన తీరు, చెప్పదలచుకున్న విషయాలు మంచివే. ఆ సినెమా రివ్యూ ను చదవక్కరలేకుండానే అది మీరు ఇక్కడ ఎందుకు ఉదహరించారో అర్థం అయ్యింది. నేను ఆ సినిమాను, ఇంకా దానికి మాతృక అయిన రెజినాల్డ్ రోస్ డ్రామాను రెండింటినీ చూసాను. నాకు అర్థం అయినంతవరకు, అది అమెరికన్ జ్యూరీ పని చేసే విధానాన్ని డాక్యుమెంట్ చేసే అద్భుత చిత్రం. ఇప్పుడు సినిమాను రివ్యూ చెయ్యటం నా ఉద్దేశం కాదు కాబట్టి, మనకు అవసరమయిన రెండు విషయాలు ప్రస్తావిస్తాను. ఆధారాలను, సాక్ష్యాలను కావలసిన విధం గా వక్రీకరించుకోవచ్చును. వాదించి ఇదీ విషయం అని ఒక కొలిక్కి రాలేము కాబట్టి, ఆయా వ్యక్తులకున్న దురభిప్రాయాలను (ఈ మాటను అనే అర్థం లో వాడుతున్నాను prejudice) బట్టి ఒక నిర్ణయానికి రావటం మంచిది కాదు. That the accused murdered his father is a plausibility, given various "evidence", but it is equally plausible that he is not a culprit, given the same evidence when looked from adifferent perspective. So, Because it is life that is involved, it is always better to give people benifit of doubt.

ఈ నేపధ్యంలో - మళ్ళీ అసలు చర్చకు వద్దాం. విశ్వనాథుడు "తిరోగమన వాది", "ఛాందసవాది", సాంప్రదాయవాదీ కాబట్టి ఆయన మీద వ్యంగ్య రచనలు రాయవచ్చా? దీని వెనకనున్న assumption ఏమిటంటే, సంప్రదాయవాదులని ఏ రకంగా అయినా విమర్శించవచ్చు, ఎందుకంటే సంప్రదాయం విమర్శించదగ్గది అని. మరి దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరైనా దీన్ని శాస్త్రీయం గా ఋజువు చేసారా? ఇక్కడ మీరు prejudice ని చూడకపోవడానికి గల కారణం ఏమిటి?

ఇకపోతే వర్ణ వివక్ష మాత్రమే కాదు, అన్ని రకాల వివక్షలూ అమానుషమే. సంప్రదాయాలు వర్ణవివక్షకు కొమ్ముకాచే వాదాలు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి, విశ్వనాధుడు సంప్రదాయవాది అంటునారు కాబట్టి, ఆయన వర్ణవివక్షకు కొమ్ము కాస్తాడు అని ఎలా నిర్ణయిస్తాం? మడి వర్ణవివక్షా? దళిత ప్రజల పునరుధ్ధరణ పేరుతో దళితులు కానివారెవ్వరినైనా దూషించే సంఘాలది ఏ రకమైన వివక్ష? వివక్ష లేనిదెక్కడ? కాపిటలిజం, మార్క్సిజం, హేతువాదం, హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సోషలిజం, ... వీటిల్లో దురాచారాలూ వర్ణ వివక్షా లేనిది ఎక్కడ? ఎక్కడో మీరు చెబితే, ఆ వివక్షకూ ఈ వివక్షకూ తేడా ఏమిటో చెబితే మనం వాటి గురించి, ఆ నేపథ్యంలోనుంచి విశ్వనాధుని రచనల గురించీ చర్చిద్దాం. ఏమంటారు? వివక్ష, అసమానత, దురాచారం, భ్రష్టత్వం అన్నింటిలోనూ సహజం గా చూస్తున్నదైనప్పుడు ఒక వర్గం మాత్రం తక్కువ సమానం, మిగతావాటన్నిటికీ benifit of doubt ఎందుకు?

శ్రీశ్రీ గారు ఏమి విమర్శించారో నాకు తెలియదు. కానీ పైనున్న విషయాలన్నిటినీ నిదానంగా చదివితే ఇది జనరలైజేషను కాదు అనిపిస్తుంది. However, when we are discussing things like these, there is always a problem of people cross referencing terms of natural languages(i.e the language that we use in daily life) with the language of scientific theory. If you would like to processd further and discuss purely in scientific terms, I am ready.


@cb rao - Thanks for your reply. I didnt see anything worth responding to. Context free communication doesn't entice me. I do not wish to get into inconsequential dailogues. But, if you insist, your comment will get a response that it deserves. Savvy?

అజ్ఞాత చెప్పారు...

1.'కులానిగ్గానీ, మతానిగ్గానీ, ఆచారానిగ్గానీ ఒక్క వెంట్రుకయినా పీకలేకపోయారేం ఈ యాభై యేళ్ళలో ?" -ఈ రోజున హరిజనులను కులం పేరు పెట్టి పిలువగలమా? పిలువ వచ్చునా? ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకుడికి ఏమయ్యిందో చూశాము కదా. కేవలం ఊరేగింపులో ఉన్నాడన్న కారణంగా జైలు పాలయ్యాడు.
2. విశ్వనాధవారు ఈ రోజున జాషువాను అలా అవమానిస్తే, స్పందన వేరే విధంగా వుంటుందని మీకు తెలుసు కదా!

రావు గారు,
The above comments are hypothetical.ఆ రోజుల లో ఎలా విమర్శించే వారో ఆయనని అప్పటి పరిస్థిల కనుగుణంగా నే అందరు విశ్వనథా గారిని అలానే విమర్శించారు. అంతె కాని దానిని ఇప్పటి వాటి తో ముడిపెట్టం ఎలావుంది అంటె వేటగాడి సినేమా సమయం నాటి యన్.టి.ఆర్.తో ఇప్పుడు సినెమా తీస్తె అదే విధముగా హిట్ అవుతుందా అన్నట్టు వుంది. I didn't understand why you are mentioning Andhrajyothy incident because that was a politically motivated action. They also commented lok satta jayaprakash naarayana.
మీ టపా చదవటం వలన నాకు కమ్యునిస్టులా గా(మాజి) అభివృద్ది చెద్దాలంటె అభ్రిప్రాయలు మర్చుకొవాలి అని లేక పొతే తిరోగమన వాది విశ్వనాథ గారిల పర్నశాల లో పొయి కుర్చొవాలని తెలిసింది. Thanks for this post.

అజ్ఞాత చెప్పారు...

కులంపేరు పెట్టి పిల్చినందుకు చెరసాల్లో వెయ్యడం కులహంకారాన్ని, కులగుర్తింపునీ్ బలపరచడమౌతుందా ? అంటే అగ్రకులాల్ల్ని నిమ్నకులాలవారు చట్టబద్ధంగా హింసిస్తే చాలా ? అది కులాల్ని నిర్మూలించడమౌతుందా ? లేక వాటిని వదిలించుకోవడమౌతుందా ? తెలుసుకోగోరుతున్నాను. ఇదివరకు కులబిరుదాలు ధరించే అలవాటు లేని వాళ్ళు కూడా కొత్తగా అది మొదలు పెట్టడం దేనికి సూచిక అంటారు ? ఆడవాళ్ళు కూడా కులబిరుదాలు ధరించి వ్యవహరిస్తున్నారే ! దీనికేమంటారు ? కులప్రాతిపదిక మీద ఇంకా కొత్తకొత్త కులాలకి రిజర్వేషనిస్తూ వాళ్ళ వాళ్ళ కులగుర్తింపుల్ని భద్రంగా చట్టబద్ధంగా కాపాడుతున్నారే ? దీనికేమంటారు ? ఏ పీకారబ్బా కులాన్ని ? ఖచ్చితంగా చెప్పండి బాబూ !

cbrao చెప్పారు...

@ చివుకుల కృష్ణమోహన్: "'రావు'గారూ,ఈ వ్యాసపరంపర ప్రచురించడం వెనక మీకు ఏమి 'వచ్చు'నో పూర్తిగా అర్థం అయ్యింది." - మీకు అర్థమయ్యింది,కాస్త అర్థమయ్యేలా చెప్పగలరు.

cbrao చెప్పారు...

@Aruna:"Request you to write few more articles on him. :)" - ధన్యోస్మి. మీరు ఏ ఉద్దేశంతో అన్నా, మీరు కోరుకున్నట్లే జరగబోతుంది. నా అభ్యర్ధనపై ప్రముఖ తెలుగు బ్లాగర్లు కొందరు విశ్వనాధ వారిపై కొన్ని ప్రత్యేక వ్యాసాలు కౌముది పత్రికకు రాయటానికి తమ అంగీకారం తెలిపారు.ఇక్కడ (అమెరికాలో) విశ్వనాధ పుస్తకాలు లభించటం చాలా కష్టం. గొర్తి సాయి బ్రహ్మానందం గారు (మనకు తెలియని మన త్యాగరాజు ఫేం) నా కోసం ఏకవీర పుస్తకాన్ని తెప్పిస్తామన్నారు. ఏకవీర పై సమీక్ష రాయాలని తలుస్తున్నాను. ఈ ప్రయత్నాలు విజయవంతమవ్వాలని మనం కోరుకుందాము.

cbrao చెప్పారు...

@రమణ : "విశ్వనాధగారి రచనలు మీద ఆయన విశ్వాసాలతో, ప్రసాదారావు గారి లాగే విభేదించే చే.రా. అభిప్రాయాలు బేలన్స్ తో వుంటాయి." - సంతోషం. మీ వద్ద చే.రా వ్యాసం వుంటే, దీప్తిధార కు పంపగలరు.

cbrao చెప్పారు...

@ అజ్ఞాత: "Futile attempts to portrait VSN as a villain is apparent. " - ఇక్కడ జరుగుతున్నది విశ్వనాధ భావాలు, వారి రచనలపై చర్చే కాని వారిని విలన్ గా చూపే ఉద్దేశం కాదు. చలసాని ప్రసాద రావు గారి గురించి నా కన్నా మీకు ఎక్కువ తెలుసా? 1971 నుంచి వారితో నాకు వ్యక్తిగత స్నేహం. ఎన్నో విషయాలపై ఎన్నొసార్లు చర్చించుకున్నాము. సరే, ముసుగులోంచి బయటకు రాగలరు.

అజ్ఞాత చెప్పారు...

యోగి గారు,

బ్లాగుల గురించి మీ వ్యాఖ్య సమంజసంగానే ఉంది.

"ఈ నేపధ్యంలో - మళ్ళీ అసలు చర్చకు వద్దాం. విశ్వనాథుడు "తిరోగమన వాది", "ఛాందసవాది", సాంప్రదాయవాదీ కాబట్టి ఆయన మీద వ్యంగ్య రచనలు రాయవచ్చా? దీని వెనకనున్న assumption ఏమిటంటే, సంప్రదాయవాదులని ఏ రకంగా అయినా విమర్శించవచ్చు, ఎందుకంటే సంప్రదాయం విమర్శించదగ్గది అని. మరి దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరైనా దీన్ని శాస్త్రీయం గా ఋజువు చేసారా? ఇక్కడ మీరు prejudice ని చూడకపోవడానికి గల కారణం ఏమిటి?"

నా కారణం, సంప్రదాయ వాదం అన్నది ఇప్పటిది కాదు ఎన్నో యేళ్ళ నుంచీ ఈ సమాజంలో గూడు కట్టుకున్నది., అది అభివృద్ధి నిరోధకం అని నేను నమ్మడం వల్ల. "నా కారణం" అని ఎందుకన్నానంటే, ప్రతి చర్చా చివరికి, వ్యక్తిగతంగా పరిణమించి, చివరికి, వ్యక్తిగా తను నమ్మిన సిద్ధాంతాలను బేరీజు వేసుకునే దిశగానే వెళుతుంది (ఇది నా అనుభవం కూడా). కనీసం అందువల్లయినా చర్చలు జరగాల్సిందే.

ఓ విషయం : విశ్వనాథ వారు ఎక్కడో, ఆయన ఇంట్లో ఆయన మడి కట్టుకుని కూర్చున్నందువల్ల, ఆయనను చాందస వాదిగా ముద్ర వేశారు, ఇది కేవలం ఆయన మీద కుట, ఆయన నిజమైన మానవతావాది అని నిరూపణ అయితే, నా తరపున వాదన మొత్తం వెనక్కి తీసుకోడానికి నాకు అభ్యంతరం లేదు.ఇంతకంటే, ఇక పొడిగించడానికి నా తరపున ఏమీ లేదు.

yogirk చెప్పారు...

రవి గారు,

మీరు చెప్పదలచుకున్నది నాకు అర్థం అయ్యింది. ఏదయినా ఎన్నో యేళ్ళ నుంచి సమాజంలో గూడు కట్టుకుని ఉండటం వల్ల విమర్శకు గాని, ప్రశంస కు గాని(గుడ్డి గా అనుసరించటానికి గాని) అర్హం అయిపోదు.(This line of argument is called "Appeal to Tradition", X is old and X is a tradition. Therefore X is corrupt or better. This is a logical fallacy.)

మీ కారణాన్ని నేను గౌరవిస్తూ, నేను పంచుకోవాలనుకున్న రెండు ముక్కలు చెప్పి.. మళ్ళీ బ్లాగు లోకం నుంచి సెలవు తీసుకుంటాను.

ప్రతి మనిషీ తన evolutionary learning process లో భాగంగా కొన్ని బలమైన అభిప్రాయాలనూ, నమ్మకాలనూ ఏర్పరచుకుంటాడు. సంప్రదాయలు అభివృద్ధి నిరోధకాలు అని మీరు భావించటాన్ని ఇప్పుడు నేను ప్రశ్నిస్తే అది ఇంకో పెద్ద చర్చ గా పరిణమిస్తుంది. ఏది అభివృద్ధి, ఏది కాదు. ఏది సంప్రదాయం, ఏది దురాచారం లాంటి విషయాల మీదుగా మన చర్చ నడవాల్సి వస్తుంది.

దానికిది సరైన వేదిక కాదు. దురభిప్రాయాలను వదిలి ఒక్కసారి కుదురైన మనసుతో ఆలోచించిన వారికి భారతదేశానికి ఇప్పుడు ఉన్నట్టుండి వేరేగా మానవతా వాదం ఎందుకు అవసరం లేదో తెలుస్తుంది. "ఈశావాస్య మిదం సర్వం" లాంటి మహోన్నత భావాలను ఆచరించిన జనం నడిచిన ఈ భూమిలో, రాజ్యాలను పరిపాలించిన రాజులందరూ ఏదో ఒక ఋషి వంశస్తులమని చెప్పుకోవడం గర్వం గా భావించిన ఈ భూమిలో, ప్రస్తుతం మనం చూస్తున్న ఇన్ని అవలక్షణాలు, ఇన్ని దుర్మార్గాలకూ కారణం ఏమిటి? సమాజం కోసం మహనీయులు ఏర్పరచిన దారిలో తప్పు ఉందా? "ఈశావాస్య మిదం సర్వం" లాంటి ఆలోచనల్లో తప్పు ఉందా? తప్పంటూ ఉంటే వాటిని ఆచరించకపోవటం లో ఉంది. ఇది ఒక్కటే కాదు మానవ చరిత్రలోని ఏ సిద్ధాంతాన్ని, ఏ మతాన్ని, ఏ ఆచారాన్ని, సంప్రదాయాన్ని గమనించినా అవగతమయ్యేది ఇదే: ఒక మహోన్నతమైన ఆలోచన కు degenerated versions మనం ప్రస్తుతం చూస్తున్నది. మరి పరిష్కారం? తల నొప్పి వస్తే తలకు మందు వేసుకుంటామా, తల తెగ నరుక్కుంటామా?

యూరోపియనులకు ఉన్న సంప్రదాయాల్లో కొన్ని ఇలాగే భ్రష్టు పట్టి దురాచారం గా పరిణమించాయి అనుకుందాం. భ్రష్టు పట్టిన ఆచారాలు అభివృద్ధి నిరోధకాలు అనుకుందాం, వాటి ని పరిష్కరించటానికి వారందరూ భారతీయుల సంప్రదాయాలను అనుసరించాలనడం సబబేనా? కాదు. సంప్రదాయం కాదు అభివృద్ధి నిరోధకం. సాంప్రదాయాల ముసుగులో సమాజం మీద రుద్దబడే దురాచారాలే అభివృద్ధి నిరోధకం. ఉదాహరణ గా కేరళ సామాజిక తత్త్వవేత్త నారాయణ గురు గారిని గురించి చదవండి మీకు వీలు దొరికినప్పుడు. కులాలు వికృత రూపం దాల్చి మనిషిని ఉక్కుపాదంతో తొక్కేస్తున్నప్పుడు నారాయణ గురు ఏమి చేశాడో చదవండి. అందరినీ మతం మారమని చెప్పలేదు. జనాన్ని పోగేసి మను ధర్మశాస్త్రాన్ని తగలెయ్యలేదు. వేదాల మీద దూషణ కు దిగలేదు. సంప్రదాయవాదుల మీద వ్యంగ్య రచనలు చెయ్యలేదు. నారాయణ గురు నిఖార్సయిన భారతీయ విప్లవకారుడు. శూద్రుడివి నీకు ఆలయాలు కట్టడానికీ, విగ్రహాలు ప్రతిష్టించడానికీ అర్హతనెవరిచ్చారు అన్న బ్రాహ్మణులకు నారాయణ గురు సమాధానం - "క్షమించాలి. ఇక్కడున్నది బ్రాహ్మణ దేవుడు కాదు. ఎజవ దేవుడు."

విశ్వనాథ వారు ఎక్కడో ఆయన ఇంట్లో మడి కట్టుకు కూర్చున్నందు వల్లనే ఆయనను చాందసవాది గా ముద్ర వేసారు అని నేను అనలేదు. సంప్రదాయాలను గౌరవించేవాడు సంప్రదాయ వాది. సంప్రదాయాలను వక్రీకరించి *సొంత లాభం* కోసం లేక ఒక వర్గం లాభం కోసం దురాచారం గా మార్చేవాడు చాందసవాది. ఒకవేళ విశ్వనాథుడు చాందస వాది అనే అనుకుందాం- విశ్వనాథుడనే మనిషి ఉనికి ఏమిటి? ఆయన బాహ్య ప్రపంచానికి తెలిసింది ఎలాగా? ఆయన రచనల వల్ల, అందులోని ఆయన భావజాలం వల్ల. రచనలను విమర్శించాలంటే విమర్శిస్తూ కావ్యాలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి Intellectual wars బాగా పసందు గా ఉంటాయి. భావజాలాన్ని విమర్శించాలంటే ఇన్నయ్య గారు రాసిన వ్యాసాల్లాంటివి రాయాల్సిన అవసరం లేదు. If one has to critic Indic Traditions, one has to do it using the theoretical tools of Indian culture. Can you compare apples and oranges? From fruit level, they both are fruits and thats where it stops. How do you express apples in terms of oranges? This is fallacy.From all these observations, this is just an ad hominem, non intellectual attack on Viswanatha. సంప్రదాయమన్న ప్రతి ఒక్క దాన్నీ తెగనాడ్డం, గేలి చేయటం బ్రహ్మో సమాజ రోజుల నుంచీ ఒక ఫ్యాషన్. But, is it scientific? ఈ హేతువాదుల్లో నిజం గా హేతువెంత? అభ్యుదయ వాదుల్లో అభ్యుదయ కాంక్ష ఎంత? అభివృద్ధి దార్శనికుల్లో అభివృద్ధి పట్ల అవగాహన ఎంత?

The greatest of men ever trodded this land, Budhdha, in his eternal wisdom, did he try to destroy Vedas? Did he try to eradicate every social system, every tradition and start afresh? He didn't. Because great men know - my friend, Development, betterment is not anhilation and meaningless mockery of every existing system. From DArkness to light. From lesser light to more light... carefully, step by step.

My comment doesn't invite any responses anymore. I have stopped looking telugu blogs for a while and I will go back to that mode. These were things that I seriously felt like expressing. I did. If it helps, accept it. If it doesn't ignore. Doesn't make any difference, neither to me, nor to Tradition and culture. India is too grand and too vast a symphony that a broken voilin here and there wouldn't make any difference.

Good bye!

అజ్ఞాత చెప్పారు...

ఒక సమాజనికి యాక్షన్ ప్లాన్ భావజాలం నుంచి వస్తుంది. ఆ భావజాల సరి ఐనదా కాద అని చెపట్టానికి కొంత సమయం అవసరం. భావజాలన్ని సామన్య ప్రజలకు అందించేవారు కవులు /రచయితలు. ఆరోజుల లో టి.వి.లేదు కనుక పుస్తకాలను బాగానె చదివారు అని అనుకుందాం. కాని వారి భవాజలం నిజంగా జనాన్ని ప్రభవితం చెసుంటే మనం ఇలా ఎందుకుంటాం? మనం ఒక సారి వెనుకకి తిరిగి చూసుకొని 50 - 60 సం||లా క్రితం విభిన్న వర్గాలు ( అభ్యు దయవాదులు, కమునిస్టులు,పురొగమన,తిరోగమన వాదుల ) వాదనలు, ఉద్యమాలని మనం ఇప్పుడు బెరుజు వేయాలి. ఎందుకంటె మనం ఎప్పుడైనా ఒక కొత్త నిర్ణయం తీసుకొనే టాప్పుడు, కొత్త మర్గాము లో వెళ్ళేట్టప్పుదు దాని పర్యవసానం ఎవ్వరు అప్పుడే చెప్పలేరు ఎవ్వరైనా దానిని బేరిజు వెయాలి అంటే 60 సంవత్సరాలు చాలినంత సమయం. అప్పట్లొ పై వర్గాల వారిని సమర్దించిన వారి ఫాలోయర్స్ ఇప్పుడు ఎలావున్నరు అని ఒకసారి మనం అంతా అలోచిస్తధనాలు దొరుకుతాయి. మొదట కమ్యునిస్ట్ పార్టి గురించి. అధికారం లో ఎప్పటి కి రాలేని పార్టి. అది చెసిన సేవ చేతనైన పుస్తకాలు సమాజం ఇలావుండాలి అలావుండాలి అనిరాయడం.అధికారం లో వున్న వాడిని వ్యతిరెకించడం,అధికారం ఎలా చెపట్టాలి అని పుస్తకాలు రాయడం.వాళ్లు ప్రతిపాదించిన భూ పంపక విషయం నినాదం గా మత్రమే వుండిపొయింది. రాజకీయంగా వీళ్లు నిర్ణయత్మకం పాత్రని ఎలెక్షన్స ముందు పోషిస్తారు. అధికారం లో రావలనుకునే వారు వీరి తో పొత్తు పేట్టూ కుంటెనె గెలిచినంత సంబరం పడిపోతుంటారు.పేకాట లొ గెలవాలంటె మనకు కొన్ని జొకర్లు వుండాలి అది ఆట గెలుస్తామన్న ధీమాను పెంచుతుంది. అధికార రాజకీయ జూదం లో వీరికి ఈ రొజులలో పేకాటలో జొకర్ కి వున్నంత ప్రాముఖ్యత వుంది. అధికార లో ఉన్నణ్ణాలు ఏ పార్టి ఐనా డబ్బు ఉన్నవాలకి అనుకూలం గా నిర్ణయాలు తీసుకొంతుంది. వీళు దానికి వ్యతిరేకం గా పోరాడుతారు. వాళ్లకి సాహయం గా మద్దతిచిన బీద బిక్కి ఓట్లను పొత్తుల రూపం లో మళ్ళీ అధికారం లో వచ్చె వారికే ఓటై పిస్తారు. అలా మర్క్స్ గారి గతి తార్కిక వాదనని అమలు లో కి తెస్తారు. రాజకీయ పార్టిల లో వారసత్వం పోరు లేని ఎకైక పార్టి అది, ఎందుకంటె ఉన్న కొంతమంది అగ్ర నయాకుల పిల్లలు అభివృద్ది లో కి వచ్చి విదేశాల లో స్తిరపడ్దరు మిగిలిన వారు ఒక ప్రాంతీయ పార్టి లొ చేరారు అందువలననే అంధ్రా జిల్లలో ఒక్క ప్పుడు ప్రత్యామన్యాం గా వున్న పార్టి ఇప్పుడు 3వ స్థాననికి దిగజారింది. రేపు ఇది 4వ స్థానాని కి దిగినా అశ్చర్య పడవలసిన అవసరం లేదు. కొంతమంది ప్రజా గాయకులు ఇప్పుడు ఆంధ్ర సుర్జిత్ సింగ్ అవతారమేత్తారు. మరి ఇనాడు కొంత మంది చేస్తున్న సమజ సేవ ఆ పుస్తకాల లో ఉండే అద్భుత భావాలను పని చెసే వాళ్ళాకు వ్యతిరేకం గా ఎక్కు పెట్టటం. గొప్ప వాళ్ల భవించడం. అంత కు మించి కమ్యునిస్తు వలన ఇంకెమి ఉపయొగం లేదు. మరి మీరు చెప్పిన పురోగమన వాదులలో మత చాందసవాదని వ్యతి రేకించి కులత్త్వన్ని వదలేని వారు కొందరు, ఒకరు మీరు ముందుకు పదండి నేను మీ కోసం మందు కొట్టి ఆలొచిస్తాను ఇలా అన్ని వర్గాల వారు వున్నారు. మరి అప్పటి వరి భావజాలం ఇప్పటి యక్షన్ ప్లాన్ గా ప్రస్తుత సమజం లో ఎలావుంది అనేది నెట్ లో బ్లొగ్స్ కొన్ని వెబ్ sites చదివితె మీకె అర్థమౌతుంది. Usha Chowdhary: 'Caste-Icons' And Their Charisma
http://www.greatandhra.com/ganews/viewnews.php?id=12295&తప్పు చెసినా ఒక వర్గం వాళ్లు బాధపదతారు కాబట్టి మనము ఏమి అనకుడదు అన్నది ఆ టపా సారాంశం. ళ్ళినా ఆటా, తానా వర్గలా వాళ గురించి అందరికి తెలిసిందే. భారత ప్రభుత్వం నిర్వహించిన పరిక్షలొ నెగ్గిన జయప్రకాష్ నారాయణ ని ఇంటర్వు చెసినా వాడు ఆయన వర్గానికి చెంది వుంటాడు అందువలననె ఆయనకు ఐ.ఎ.యస్. వచ్చింది. ఎవరైన ఇటువంటి వారికి ప్రతిస్పందిస్తె వారి మీద అట్రసిటి కేస్ పెట్టటము. ప్రతి ఒక్కరిని కుల దృష్టిలో చూడడం, లెక పొతె గతి తార్కిక వాదం దృష్టి తో అదీ చాలక పొతె దలిత వాదం, ఎవ్వరిని ఎవ్వరు నమ్మలేని విధంగా మొత్తానికి ప్రతి రంగాన్ని కలుషితం చేయడం అనేది ఆనాటి అభ్యుదయ వాదులు, కమ్యునిస్ట్లూ సాధించిన గొప్ప విజయం. మరి దీని వలన సామన్యుల కు ఎంత నష్టం, కష్టం కలుగు తున్నాదో ఎవ్వరు అలోచించటం లేదు. ఇప్పుడు విశ్వనాధ తిరొగమన వాదాన్ని వాస్తవం గా సామన్యుల లో అమలు చేస్తున్నది ఎవ్వరో అందరికి తెలుసు. మరి పురోగమన వాదులు, కమ్యునిస్టులు అనిచెప్పుకున్న వారు కూడా ఈ కుల దృక్పదం నుండి ఎందుకు బయటకు రాలేక పొయారు? లోపం ఎవ్వరిది? ఎక్కడ వున్నాది? How can we rectify it?

అజ్ఞాత చెప్పారు...

యోగి గారు,

మంచి స్పందన. మీతో పూర్తి స్థాయిలో చర్చించలేక పోయినందుకు అన్యథా భావించరని ఆశిస్తాను. తిరిగి కలుసుకుందాం. అప్పుడప్పుడూ మీరు మీ పంతం మాని తెలుగు బ్లాగులకోసం సమయం కేటాయించగలరు.:-)

cbrao చెప్పారు...

@భైరవభట్ల కామేశ్వర రావు: మీరు మీ జాబులో ఉదహరించిన Digital Library లోని విశ్వనాధ పుస్తకాలకు గొలుసులు (links) ఇవ్వగలరు. విశ్వనాథ భావజాలం గురించి ప్రత్యేకంగా రాస్తున్నాను.

cbrao చెప్పారు...

@వికటకవి: "అసలు ఈ ఒకళ్ళ మీద మరొకళ్ళు పడి ఏడిచే సంస్కృతికి కొంపదీసి ఆంధ్రులే ఆద్యులు కాదు కదా? " - విశ్వనాధ వారి బ్రాహ్మణేతర నీచత్వ తత్వ విమర్శలు మీకు విమర్శకుల ఏడుపులా వున్నాయా? అది విశ్వనాధ భావజాల ఖండన.

వికటకవి చెప్పారు...

భలే వారే, అసలు ఏమాత్రం వీరిరువురు ఎవరో తెలియనివాడికి ఈ వ్యాసం ఇచ్చి చదివించండి. వ్యాసం రాయటానికి ముందే రచయిత అవతలి వ్యక్తి మీద ఓ దురభిప్రాయం ఏర్పరచుకుని రాసాడని క్షణంలో చెప్తారు.సాహిత్య విషయాలు పక్కనపెట్టండి. సాహితీ విమర్శ కన్నా వ్యక్తిగత విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. అదే నా బాధ. జ్ణానపీఠ్ ని జాక్ పాట్ అనటం దానికి పరాకాష్ట.

కామేశ్వరరావు చెప్పారు...

సి.బి.రావుగారు,

మీరడిగిన DLI లింకులు ఇక్కడ చూడవచ్చు:
http://telugupadyam.blogspot.com/2009/02/digital-library.html

Unknown చెప్పారు...

మీరు ఆనాడు విశ్వనాథ సత్యనారాయణతో జరిగిన సంగతి gurinchi రాసిన వ్యాసం చదివి acharya పోయాను. ఎంత పెద్ద కవిఐన చద్స్తావాదులు అంటే. కానీ కంమునిస్తులకేమింది. నీనీ మధ్య మాట గ్రంధాలూ కావాలంటే విసలన్ధ్రలో దొరుకుతాయని మా మిత్రులకు చెపుతుంటాను. అక్కడ భావ విప్లవ పుస్తకాలూ దొరకవు. కానీ ఈ విధమే ఆనాడు కూడా ఉందంటే ఆచర్యంగాక మరీమిటి. ఒక విశాలాంధ్రలో బహుశ విజయవాడ లో కౌంటర్లో నిలువెత్తు బొట్టు పెట్టుకొనే భక్తుడు ఉండడం చూసాను. అది ఎపుడో సమాజాన్ని విడిచి వ్య్పరాన్ని చేపట్టిందని చెప్పా వచును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి