మంగళవారం, ఆగస్టు 12, 2008

ఇలాకూడా జరగొచ్చు

దీప్తిధార మొదటనుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నది. ఇన్నయ్య గారు, చదువరి, దిల్, తాబాసు వంటి మిత్రులు సమకాలీన రాజకీయ విశేషాలను విశ్లేషిస్తూ చాలా ఉపయుక్తమైన వ్యాసాలు రాస్తూ ఉన్నారు. ఎంత వద్దనుకున్నా, రాజకీయాలు వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నేను రోజూ చదివే ఆంధ్రజ్యోతి పత్రిక పై దాడి జరిగినా, దానిపై ఇంకా దాడులు చేస్తామన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఎందుకు వదిలేసిందో తెలుసుకోవాలన్నా, ఈ రాజకీయాలను కొద్దిగానైనా అర్థం చేసుకోవాలి. ఇంగ్లీషు లో ఒక సామెత ఉంది. Politics is the last refuge of a scoundrel. రాజకీయాలు ఒక మురికి కూపం అనుకుని ఓటు వేయటం దండగనుకుంటే, మనలను పాలించే వారిని విమర్శించే హక్కు మనకుంటుందా? సార్వత్రిక ఎన్నికలలో ఇంతవరకూ ఒకే సారి ఓటు హక్కు ఉపయోగించుకోలేకపోయాను. పోలింగ్ బూత్ మారటమో లేక మరేదో కారణం వలన. పట్టణాలలో, విద్యావంతులలో వోటు వేయక పోవటం ఎక్కువగా ఉంది. గ్రామాలలో చదువుకోని రైతులు తమ వోటు హక్కు వినియోగించుకుంటున్నారు. రైతుల వెతలకు కారణమైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వోటు వేస్తున్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు, నాయకులు, తమ తప్పు తెలుసుకొంటున్నారు.

chalasani-2  

Chalasani Prasada Rao Painting by R.K.Laxman

చాలా కాలం క్రితం మిత్రులు కీ.శే.చలసాని ప్రసాద రావు (విపుల, చతుర మాస పత్రికల సంపాదకులు) ఇలా మిగేలేం అనే పుస్తకంలో కమ్యూనిస్ట్లను ఒక పట్టు పట్టేరు. వాళ్ల తప్పుల్ని రాచి రంపాన పెట్టారు. మొన్న ఒక సాయంకాలం ఇన్నయ్య గారు, మా ఇంటికొచ్చిన సందర్భంలో, మమ్ములను వదిలి వెళ్లిన, ప్రియ నేస్తం గురించి, ముచ్చటించుకున్న సందర్భం లో, ఈ పుస్తకం గురించి మాట్లాడుకోవటం జరిగింది. ఆ సందర్భంలో ఇన్నయ్య గారు చెప్పిన కొన్ని రాజకీయ తమాషా వార్తలు, మీ ముందుంచుతున్నాను.

రాజకీయాలలో ఇలాకూడా జరగొచ్చు .

1) డాక్టర్ మర్రిచెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా, ఒక వైపు తాను కూర్చుని, మరొక వైపు బంగారంతో తులాభారం చేయించుకున్న 1980 ప్రాంతాలలో, ఆయనను దించెయ్యాలని, అవినీతుపరుడని, కాంగ్రెస్ వారిలో పెద్ద విభాగం ధ్వజమెత్తి సఫలీకృతమయ్యింది. అలాంటి రోజులలో ప్రతిపక్ష నాయకుడిగా సుప్రసిద్ధ కమ్యూనిస్ట్ పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నారు. ఒకరోజు ఉదయాన్నే ఆయన file పట్టుకుని, సచివాలయంలో, Drainage Board Chairman గా కార్యాలయంలో కూర్చొన్నారు. చాలామంది ఆశ్చర్య పోయి, నోరు నొక్కుకున్నారు. ఇది జరిగిందా లేదా అని సందేహించవద్దు. అలాంటి ముఖ్య మంత్రి కింద, కమ్యూనిజం కొనసాగదని, ఆయన ఆలస్యంగా గ్రహించి పదవి వదిలేశారు.

2) నూజివీడు జమీందారు మేక రంగయ్య అప్పారావును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, కమ్యూనిస్టులు, ఆయన పై దాసరి నాగభూషణం ను శాసన సభ ఎన్నికలకు పొటీ పెట్టారు. అప్పుడు ఓడి పోయిన ఆ కమ్యూనిస్టులు మరోసారి ఎన్నికలలో అదే జమీందారుకు జై కొడ్తూ, సమర్ధిస్తూ బలపరిచారు. కీర్తి శేషులు చలసాని ప్రసాద రావు ఇలా మిగిలేం అనే పుస్తకం లో కమ్యూనిస్టు లను చీదరించుకుంటూ, చీల్చి చెండాడుతూ, పుస్తకం ప్రచురించారు.

Harkishen Singh Surjeet 

Harkishen Singh Surjeet Pic Courtesy: APP Photo

3) సిక్కుల మతం ప్రకారం జుత్తు కత్తిరించుకోకూడదు, తలపాగా ధరించాలి. విధిగా అటువంటి నియమాలు పాటించాలి. కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నేతగా, కార్యదర్శిగా, చిరకాలం కొనసాగిన సూర్జిత్ సింగ్ తూచా తప్పకుండా సిక్కు మత నియమాన్ని తన వేషం లో పాటించారు. అదేమంటే అది సంస్కృతి అని చెప్పారు.

4) కేరళ లో కమ్యూనిస్టులు అధికారం లోకి వచ్చినప్పుడు, అచ్యుతమీనన్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు, హేతువాదులంతా ఊరేగింపుగా ఆయన దగ్గరకు వెళ్లారు. అయ్యప్ప పేరిట కొండ పైన జనానికి చూపించే మకర జ్యోతి, టన్నుల కొద్దీ వెలిగించిన కర్పూరం ఫలితమనీ, దానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని, ప్రజలను  మోసపుచ్చుతున్నారని, అది ఆపాలని కోరారు. పర్యాటక ఆదాయం లభిస్తుంది కనుక, హేతువాదులు చెప్పేది వాస్తవమైనప్పటికీ, చూసీ చూడనట్లుగా పొమ్మనమని, ముఖ్య మంత్రి, సలహా ఇచ్చారు.

5) కమ్యూనిజం మత విమర్శతో ప్రారంభం కావాలని, మతం మత్తుమందు వంటిదని, ప్రజలకు ఇది విప్పి చెప్పాలని మార్క్స్ అన్నాడు. సిసలైన మార్కిస్ట్ల మని అధికారం లోకి వచ్చిన పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీ, దేవీ నవరాత్రుల ఉత్సవాలను ప్రోత్సహించి, సహకరించి, సెలవులిచ్చి పాల్గొంటున్నది. అదేమంటే సంస్కృతి అనే ముసుగులో దాటేస్తున్నారు.

5 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

నిబద్ధత లేనప్పుడు ఏ ఇజం వల్లా ఒరిగేది ఏమీ లేదన్నమాట. ఇటీవల భూపోరాటం చేసి ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతిన నాయకుల్లో కొందరు ప్రతి చోటా తమకూ ఒకటో రెండో ప్లాట్లు తమకోసం కూడా సంపాదించుకున్నారని వినికిడి.

netizen నెటిజన్ చెప్పారు...

మరి అదే ప్రసాదరావు, బడా పారిశ్రామికవేత్త రామోజిరావు,అద్దాల ఏ.సి గదిలో కూర్చుని రాళ్ళు విసిరుతున్నాడని అన్న విమర్శ కూడా వచ్చింది మీరన్న 'ఇలా మిగిలాం' చదివిన తరువాత!

కమ్యునిష్టు నేతలందరు అగ్ర కులాలవారే అని దళితుల ఇంకా అనలేదు. (అన్నారా?) మరి దానికి జవాబు ఏవిటో!

innaiah చెప్పారు...

ఈనాడు లొ చలసాని తో పాటు చాలమంది కామ్రెడ్లు చేరి పనిచేశారు.ఎ బి కె ప్రసాద్ , వి.హనుమంతరావు, గజ్జెల మల్లారెడ్డి ఇంకా ఇంకా.
చలసానిని విమర్శ చేసిన వీర కమ్యూనిస్తులు కొందరు
తమవారికి ఈనాడులో వుద్యొగాలు ఇప్పీంచమని ప్రధెయ పడితే చలసాని నవ్వుకున్నాడు.

అజ్ఞాత చెప్పారు...

is there any book available in the market as the compilation of chlasani prasada rao's "kaburlu" of eenadu

cbrao చెప్పారు...

@veera: చలసాని ప్రసాద రావు పుస్తకాలు పెద్ద పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతున్నాయి. మీరు ఉదాహరించిన కబుర్లు కూడా లభ్యమవుతాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి